జగన్ వారిని గెలిపించుకుంటారా..?

గత ఎన్నికల్లో అధికారం అందినట్లే అంది చేజారిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కుంది. వైసీపీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినా తెలుగుదేశం [more]

Update: 2019-04-28 02:30 GMT

గత ఎన్నికల్లో అధికారం అందినట్లే అంది చేజారిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కుంది. వైసీపీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినా తెలుగుదేశం పార్టీ తెరలేపిన ఫిరాయింపు రాజకీయాలతో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. వైసీపీ జెండాపై, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలు వరుసబెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వెళుతూ వెళుతూ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, అప్పుడు చంద్రబాబు టార్గెట్ వేరే ఉండేదనే ప్రచారం జరిగింది. ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మందిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొని వైసీపీ శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకొని జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వొద్దని భావించారట.

ప్రలోభాలకు లొంగకుండా…

దీంతో పాటు ఎమ్మెల్యేలు వరుసబెట్టి పార్టీని వీడితే జగన్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, పార్టీ పట్ల క్యాడర్ లో నమ్మకం పోతుందని టీడీపీ ప్లాన్ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నించింది. పలువురు ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను బూచీగా చూపించి పార్టీలో చేర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందిని పదవులు, కాంట్రాక్టులతో ప్రలోభ పెట్టారని వైసీపీ ఆరోపించింది. వైసీపీ ఆరోపించినట్లుగానే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురికి చంద్రబాబు తన క్యాబినెట్ లో మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు. అయితే, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోనే కొనసాగి చంద్రబాబు ప్లాన్ ను ఫెయిల్ చేశారు. 23 మంది మినహా మిగతా 44 మంది ఎమ్మెల్యేలు జగన్ తోనే ఉండటంతో వైసీపీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవాలనే చంద్రబాబు వ్యూహం ఫలించలేదు.

పేరుకే ఎమ్మెల్యేలు…

తనను నమ్మి ప్రలోభాలకు లొంగకుండా తనతోనే ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పుడు జగన్ గెలిపించగలరా అనే ఆసక్తి నెలకొంది. ఫిరాయింపుదారులు పోను 44 మంది ఎమ్మెల్యేల్లో 40 మందికి జగన్ మళ్లీ టిక్కెట్లు ఇచ్చారు. వీరి నియోజకవర్గాల్లో జగన్ ప్రచారానికి వెళ్లినప్పుడు, అంతకుముందు పాదయాత్రలోనూ వీరి గురించి సభల్లో జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా తనతోనే ఉన్నారని ప్రజల్లోనే జగన్ వారి గురించి గొప్పగా చెప్పారు. ఇది ప్రజల్లోనూ ఆ ఎమ్మెల్యేల పట్ల ఇమేజ్ పెంచింది. ఈ 40 మందిలో ఎంత మంది మళ్లీ గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రతిపక్ష పార్టీలో ఉన్నందున వీరు నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయారు. వీరు ఎమ్మెల్యేలుగా ఉన్నా వీరిపై ఓడిపోయిన టీడీపీ నేతలు, ఇంఛార్జిలు అనధికార ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో చక్రం తిప్పారు. నియోజకవర్గాల అభివృద్ధి క్రెడిట్ కూడా టీడీపీ ఇంఛార్జిలకే వెళ్లింది. దీంతో వీరి గెలుపు అంత సులువు అయితే కాదు. మరి, జగన్ తో ప్రలోభాలకు లొంగకుండా ఉన్నవారు ఎంతమంది గెలుస్తారో చూడాలి.

Tags:    

Similar News