బాండింగ్ కు బ్రేకులు?

జగన్ రాజకీయ పరమపద సోపానంలో ఎందరో కలిసారు. విడిపోయారు. జగన్ తో ఇపుడున్న వారి కంటే ఎన్నో రెట్లు మొదట్లో ఉండేవారు. అయితే ఎవరి అవసరాలు వారివి. [more]

Update: 2020-02-17 03:30 GMT

జగన్ రాజకీయ పరమపద సోపానంలో ఎందరో కలిసారు. విడిపోయారు. జగన్ తో ఇపుడున్న వారి కంటే ఎన్నో రెట్లు మొదట్లో ఉండేవారు. అయితే ఎవరి అవసరాలు వారివి. ఎవరి ఆలోచనలు వారివి. దాంతో మధ్యలోనే అలా చాలామంది విడిపోయారు. ఇక జగన్ కోసమే అంటూ ఇప్పటివరకూ కంటిన్యూ అయిన వారు కూడా ఎక్కువమందే ఉన్నారు. వారిని జగన్ కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే జగన్ కి బయట ఏ పార్టీతోనూ, నాయకునితోనూ రాజకీయ వియ్యాలూ, నెయ్యాలు లేవు. జగన్ అలా ఎటువంటి బేరాలు ఇప్పటిదాకా ఎవరితోనూ పెట్టుకోలేదు. ఎంతసేపూ తన సొంత కృషినే నమ్ముకుని సాగారు. దానికి మరో కారణం జగన్ ఆలోచనా విధానం అని కూడా చెప్పాలి. జగన్ ఎవరి సలహాలు వినరని పేరు కూడా ఉంది. అందువల్ల ఆయన ఏం చేసినా తనకంటూ పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాన్ని కోరుకునే చేస్తారు. అంతవరకే అవతల వారికి అవకాశం కూడా ఇస్తారు.

చిత్రమైన బంధం….

ఇక జగన్, కేసీఆర్ ల మిత్ర బంధం గురించి చెప్పాలంటే అది చాలా చిత్రమైంది. ఎందుకంటే ఇద్దరికీ వయసు రీత్యా చాలా తేడా ఉంది. రాజకీయాల్లో చూసుకున్నా జగన్ బాగా జూనియర్. పైగా జగన్ తండ్రి వైఎస్సార్ తో నిత్య కలహాలే కేసీఆర్ కి ఉండేవి. మొదట్లో జగన్ విషయంలోనూ టీఆరెస్ గట్టిగానే ఉండేది. దానికి మానుకొండ ఘటన ఒక ఉదాహరణ. అయితే ఇవన్నీ విభజనకు ముందు జరిగినవి, ఇక ఏపీ, తెలంగాణా విడిపోయాక జగన్, కేసీఆర్ ల స్నేహం బాగా బలపడింది. దానికి కారణం శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నీతి ఇక్కడ అమలు కావడమే. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు. అందువల్ల ఆయన్ని తొక్కేయడానికి జగన్ ని కేసీఆర్ ప్రోత్సహించేవారు. మొత్తానికి జగన్ సీఎం అయ్యారు. మొదట్లో ఇద్దరికీ మంచి బాండేజ్ ఉన్నట్లుగా కనిపించినా ఇపుడిపుడే అది బ్రేకులు పడేలా ఉందని అంటున్నారు.

బీజేపీతో అలా….

జగన్ బీజేపీతో వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. మోడీతో జగన్ సాన్నిహిత్యం ప్రత్యేకమైనది. బీజేపీలో మోడీ ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఏమో కానీ మోడీ వరకూ చూసుకుంటే మాత్రం జగన్ ఆయన వైపే మొగ్గు చూపుతారు. మోడీ ఎందరికో అరవీర భయంకరమైన శత్రువుగా ఉన్నా జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం పుత్ర వాత్సల్యం చూపిస్తారని అంటారు. ఈ ఇద్దరికీ ప్రత్యేకమైన అనుబంధం. అందువల్ల మోడీని కాదని జగన్ ముందుకు సాగరని అంటారు. అందుకే ఆయన బీజేపీకి కూడా దూరంగా ఉండలేకపోతున్నారు. అది కేసీఆర్ తో చెలిమికి ఇబ్బంది కలిగించినా కూడా జగన్ మోడీకే జై అంటారు. దానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అందులో రాష్ట్ర ఇబ్బందులు, జగన్ వ్యక్తిగత ఇబ్బందులు కూడా కేంద్రంతో దోస్తీకి కారకాలు అవుతున్నాయి.

ఎవరి దారి వారిదేనా?

జగన్ ఈ మధ్యన ఢిల్లీ టూర్ వేయడం, మోడీ, అమిత్ షాలతో వరస భేటీలు వేయడాన్ని కేసీఆర్ సీరియస్ గానే గమనిస్తున్నారని అంటున్నారు. జగన్ ని తన వైపునకు తిప్పుకుని ఫెడరల్ ఫ్రంట్ పెట్టి జాతీయ స్థాయిలో జెండా పాతాలని కేసీఆర్ భావిస్తూంటే జగన్ మోడీ గ్రేట్ అంటున్నారు. దీంతో ఇద్దరు మిత్రుల మధ్య తంటా వస్తోందట. జగన్ కి ఇపుడు మోడీ అవసరం ఉందని, అందువల్లనే కేసీఆర్ ని లైట్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. పైగా కేసీఆర్ ఇచ్చే సలహాలు కూడా జగన్ కి రుచించడం లేదని చెబుతున్నారు. జగన్ మరి కొన్ని టెర్ములు ఏపీ సీఎంగా ఉండాలనుకుంటున్నారు. ఆయనకు కేంద్రంలో ఎవరు పీఎం అయినా ఒక్కటే. కేసీఆర్ కి అలా కాదు, తన కొడుకుని సీఎం చేసి తాను జాతీయ స్థాయిలో కీలకం కావాలనుకుంటున్నారు. దానికి జగన్ మద్దతు ఉండదంటే ఉండదని తన చేతల ద్వారా వైఎస్సార్ గారి అబ్బాయి చెప్పేస్తున్నారు. దాంతో ఇద్దరి మధ్యన దూరం పెరిగిపోతోంది.

Tags:    

Similar News