జగన్ ను గెలిపించేది వారేనా..?

అనుభవం పాఠాలు నేర్పుతుందని పెద్దలు అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇది నిజమే అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ [more]

Update: 2019-05-03 02:30 GMT

అనుభవం పాఠాలు నేర్పుతుందని పెద్దలు అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇది నిజమే అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి అధినేత వరకు అందరికీ కావాల్సినన్ని పాఠాలు నేర్పింది. గత ఎన్నికల అనుభవంతో ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా, జాగ్రత్తగా వ్యవహరించింది. ముఖ్యంగా కార్యకర్తల్లో గత ఎన్నికల్లో ఓటమి ఈసారి కసి పెంచింది. ఎలాగైనా తమ పార్టీ గెలవాలనే పట్టుదలతో ఆ పార్టీ కార్యకర్తలు పనిచేశారు. బూత్ కమిటీ సభ్యుడి నుంచి ప్రతీ ఒక్కరూ పార్టీని గెలిపించేందుకు బాగా కష్టపడ్డారు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు నిజంగానే ఆ పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ లో కచ్చితంగా సింహభాగం పార్టీ కార్యకర్తలకే దక్కుతుంది.

కసితో పనిచేసిన కార్యకర్తలు

గత ఎన్నికల ముందు వరకూ వైసీపీ గెలుస్తుందనే అంచనాలు ఉండేవి. ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన కార్యకర్తల బలం లేకపోవడం, ఉన్న చోట్ల కూడా అధినేత ఇమేజ్ తమను గెలిపిస్తుందని కార్యకర్తలు అలసత్వంగా ఉండటం, పోల్ మేనేజ్ మెంట్ ను పూర్తిగా పట్టించుకోకపోవడం వంటివి వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు. ఇదే సమయంలో టీడీపీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉండటం, పోల్ మేనేజ్ మెంట్ బాగా చేయడం ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. ఈ ఐదేళ్లు వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో ఇబ్బందులను ఎదుర్కున్నారు. ప్రభుత్వ పథకాలు అందలేదు. అధికార పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల్లో చేరి గ్రామాల్లో హవా నడిపించారు. ఇది వైసీపీ కార్యకర్తల్లో కసి పెంచింది. ఎలాగైనా ఈసారి తమ పార్టీ గెలవాలనే పట్టుదల వచ్చింది.

ప్రజలకు అందుబాటులో ఉంటూ…

గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి జరగకుండా వైసీపీ ముందునుంచే పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టింది. బూత్ ల వారీగా ప్రతీ 50 ఇళ్లకు ఒక కార్యకర్తను నియమించారు. పోలింగ్ రోజుల అందరినీ తీసుకువచ్చి ఓట్లేయించి పోలింగ్ శాతం పెరిగేలా ఈ ప్రయత్నం ఫలించింది. దీంతో ఈసారి పోల్ మేనేజ్ మెంట్ లో వైసీపీ కూడా బాగానే సక్సెస్ అయ్యింది. ఇక, అంతకుముందు నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ వైసీపీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. స్థానికంగా విభేదాలు ఉన్నచోట్ల కూడా పక్కనపెట్టేసి తమ బూత్ లో మెజారిటీ రావాలనే పట్టుదలగా పనిచేశారు. పోలింగ్ రోజు కూడా వైసీపీ ఏజెంట్లు జాగ్రత్త వహించారు. ఇక, ఐదేళ్ల కాలంగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అటు టీడీపీ వారితో, ఇటు జనసేన వారితో తలపడుతున్నారు. ఎప్పటికప్పుడు పార్టీకి అనుకూలంగా ప్రతీ అంశాన్నీ సోషల్ మీడియాలో స్వచ్చందంగా ప్రచారం చేశారు. ఇలా ఈసారి ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు కసితో పనిచేశారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఆ క్రెడిట్ లో సింహభాగం వారిదే అని చెప్పవచ్చు.

Tags:    

Similar News