30 ఏళ్ల సంగతి దేవుడెరుగు.. మూడేళ్ల తర్వాత?

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నారు. జగన్ టార్గెట్ కూడా అదే. అందుకే సంక్షేమ పథకాలను కుమ్మరించేస్తున్నారు. కానీ మూడు ప్రాంతాల్లో ఆరుగురు నేతలు [more]

Update: 2021-01-18 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నారు. జగన్ టార్గెట్ కూడా అదే. అందుకే సంక్షేమ పథకాలను కుమ్మరించేస్తున్నారు. కానీ మూడు ప్రాంతాల్లో ఆరుగురు నేతలు జగన్ కు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. ఒక్కసారికే జగన్ ను ఇంటికి పంపించే ఛాన్స్ కూడా లేకపోలేదు. దీనికి కారణం పెత్తనం. అనేక జిల్లాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు నేతల కారణంగా ఈసారి 151 సీట్లు కాదు గదా? అందులో డబుల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జగన్ ను ముంచుతున్నదీ, ముంచేది ఆ నేతలేనన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది.

కొందరికి రాసిచ్చినట్లే….

జగన్ కొన్ని జిల్లాలను, ప్రాంతాలను కొందరికి రాసిచ్చినట్లే కనపడుతుంది. అక్కడ వారు చెప్పిందే వేదం. తమ పార్టీ ఎమ్మెల్యేలయినా వారికి అవసరం లేదు. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెట్టి సొంత ప్రయోజనాలే చూసుకుంటుండటంతో వైసీపీలో విభేదాలు రచ్చ కెక్కుతున్నాయి. దీంతో వారి పేరు బయటకు చెప్పకపోయినా అధికారులపై వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అధికారులు వారిమాట వినకపోవడానికి జగన్ నియమించిన ఈ ధర్మకర్తలే కారణమని అందరికీ తెలిసిందే.

వైసీపీ ఎమ్మెల్యేలే….?

చిత్తూరు జిల్లాను తీసుకుంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పింది వేదం. ఆయన మాట శాసనం. ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యే రోజా బహిరంగంగా చెప్పకపోయినా అధికారులు తనను పట్టించుకోవడం లేదని విలపించడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా లేకుండానే సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఎవరి ప్రోద్బలమనేది చెప్పనవసరం లేదు. ఇక నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ పెత్తనం చేస్తున్నారంటున్నారు. అక్కడ ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా నెల్లూరు ఎస్పీపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ఇలా అయితే గెలిచేది ఎలా?

ఇక ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, రాయలసీమ ప్రాంతంలో సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకే విలువ లేకుండా పోతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చెప్పిినట్లే అంతా జరుగుతుంది. ఇలా కొద్ది మంది చేతుల్లోనే అధికార యంత్రాంగం ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే తాము తిరిగి ఎలా గెలుస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే కొనసాగితే 30 ఏళ్ల సంగతి పక్కన పెడితే మూడేళ్ల తర్వాత మునిగిపోవడం ఖాయమన్న విశ్లేషణలు బలంగా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News