చేతులు కలపడం వెనుక రీజన్ అదేనా…?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల నడుమ కొత్త ప్రభుత్వం వచ్చే ముందు వరకు ఉప్పు నిప్పు పరిస్థితి. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చాక రెండు రాష్ట్రాల సిఎం ల [more]

Update: 2019-07-09 15:30 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల నడుమ కొత్త ప్రభుత్వం వచ్చే ముందు వరకు ఉప్పు నిప్పు పరిస్థితి. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చాక రెండు రాష్ట్రాల సిఎం ల మధ్య గాఢమైన అనుబంధం గతానికి పూర్తి భిన్నం. విభజన అనంతరం లెక్కలేనన్ని చిక్కుముడులతో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవి ఒక్కోటిగా పరిష్కారం కావాలి అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై మరొకరు నమ్మకం , విశ్వాసం కలిగి ఉండాలి. చంద్రబాబు తెలంగాణా రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో కెసిఆర్ ఆయన్ను దూరం పెట్టారు. ఓటుకు నోటు కేసు తరువాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కొనసాగేది.

పెరిగి పెద్దవైన సమస్యలు…

ఫలితంగా విభజన సమస్యలు మరింత పెరిగి పెద్దవి అయ్యాయి. ఐదేళ్ళ కెసిఆర్ పాలనలో టి సర్కార్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఎపి కి అయితే చెప్పనలవి కానీ సమస్యలు. అందుకే మొన్నటి ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కార్ రావాలని గులాబీ పార్టీ బలంగా కోరుకుంది. అందుకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తిగా అందించింది. హైద్రాబాద్ లోని పారిశ్రామిక వేత్తల చేత వైసిపికి ఆర్ధిక సహకారం ఇప్పించింది. కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పడితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఐక్యంగా నడిస్తే ఎంపీల సంఖ్య పెరిగి గట్టిగా వత్తిడి తెచ్చే అవకాశం కోసం ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి తెచ్చి జగన్ మద్దతు కోరారు. అలా అనేక రకాలుగా జగన్ కెసిఆర్ నడుమ స్నేహం చిగురించింది.

జగన్ చేసిన ప్రతిపాదనకు …

గోదావరి మిగులు జలాలు ప్రతి ఏటా రెండు నుంచి మూడువేల టి ఎం సిలు సముద్రం లో కలుస్తున్నాయి. ఈ నీటిలో కనీసం పదోవంతు ప్రాజెక్ట్ ల ద్వారా వినియోగిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగు తాగు నీరు కి లోటు ఉండదు. దీనికి ఇద్దరు సిఎం లు పూర్తి గా సహకరించుకోవాలి. కృష్ణా జలాల తో గోదావరిని శ్రీశైలం లో కలిపితే ఇరు రాష్ట్రాల్లో జలసిరి పొంగుతుంది. కర్ణాటక విడుదల చేసే నీటిపై ఆధారపడవలసిన అవసరం తప్పుతుంది. రాయలసీమ నీటి కష్టాలకు చెక్ పడుతుంది. గోదావరి శ్రీశైలం చేరేందుకు తెలంగాణ భూభాగం నుంచి కాలువలు ఎత్తిపోతల పథకాలు అవసరం అవుతాయి. అందుకే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి , కెసిఆర్ ను ఒప్పించారు. రెండు రాష్ట్రాలకు నీటి సమస్య తీరితే వ్యవసాయ పరంగా దేశంలో తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ అవుతాయి. ఆ లక్ష్యంతోనే ఎపి సిఎం సాగుతున్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే సఖ్యత బలపడుతుంది అని గుర్తించి వాడకం లో లేని ఎపి భవనాలు తెలంగాణకు అప్పగించారు.ఇలా ముందు తాను చొరవ చూపి అత్యంత కీలకమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు.

Tags:    

Similar News