జగన్ ప్రాబ్లం సాల్వ్ అయినట్లేనా..?

ఓ వైపు అన్నపిలుపు, సమర శంఖారావం కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతూనే పార్టీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ దృష్టి సారించారు. ఈ [more]

Update: 2019-03-07 02:30 GMT

ఓ వైపు అన్నపిలుపు, సమర శంఖారావం కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతూనే పార్టీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ దృష్టి సారించారు. ఈ సారి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్న జగన్ ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ స్థానాల విషయంలో వైసీపీకి పెద్దగా ఇబ్బంది లేకున్నా పార్లమెంటు అభ్యర్థుల విషయంలో మాత్రం ఆ పార్టీకి తలనోప్పిగా ఉండేది. చాలా నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా చాలావరకు రాజకీయంగా సైలెంట్ కావడమో, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకో ముగ్గు చూపుతున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించడంతో ఆ స్థానాల్లోనూ వైసీపీకి సరైన అభ్యర్థులు లేరు. ఎక్కువ పార్లమెంటు స్థానాలను దక్కించుకొని కేంద్రంలో కూడా తమ పాత్ర ఉండాలనుకుంటున్న వైసీపీ కొత్త అభ్యర్థుల వేటలో చాలారోజులుగా ఉంది. ఇందులో వైసీపీ కొంత మేర సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. 3-4 ఎంపీ స్థానాలు మినహా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు గట్టి అభ్యర్థులు వైసీపీకి దొరికారు.

బలమైన అభ్యర్థుల వేటలో…

ప్రధానంగా రాయలసీమలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో మళ్లీ సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వనుండగా కర్నూలు స్థానాన్ని బీసీ అభ్యర్థికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. బీవై రామయ్య టిక్కెట్ ఖాయమైనట్లే ఉంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం ఎంపీ స్థానాన్ని కూడా మాజీ సీఐ గోరంట్ల మాధవ్ కు ఇచ్చే అవకాశం ఉంది. ఆయన సామాజకవర్గం వారు ఇక్కడ ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. నెల్లూరు, ప్రకాశం స్థానాలను మళ్లీ సిట్టింగ్ లకే ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీలో చేరితే మాత్రం వైవీ సుబ్బారెడ్డిని పక్కకు తప్పించి మాగుంటకు ఓంగోలు ఎంపీ సీటు ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు యువనేత లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేటాయించడం ఖాయమైంది. త్వరలో వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు స్థానం కేటాయించే అవకాశం ఉంది. ఇక, విజయవాడ ఎంపీ స్థానానికి మొన్నటివరకు వైసీపీకి సరైన క్యాండిడేట్ లేరు. ఇప్పుడు టీడీపీ నుంచి విజయ్ ఎలక్ర్టికల్స్ అధినేత దాసరి జైరమేశ్ ను చేర్చుకున్నందున ఆయననే విజయవాడ నుంచి బరిలో దింపనున్నారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి బరిలో దిగడం కాయమైంది.

రెండు మూడు స్థానాలు మినహా…

ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్ లేదా మాజీ కేంద్రమంత్రి కావూరి సాంభశివరావును పార్టీలో చేర్చుకొని బరిలో దింపనున్నారు. రాజమండ్రి స్థానానికి బీసీ సంఘాల నేత కుమారుడు మార్గాని భరత్ పోటీ చేయడం ఖాయమైంది. అమలాపురం, కాకినాడలో ఇంకా సరైన అభ్యర్థు దొరకలేదు. నరసాపురం స్థానానికి ఇటీవలే పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజును బరిలో దింపనున్నారు. అనకాపల్లి నుంచి గుడివాడ అమర్ నాథ్ పోటీ చేయనున్నారు. విశాఖపట్నం నుంచి దగ్గుబాటి హితేష్ చెంచురామ్ పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అరకు స్థానానికి ఇంకా సరైన అభ్యర్థి దొరకలేదు. శ్రీకాకుళం స్థానం కోసం ఇటీవలి మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని పార్టీలో చేర్చుకున్నారు. ఆమే అక్కడి నుంచి పోటీలో ఉండనున్నారు. విజయనగరం పార్లమెంటు నుంచి బొత్స కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయనున్నారు. మొత్తానికి వైసీపీకి బలమైన ఎంపీ అభ్యర్థులు దొరకడం కష్టమే అనే అంచనాలను వమ్ము చేస్తూ చాలావరకు బలమైన అభ్యర్థులను జగన్ రంగంలోకి దింపుతున్నారు.

Tags:    

Similar News