జగన్ రిలాక్స్ వెనుక…?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముగిసిన వారం రోజుల పాటు పోలింగ్ సరళి, గెలుపోటముల అవకాశాలపై సమీక్షలు [more]

Update: 2019-04-24 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముగిసిన వారం రోజుల పాటు పోలింగ్ సరళి, గెలుపోటముల అవకాశాలపై సమీక్షలు జరిపింది. తెలుగుదేశం పార్టీ సమీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక, పవన్ కళ్యాణ్ సమీక్షలు ఇప్పుడే మొదలవుతున్నాయి. అయితే, ఫలితాలపై సమీక్ష జరిపిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయంపై పూర్తి ధీమాగా ఉన్నారు. ఆయన ఫలితాలపై ఏమాత్రం భయంగా కనిపించడం లేదు. ఇక, ఆయన రిలాక్స్ అయ్యేందుకు స్విట్జర్ల్యాండ్ పర్యటనకు ఆయన వెళ్లారు. అయితే, జగన్ రిలాక్స్ అవ్వడం వెనుక చాలానే కథ ఉంది. ఎన్నికల్లో విజయంపై పూర్తి ధీమాగా ఉండటం, ప్రజలు ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఉన్నారనే పక్కా లెక్కలు వేసుకున్నాకే జగన్ రిలాక్స్ అయ్యారు.

పసుపు కుంకుమ పనిచేయలేదట…

పోలింగ్ రోజే జగన్ తాము విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు. అయితే, ఏ నాయకుడైనా ఆ రోజు చెప్పేది అదే. పోలింగ్ తర్వాతి రోజు నుంచి తాను స్వయంగా చేయించిన సర్వేలు, ప్రశాంత్ కిషోర్ సర్వేలను విశ్లేషించారు. అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. తర్వాత ఆయన అన్ని నియోజకవర్గాల నుంచి పోలింగ్ సరళిపై నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నివేదికలను, సర్వేలను చూసిన తర్వాత జగన్ తో పాటు వైసీపీ ముఖ్యనేతలు తమకు కచ్చితంగా 120 సీట్లు వస్తాయనే అంచనాకు వచ్చారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకున్న పసుపు – కుంకుమ పెద్దగా తమకు నష్టమేమీ చేయదని వైసీపీ భావిస్తోంది. పింఛన్ల లబ్ధిదారులు మాత్రం టీడీపీ వైపే మెజారిటీ మొగ్గు చూపారని భావిస్తున్నారు.

ఆ జిల్లాల్లోనూ పెరగనున్న సీట్లు

రైతులు సైతం ‘అన్నదాత సఖీభవ’ పథకం వల్ల టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదని వైసీపీ భావిస్తోంది. రైతులు మెజారిటీ వైసీపీ వైపే ఉన్నారనే అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చినా ఈసారి పట్టణ ప్రాంత ఓటరునాడి మారిందని, వారు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని వైసీపీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ, ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు మెజారిటీ వైసీపీకి ఓటేశారని, అగ్రిగోల్డ్ బాధితులు ఏకపక్షంగా వైసీపీకి ఓట్లేశారని వైసీపీ ఒక అంచనా వేసుకుంది. ఇక, గత ఎన్నికల్లో వైసీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఈసారి తమకు గణనీయంగా సీట్లు పెరుగుతాయని వైసీపీ లెక్కలు కట్టుకుంది. చివరిగా కచ్చితంగా 120 సీట్లు వస్తాయని జగన్ సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఒక అంచనాకు వచ్చారు. ఈ లెక్కలు అన్నీ విశ్లేషించుకున్నాకే జగన్ రిలాక్స్ అయ్యారని, కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాకు వచ్చారని అంటున్నారు.

Tags:    

Similar News