జగన్ ముందు… బాబు వెనక… ?

జగన్ అంటే చంద్రబాబుకు పడదన్నది తెలిసిందే. ఇద్దరిదీ రాజకీయ వైరం దాటి వ్యక్తిగత స్థాయికి వచ్చేసింది. కనీసం ఎదురుపడి ముఖాముఖాలు చూసుకోరు. అసెంబ్లీ సమావేశాల్లో తప్ప ఇద్దరు [more]

Update: 2021-07-24 14:30 GMT

జగన్ అంటే చంద్రబాబుకు పడదన్నది తెలిసిందే. ఇద్దరిదీ రాజకీయ వైరం దాటి వ్యక్తిగత స్థాయికి వచ్చేసింది. కనీసం ఎదురుపడి ముఖాముఖాలు చూసుకోరు. అసెంబ్లీ సమావేశాల్లో తప్ప ఇద్దరు జాయింట్ గా ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఘటనలు ఒక్కటి కూడా ఉండవు. జగన్ పక్కా జూనియర్ అని బాబు అనుకుంటే, చంద్రబాబు అవుట్ డేటెడ్ ఆయనతో పనేంటి అని జగన్ భావిస్తారు అని చెబుతారు. మొత్తానికి ఏపీలో ఇంత నిట్టనిలువునా రాజకీయం చీలిపోవడం వారికి ఎలా ఉన్నా జనాలకు మాత్రం పెను శాపంగా మారుతోంది. పొరుగున ఉన్న తమిళనాడు కానీ నిన్నటిదాకా కలసి ఉన్న తెలంగాణాలోని ఐక్యత కానీ ఏపీలో మచ్చుకైనా కనిపించవు.

అన్నీ సమస్యలే …?

ఏపీలో ఇపుడు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో చాలావరకూ కేంద్రం సృష్టించినవే ఎక్కువ. లిస్ట్ అలా చదివితే అన్నీ కేంద్రమే చేయాలి కదా అనిపిస్తుంది. రాజధాని నుంచి మొదలుపెడితే పోలవరం, విభజన హామీలు, రెవిన్యూ లోటు భర్తీ. పొరుగు రాష్ట్రం తెలంగాణా నుంచి రావాల్సిన విద్యుతు బకాయిలు ఇప్పించడం. క్రిష్ణా జలాల విషయంలో న్యాయం చేయడం, ప్రత్యేక హోదా ఇలా కేంద్రం ఏపీ విషయంలో చాలా సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ కేంద్రానికి గట్టిగా నిలదీసేలా ఏపీ నుంచి ఉద్యమాలు లేవు అన్నది పచ్చి నిజం.

జగనే లీడర్…

ఇక ఉన్నవి చాలవు అన్నట్లుగా కొత్తగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను కేంద్రం నెత్తిన పెడుతోంది. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని కూడా చెబుతోంది. దీని మీద కూడా ఏపీలోని రాజకీయం అంతా ఒక్క మాట మీదకు రావడం లేదు. అయితే మొత్తానికి అపర చాణక్యుడు చంద్రబాబు మాత్రం నోరు విప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మొదట నిలబడి పోరాటం చేయాల్సింది జగనే అంటున్నారు. ఆయనే మన లీడ‌ర్ అని కూడా చెప్పేస్తున్నారు. జగన్ లీడ్ తీసుకుని ముందుకు కదిలితే వెనక తెలుగుదేశం కూడా వస్తుంది అంటూ ఆశ్చర్యకరమైన ప్రతిపాదనే చేశారు. అంటే జగన్ని ఇక్కడ రాజకీయంగా ఇరికించారు అనే చెప్పాలి. అదే సమయంలో జగన్ నాయకత్వం వహిస్తే తాను కూడా వెంట వచ్చేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు కూడా.

అయ్యేపనేనా ….

అక్కడ ఉన్నది మోడీ, పైగా ఆయన నిర్ణయం తీసుకోవాలే కానీ వెనక్కి తగ్గేది లేదు అంటారు. అయితే చరిత్రలో ఒక్కసారి అయినా ఆంధ్రుల ఐక్యతను చాటి చెప్పడానికి బాబు జగన్ భుజం భుజం కలిపి ఢిల్లీ వారికి కొత్త సినిమా చూపిస్తే బాగుంటుంది అన్నది జనం మాట. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటేనే ఇవాళ జగన్ అయినా రేపు బాబు అయినా సాఫీగా రాజకీయం చేసేది. పైగా ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల ప్రజలు ఆధారపడిన ఇంత పెద్ద ప్లాంట్ మరోటి తేవడం ఇక మీదట కష్టమే అన్నది కూడా అందరికీ తెలిసిందే. మరి ఇంతకంటే పెద్ద సమస్య లేదు కాబట్టి బాబు ఏ రకంగా అనుకుని ప్రతిపాదించినా కూడా జగన్ సై అనాలి, అఖిలపక్షానికి తాను నాయకత్వం వహించి ఏపీ జనాల మెప్పు పొందాలి అంటున్నారు. అపుడు ప్లాంట్ ని ఒకవేళ ప్రైవేట్ పరం చేసినా కూడా జగన్ కి ఆ నింద రాదు అంటున్నరు. మరి బాబు తెలివిగా ఉచ్చు బిగించాను అనుకుంటున్నారు కానీ ఒడుపుగా వైసీపీ దాన్ని వాడుకోవాలని కూడా సూచనలు అందుతున్నాయి.

Tags:    

Similar News