రెండు విజన్లూ కలిస్తేనే… ?

ఏపీ ప్రజానీకం ఇపుడు తీవ్రమైన అయోమయంలో ఉన్నారు. విభజన నష్టాలు కష్టాలు వారు దారుణంగా అనుభవిస్తున్నారు. ఒక విధంగా రాజకీయాలకు ఏపీ ప్రయోగశాలగా మారిపోయింది. అనుభవం పేరు [more]

Update: 2021-09-06 02:00 GMT

ఏపీ ప్రజానీకం ఇపుడు తీవ్రమైన అయోమయంలో ఉన్నారు. విభజన నష్టాలు కష్టాలు వారు దారుణంగా అనుభవిస్తున్నారు. ఒక విధంగా రాజకీయాలకు ఏపీ ప్రయోగశాలగా మారిపోయింది. అనుభవం పేరు చెప్పి అయిదేళ్ళు చంద్రబాబు పాలించగా, జగన్ నూతనత్వం యువ నాయకత్వం అంటూ రెండేళ్ళుగా ఏలుతున్నారు. జగన్ సంక్షేమం హద్దులు మీరితే చంద్రబాబు అభివృద్ధి మాటలలో కోటలు దాటింది. మొత్తానికి చూస్తే గత ఏడేళ్ళుగా ఏపీ ఇంకా అస్తవ్యస్థమైన తీరులోనే ఉంది.

పంచేస్తే చాలా…?

ఏపీ సీఎం జగన్ భావన ఒక్కటే. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉన్నది పేదలకు పంచడానికి, వారు కష్టాలలో ఉన్నపుడు ఆదుకోవడానికి, అవసరం అన్న వాడికి లేదు అనకుండా వితరణ చేయాలి అన్నది జగన్ మార్క్ పాలిటిక్స్. అయితే ఇదే సమయంలో ఏపీ ఖజానాకు నిధులు ఎలా వస్తాయన్న లాజిక్ ని జగన్ తెలిసే విస్మరించారో తెలియక పక్కన పెట్టారో కానీ రెండేళ్ల పాలనలో ఆయన క్షేమంగా సంక్షేమాన్ని కొనసాగించారు. అభివృద్ధి అంటే మూడు రాజధానులతో వస్తుందని ఆయన నమ్ముతున్నారు. అంటే అమరావతి రాజధాని బాబు విజన్ అయితే జగన్ ఇక్కడ మూడు తోనే ఏపీకి ప్రగతి అనుకుంటున్నారు అన్న మాట.

అరకొరగానే…?

జగన్ సంగతి పక్కన పెడితే ఇక చంద్రబాబు అయిదేళ్ళ జమానా ఎలా సాగింది అన్నది అందరికీ తెలిసిందే. ఆయన సంక్షేమాన్ని ఎపుడూ నమ్మలేదు. అయితే 2014లో చాలా హామీలు ఇచ్చారు. వాటిని ఆయన వాయిదా పద్ధతిలో కొనసాగించాలనుకున్నారు. కొన్ని చేశారు. మరి కొన్ని చేయలేదు. ఇక రాజధాని అమరావతి విషయంలోనూ అదే చేశారు. తానే ఇక ఏపీకి శాశ్వత దిక్కు అన్నట్లుగా బోలెడు టైమ్ ఉంది అన్న ధీమాతో దాన్ని అలా నాన్చుతూ పోయారు. పైగా బాబు మార్క్ అమరావతి అంటే 2050 నాటికే పూర్తి కావాలి. ఇలా భ్రమరావతి శిల్పిగా మారి బాబు ఓడారు.

ఓటెత్తితే …?

మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. ఈ లోగా జగన్ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడితే ఓకే. కానీ అలా కాకుండా సంక్షేమాన్ని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తే జనం ఎంతవరకూ ఓటెత్తుతారు అన్నది ఒక ప్రధాన ప్రశ్న. అదే సమయంలో చంద్రబాబు అభివృద్ధి నినాదం మళ్ళీ పనిచేస్తుందా అన్నది కూడా ఆలోచించాలి. చంద్రబాబు రాజధాని కడతారు అని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆయన బాహుబలిలోని మాహిష్మతి మహా నగరాన్ని నిర్మిస్తారేమో, దానికి ఎన్ని దశాబ్దాల కాలం అవుతుంది అన్న బెదురు, బెంగ అయితే జనాల్లో ఉన్నాయి. మొత్తానికి బాబు గెలిస్తే సంక్షేమానికి ఓటు పడలేదు అనుకుంటారు. జగనే మళ్ళీ గెలిస్తే మాత్రం ఇక పంచుడే బెస్ట్ అనుకుంటారేమో. ఏది ఏమైనా ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి వీటి మీద చర్చలు ఇలా సాగుతూనే ఉంటాయి మరి.

Tags:    

Similar News