షర్మిలకు కాదు జగన్ కే నష్టమట

అధికారంలోకి రాకముందు అంతా కలసే ఉన్నారు. దాని కోసం సమిష్టిగా పోరాటం చేశారు. చివరకు అధికారం దక్కగానే విడిపోయారు. ఇదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై విన్పిస్తున్న [more]

Update: 2021-07-09 00:30 GMT

అధికారంలోకి రాకముందు అంతా కలసే ఉన్నారు. దాని కోసం సమిష్టిగా పోరాటం చేశారు. చివరకు అధికారం దక్కగానే విడిపోయారు. ఇదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై విన్పిస్తున్న మాట. వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబమంతా కలిసే ఉంది. వైఎస్ జగన్ కు కుటుంబమంతా అండగా నిలిచింది. జగన్ జైలు కెళ్లినా విజయమ్మ, షర్మిల పార్టీ వ్యవహారాలు చూసుకోగా, భారతి వ్యాపారాలను నిర్వహించే వారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలోనూ విజయమ్మ, షర్మిలలు రాష్ట్ర మొత్తం పర్యటించి జగన్ కు మద్దతుగా నిలిచారు. 2019 లో జగన్ అధికారంలోకి రావడానికి కూడా షర్మిల శ్రమ ఉందనే చెప్పాలి.

అధికారంలోకి రాగానే…

కానీ వైసీపీ అధికారంలోకి రాగానే అన్నా చెల్లెళ్ల మధ్య పొరపచ్చాలు పొడచూపాయి. మరి షర్మిల పదవి అడిగితే జగన్ కాదన్నారో? లేక షర్మిలే తనంతట తాను అన్నతో విభేదించారో తెలియదు కాని షర్మిల తాడేపల్లి లోని జగన్ ఇంటి గడప దాదాపు ఏడాదిగా తొక్కలేదు. దీనికి కారణం రాజకీయ విభేదాలేనని అంటారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా వైఎస్ షర్మిల వైసీపీలో యాక్టివ్ గా కన్పించారు. కనీసం తెలంగాణలోని వైసీపీ పగ్గాలను తనకు అప్పగించాలని వైఎస్ షర్మిల జగన్ ను కోరినట్లు తెలిసింది. అయితే అందుకు కూడా జగన్ సముఖత వ్యక్తం చేయలేదు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మంచిగా ఉండాలని జగన్ భావించారు.

పార్టీ పెట్టడం….

అందుకే షర్మిల పార్టీ పెట్టకముందే తాము తెలంగాణలో వైసీపీని మూసివేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. కానీ రాను రాను దూరం పెరగడంతో జగన్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే షర్మిల తెలంగాణ లో పార్టీని పెట్టారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కు సుతారమూ ఇష్టం లేదు. అందుకే వైఎస్ జయంతి రోజున కూడా ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇడుపుల పాయకు వేర్వేరుగా వచ్చి తండ్రికి నివాళులర్పించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైఎస్ విజయమ్మ మాత్రం ప్రస్తుతం కూతరు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు.

కుటుంబంలో ఒంటరి….

దీంతో వైస్ కుటుంబంలో జగన్ ఒంటరయ్యారన్న టాక్ వినపడుతుంది. ఇటు వివేకానందరెరడ్డి హత్య తో ఆయన కుటుంబం కూడా జగన్ కు దూరమయింది. ఇప్పుడు షర్మిల పరిస్థితి కూడా అదే. ఈ పరిణామాలు షర్మిల కన్నా వైఎస్ జగన్ కే ఎక్కువ నష్టం కలిగిస్తాయంటున్నారు విశ్లేషకులు. షర్మిలకు తెలంగాణలో పార్టీ బలోపేతం అయినా, కాకున్నా పెద్దగా నష్టం లేదు. అదే జగన్ కు ఏపీలో మరోసారి అధికారం దక్కకపోతే నష్టమే. ఈసారి జగన్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో షర్మిల, విజయమ్మ దూరంగా ఉంటారని ఇప్పటి నుంచే టాక్ విన్పిస్తుంది. మొత్తం మీద జగన్ వైఎస్ కుటుంబంలో ఒంటరి అయ్యారన్నది వాస్తవం.

Tags:    

Similar News