బావుకున్నదేంటి..? మారుతున్న జగన్ తీరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో కయ్యానికే సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. మౌనంగా ఉంటే తన చేతికాని తనంగా ప్రజలు భావిస్తారని జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇకపై [more]

Update: 2021-07-20 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో కయ్యానికే సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. మౌనంగా ఉంటే తన చేతికాని తనంగా ప్రజలు భావిస్తారని జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇకపై కేంద్ర ప్రభుత్వంతో దూకుడు పెంచకపోతే పార్టీకి భవిష్యత్ ఉండదన్న ఆందోళన పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పడే ఒక మాట చెప్పారు. పూర్తి మెజారిటీతో కేంద్రంలో ఉన్న పార్టీని బతిమాలడం తప్ప ఏమీ చేయలేమని. కానీ రాను రాను అసహనం ఎక్కువవుతుంది. మోదీ ప్రభుత్వం వల్ల ఒక్క ప్రయోజనం కూడా రాష్ట్రానికి పొందలేకపోయామన్న బాధ ఉంది.

ఆదుకోక పోగా…?

ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతుంది. చివరకు సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకోవడం లేదు. పైగా కొర్రీలు పెడుతుంది. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల నుంచి రాష్ట్ర విభజన అంశాల వరకూ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిని జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ దాదాపు 11 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. ఎన్నో వినతులు సమర్పించారు. అన్నింటికీ తన ముందు ఓకే అంటున్నా ఆ తర్వాత చర్యలు మాత్రం శూన్యం.

ఏ హామీని కూడా..?

జగన్ కు కూడా ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ప్రధానంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయలేకపోయారు. కర్నూలు లో న్యాయరాజధాని ఏర్పాటు కోసం ఢిల్లీ చుట్టు ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికలకు ప్రజల వద్దకు వెళ్లాలంటే ఎలా అని జగన్ సీనియర్ నేతల వద్ద అన్నట్లు సమాచారం. పైగా ఏపీ సెంటిమెంట్ విషయంలోనూ కేంద్రం పట్టువిడుపులగా ఉండటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. చేసేది కేంద్ర ప్రభుత్వమే అయినా ఎంతో కొంత మూల్యాన్ని జగన్ కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే భయం వైసీపీనేతలను వెంటాడుతుంది.

కేసుల కోసమేనంటూ…

దీనికి తోడు జగన్ సఖ్యతగా ఉంటే కేసుల కోసమే నన్న ప్రచారం విపక్షాలు చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో బీజేపీతో సఖ్యతగా ఉండి బావుకున్నదేమీ లేదు. చివరకు రఘురామ కృష్ణరాజు విషయంలోనూ తన వాదనను పట్టించుకోలేదన్న ఆగ్రహంతో జగన్ ఉన్నట్లు తెలిసింది. అందుకే కేంద్ర ప్రభుత్వంలో చేరమని ఇటీవల బీజేపీ వత్తిడి చేసినా జగన్ సున్నితంగా తిరస్కరించారంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డంపెట్టి మోదీపై యుద్దం ప్రకటించాలని వైసీపీ చీఫ్ జగన్ రెడీ అయినట్లు సమాచారం. తాను కేసులకోసం భయపడబోనని ఆయన నిరూపించుకోదలచుకున్నారు. అందుకే త్వరలోనే మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ నోటి నుంచి ప్రకటనలు వెలువడే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News