తిరుపతిలో తిరుగులేని విజయం

ఏపీ రాజకీయాల్లో బలమైన పార్టీగా వైసీపీ నిలిచింది. వైసీపీని గట్టి సామాజిక పునాదుల మీద నిర్మించడంతో జగన్ సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు పక్కన పెడితే [more]

Update: 2021-05-02 14:30 GMT

ఏపీ రాజకీయాల్లో బలమైన పార్టీగా వైసీపీ నిలిచింది. వైసీపీని గట్టి సామాజిక పునాదుల మీద నిర్మించడంతో జగన్ సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు పక్కన పెడితే గత పదేళ్ళుగా జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఫలితాలే ఇపుడు వరస విజయాలుగా వస్తన్నాయి అని చెప్పాలి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గత మెజారిటీని నిలబెట్టుకోవడం ద్వారా తనకు తిరుగు లేదు అని వైసీపీ గట్టిగా చాటి చెప్పింది. అదే సమయంలో టీడీపీ ధాటీగా పోరాడినా కూడా వైసీపీ ముందు ఆగలేని పరిస్థితిని అంతా చూశారు.

ఈ కాంబో ఫట్…

ఇక టీడీపీని పక్కన పెట్టి జనసేనతో జట్టు కట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి పరాభవమే మిగిలింది. మా తాతలు నేతులు తాగారు అంటే కుదరదు, ఎక్కడో ఢిల్లీలో మోడీని చూపితే జనాలు మెచ్చి ఓట్లు వేయరు. తామున్న చోట బలమేంటో చూపాలి. బహుశా అనుభవం వచ్చింది కాబట్టి ఈ తత్వం బీజేపీకి బోధపడి ఉండాలి. ఇక పవన్ తో కూటమి కట్టినా కూడా గట్టిగా ఆరు శాతం ఓట్లు తెచ్చుకోలేక డిపాజిట్లు గల్లంతు కావడం అంటే కాషాయం పార్టీకి జనాలు కషాయం తాగించినట్లే అనుకోవాలి. ఇక ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటికి కాదని చేసే మూడవ రాజకీయం చెల్లదు అని తిరుపతి ఫలితం స్ట్రాంగ్ మేసేజ్ ఇచ్చింది.

ముగ్గురూ కూడితే…?

ఇక ఇపుడు బీజేపీకి టీడీపీ ఠక్కున గుర్తుకురావడం ఖాయం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్న చరిత్ర ఉంది. ఎంత చెడ్డా ఇప్పటికీ ఏపీలో ముప్పై శాతానికి తగ్గకుండా ఓట్లు టీడీపీకి పడుతున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల నాటికి జనసేన, టీడీపీలతో కలసి బీజేపీ కూటమి కట్టవచ్చు. అయితే ఈ కూటమి కట్టినా కూడా వైసీపీని ఎదిరించడం కష్టమనే తిరుపతి ఉప ఎన్నిక ఫలితం చెబుతోంది. ఇక్కడ వైసీపీకి 56 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ జనసేన కూటమికి 5 శాతం పైగా ఓట్లు వచ్చాయి. టీడీపీకి 32 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈ కూటమి కుదిరినా కూడా 37 శాతం దగ్గరే ఆగిపోవడం ఖాయం.

పెరుగుతారు తప్ప…?

ఇక వచ్చే ఎన్నికలకు మూడేళ్ల వ్యవధి ఉంది. ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనుకోవాలి. అలా వచ్చే యాంటీ ఇంకెంబెన్సీ ఓట్లు ఈ మూడు పార్టీల కూటమి ఒక్కటిగా నిలిచి పంచుకున్నా కూడా వైసీపీని పడదోసి అధికారంలోకి రాలేరు అనే రాజకీయ లెక్కలు చెబుతున్నాయి. వైసీపీకి మీద మోజు ఎంత తగ్గినా యాభై శాతం ఓట్లు ఆ పార్టీ ఖాతాలో పక్కాగా ఉంటాయి. ఇక ఈ మూడు పార్టీలు మరో అయిదారు శాతం ఓట్లు అదనంగా సంపాదించినా కూడా 43 శాతం దగ్గరే ఆగిపోతారు. 2014 ఎన్నికల్లో కూడా 45 శాతం ఓట్లే వచ్చిన సంగతి ఇక్కడ గమనార్హం. నాటి ఊపు కూడా 2024 నాటికి బీజేపీకి మోడీకి, పవన్ కి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి జగన్ ఓట్లు ఎంత తగ్గినా కూడా మళ్లీ విజయం ఆయన‌దే అని ఇప్పటికైతే చెప్పాల్సిందే.

Tags:    

Similar News