కనెక్షన్ లింక్ తెగిపోతే.. కష్టమేగా?

పదేళ్ల పాటు జగన్ జనమే తానుగా బతికారు. తండ్రి వైఎస్సార్ పోయిన తరువాత తొలిసారి నల్లకాలువ వద్ద జరిగిన మీటింగులో జనంలోకి వచ్చిన జగన్ నాటి నుంచి [more]

Update: 2021-04-30 13:30 GMT

పదేళ్ల పాటు జగన్ జనమే తానుగా బతికారు. తండ్రి వైఎస్సార్ పోయిన తరువాత తొలిసారి నల్లకాలువ వద్ద జరిగిన మీటింగులో జనంలోకి వచ్చిన జగన్ నాటి నుంచి అలుపెరగకుండా ఉమ్మడి ఏపీని పట్టుకుని గట్టుకీ పుట్టనీ వదలక‌ తిరిగారు. మొదట ఓదార్పు యాత్ర అన్నారు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో అది కాస్తా రాజకీయ యాత్రగా మారిపోయింది. ఇక ఉమ్మడి ఏపీలో ఏదో ఒక ప్రజా కార్యక్రమం ఎంచుకుని నాటి సర్కార్ కి వ్యతిరేకంగా జగన్ రోడ్ల మీదకు వచ్చేవారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి.

కొత్త ఒరవడితో…

అంతవరకూ నేతలు జనాల్లోకి వచ్చినా కూడా జగన్ అంతలా కనెక్ట్ అయిన సందర్భాలు అయితే లేవు. నేరుగా తెలుగు రాష్ట్రాలలోని జనాల ఇళ్లలోకి జగన్ వెళ్ళి వారితో మాటలు, మంతనాలు పెట్టడాలు మాత్రం అప్పట్లో న్యూ ట్రెండ్ అని చెప్పాలి. వారి గుడిసెల్లోనే నేల మీద కూర్చుని వారి పెట్టినదేదో కలసి తినడం ద్వారా తాను జనం మనిషిని అనిపించుకున్నారు. ఇక దాదాపుగా ఏణ్ణర్ధం పాటు సాగిన జగన్ పాదయాత్ర ఒక చరిత్రగానే చూడాలి. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా జనం నుంచి జగన్ ని ఎవరూ విడదీయలేరు అనేంతగా ఆయన బలమైన బంధం వేసుకున్నారు.

ముచ్చటకు అయినా…?

సరే జగన్ తాను కోరుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. జనాల అపూర్వమైన ఆశీర్వాదంతో 151 సీట్లతో ఏపీ ముఖ్యమంత్రి సీటును పట్టేశారు. ఆ తరువాతనే జగన్ లో కొత్త మార్పు వచ్చింది. ఆయన అసలు బయటకు రావడమే బాగా తగ్గించారు. రెండేళ్ళ పాలనలో జగన్ జనాల వద్దకు వచ్చిన సందర్భాలు బహు అరుదుగా ఉన్నాయి. జగన్ అంటే పిచ్చి ప్రేమ పెంచుకున్న జనాలు కూడా ఇపుడు ఆయనను చూడాలనుకుంటే అది అందని వరమే అయిపోతోంది. జగన్ ప్రచారం చేయకుండానే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. తిరుపతి ఉప ఎన్నిక కూడా ముగిసింది. మరి జగన్ జనంలోకి రావాల్సిన సందర్భం ఇంతకంటే ఏదీ కూడా లేదు. కానీ వాటినే వద్దనుకున్న జగన్ జనాలలోకి ఎపుడు వస్తారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

సబబేనా …?

జగన్ ఓట్ల కోసం తిరుపతి వచ్చి జనాలను అడగలేదని విపక్షం అంటోంది. చంద్రబాబు అయితే జనాలను ఓటు వేయమని అడగని జగన్ కి జనం అంటే ఉన్న ప్రేమ ఏమిటో తెలిసింది అంటున్నారు. ఒక విధంగా వైసీపీ నేతలకు కూడా జగన్ జనంలోకి రాకపోవడం వల్ల ఇబ్బందిగానే ఉంది. జగన్ వైసీపీలో ఏకక ప్రజాకర్షణ నేత. ఆయన రాను అంటే ఎవరూ ఏమీ చేసేది ఉండదు. కానీ ఈ జనాలు ఎలాంటి వారు అంటే ఎంతగా ప్రేమిస్తారో చిన్న తేడా వస్తే అంతకు అంత కోపాన్ని చూపిస్తారు. అందువల్ల వారితో ఆ లింక్ కి అలా కంటిన్యూ చేయాల్సిందే. లేకపోతే బోడి మల్లయ్యలుగా తమను చూశారన్న భావన కలిగితే మాత్రం అది వైసీపీకి యమ డేంజరే. జగనే జనాల వద్దకు వెళ్ళారు. ప్రజా నాయకుడు ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు. సరే అధికారంలో ఉన్న వారికి చాలా పనులు ఉంటాయి. అంతమాత్రం చేత ఏదో ఒక సందర్భంలో జనాల వద్దకు వచ్చి పలకరించకపోతే వారు హర్ట్ అవుతారు. జగన్ తీరు మాత్రం ఒకనాడు అతివృష్టిగా ఉంటే ఇపుడు అనావృష్టిగా మారింది అంటున్నారు. ఏదీ ఎక్కువ కాకూడదు. రాజకీయ లెక్కల్లో తేడాలొచ్చేస్తాయి. మరి ఇది జగన్ గ్రహిస్తారా.

Tags:    

Similar News