నిస్సహాయ ముఖ్యమంత్రిగా మారుతున్నారా..?

జగన్ నిస్సహాయ ముఖ్యమంత్రి అని విపక్షాలు అంటున్నాయి. ఇపుడు జరుగుతున్న పరిణామాలు కూడా అదే నిజం అనేలా ఉన్నాయని మేధావులు అంటున్నారు. తనకు అధికారం ఇస్తే చిటిక [more]

Update: 2021-02-16 14:30 GMT

జగన్ నిస్సహాయ ముఖ్యమంత్రి అని విపక్షాలు అంటున్నాయి. ఇపుడు జరుగుతున్న పరిణామాలు కూడా అదే నిజం అనేలా ఉన్నాయని మేధావులు అంటున్నారు. తనకు అధికారం ఇస్తే చిటిక వేసేలోపు ప్రత్యేక హోదాను తెస్తాను అని పాదయాత్ర సందర్భంగా చెప్పి జనాల వద్ద నమ్మకాన్ని సాధించిన జగన్ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయన పార్టీకి మూడు తక్కువ పాతిక సీట్లూ ఏపీ జనాలు కట్టబెట్టారు అంటే దాని అర్ధం కేంద్రంలోని మోడీని గట్టిగా నిలదీసి ఏపీ ప్రయోజనాలు కాపాడుతారనే. కానీ జరుగుతున్నదేంటి అంటే ఆశ్చర్యమే కలుగుతుంది.

జగన్ ఎందుకిలా…?

యువభేరీల పేరిట ఏపీలో జగన్ సదస్సులు పెట్టినపుడు ఏపీ హక్కుల గురించి బాగా మాట్లాడేవారు. నాడు విన్నవారు అంతా అప్పటి సీఎం చంద్రబాబు వాటిని తేలేక కేంద్ర పెద్దలతో రాజీ పడుతున్నారనే భావించేవారు. జగన్ అయితే గట్టిగా మాట్లాడుతారు పైగా ఎవరికీ తల వంచరు, పవర్ ఫుల్ లీడర్ సోనియా గాంధీనే ఎదిరించిన నేతగా కూడా ఘనత వహించారు అని విశ్వసించారు. అందుకే బాబు ప్లేస్ లో జగన్ ని తెచ్చి కూర్చోబెట్టారు. మరో మాట చెప్పుకోవాలంటే చంద్రబాబు కంటే జగన్ అంటే మోడీకి మంచి గురి ఉందని, ఈ ఇద్దరి మధ్యన ఉన్న అవగాహనతో ఏపీకి మంచి రోజులు వస్తాయని మేధావులు కూడా అంచనాలు వేసుకున్నారు. కానీ సీఎం అయ్యాక జగన్ ఫుల్ సైలెంట్ అయిపోయారు.

దెబ్బ మీద దెబ్బ …

ఏపీకి బంగారం లాంటి హైదరాబాద్ రాజధాని పోయింది. ఇక అమరావతి రాజధాని పేరుకు ఉన్నా లేనట్లే. మూడు రాజధానుల కధ ఏమిటో ఎవరికీ తెలియదు., పోలవరం ప్రాజెక్ట్ ఎపుడు పూర్తి అవుతుందో కూడా తెలియదు, దానికి సరిపడా నిధులు కేంద్రం ఇస్తుందా లేదా అన్నది అంతకంటే తెలియదు. వరసపెట్టి కేంద్ర బడ్జెట్లు వస్తున్నా కూడా ఏపీకి నయా పైసా రాలదు, ఇపుడు తీరి కూర్చుని విశాఖకు మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేటీకరిస్తోంది. మరి ఇన్ని చేస్తూ దెబ్బ తీస్తూంటే జగన్ మాత్రం మాట్లాడకపోవడాన్ని జనం తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ఈ సమయంలోనైనా కేంద్రాన్ని నిలదీయాలన్నది సగటు జనం కోరిక.

అయ్యే పనేనా …?

నానాటికీ జగన్ మీద పెట్టుకున్న నమ్మకం సడలుతోంది అన్న విమర్శలు ఉన్నాయి. లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు జగన్ కేంద్రానికి భయపడుతున్నారు అని జనం భావిస్తున్నారు అంటున్నారు. టీడీపీ అయితే తన మీద కేసులు ఉన్నందుకే 22 మంది ఎంపీలు చేతిలో ఉన్నా కూడా జగన్ మోడీని ఏమీ అనడంలేదని విమర్శిస్తున్నారు. ఇపుడు వరస పరిణామాలు ఏపీ పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష, తీసుకుంటున్న చర్యలతో ఏపీ జనాల కోపం అంతా జగన్ మీదకే తిరుగుతోంది. ఇప్పటికైనా జగన్ ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటున్నారు. కానీ జగన్ ఆ పని చేయగలరా అంటే జనాల్లో మాత్రం సందేహాలే ఉన్నాయట.

Tags:    

Similar News