లౌక్యం ఎక్కడ జగన్…?

పెద్దాయన ఎన్టీయార్ కి జగన్ కి చాలా పోలికలు ఉన్నాయని ఆయనతో గొడవపడిన రాజకీయ నాయకులు తరచూ అంటూంటారు. ఇపుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి బ్యూరోక్రాట్ల నోట [more]

Update: 2019-11-13 14:30 GMT

పెద్దాయన ఎన్టీయార్ కి జగన్ కి చాలా పోలికలు ఉన్నాయని ఆయనతో గొడవపడిన రాజకీయ నాయకులు తరచూ అంటూంటారు. ఇపుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి బ్యూరోక్రాట్ల నోట కూడా ఇదే మాట వినిపిస్తోంది. సినిమా నటుడిగా మూడున్నర దశాబ్దాల పాటు వెండితెర మీద వెన్నెల జిలులుగు చిలికించిన అన్న గారు వేసవి ఎండలాంటి రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారు. సరే ప్రజలు ఆదరించారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆయనకు ఈ రాజకీయపు పోకడలు అసలు పడలేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. స్వాభావికంగా ముక్కుసూటిగా వ్యవహరించే ఎన్టీయార్ రాజకియాల్లోనూ అదే ధోరణిలో వెళ్ళారు, ఫలితం ఇబ్బందులు, ఎదురుదెబ్బలు బహుమానంగా వచ్చాయి. మొదటిసారి అన్న గారు 1983లో ముఖ్యమంత్రిగా అయినపుడు ఆయన జోరూ, దూకుడు వేరేగా ఉండేవని అంటారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సొంత పార్టీ వారి వరకూ అందరితోనూ గొడవలు, వివాదాలే. చివరికి ఏడాదిన్నరకే పదవి కోల్పోవాల్సివచ్చింది.

జగన్ రూటూ అదేనా…?

ఇక జగన్ విషయం చూస్తే ఆయన కూడ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయినవారే. ఆయనకూ విపరీతమైన జనాదరణ ఉంది. జనమే తన బలం అనుకొవడంలో అన్న గారి సరిసాటి అనే చెప్పాలి. ఇక వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఆలోచించకపోవడం, అవి ఎదురుతన్నితే ఇబ్బందులో పడడం ఇలా ఎన్టీఆర్ 1983 పాలన ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అవుతోందా అని పాత ఐఏఎస్ అధికారులు, ఇతర రాజకీయగణాలు సరిపోల్చుకుంటున్నారు. అన్న గారిలాగానే జగన్ ది కూడా ఆవేశం. తాను అనుకున్నది చేసేయాలని అంటారు. అడ్డు చెబితే వ్యతిరేకమనుకుంటారు. అప్పట్లో అన్న గారికి చెప్పడానికి కూడా నాదెండ్ల భాస్కర రావు వంటి వారు వెనకంజ వేసేవారు అంటారు. ఇపుడు జగన్ క్యాబినెట్లో సీనియర్లు ఉన్నా కూడా మనకెందుకులే అన్న ధోరణిలో ఉంటున్నారని చెబుతున్నారు. దాంతోనే ఇబ్బందుకు, కొత్త చిక్కులు వస్తున్నాయని చెబుతున్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తీసుకుపోవడంలోనూ అన్న గారి తో జగన్ పోటీ పడుతున్నారని అంటున్నారు. ఇద్దరూ జనాన్ని నమ్ముకున్నా చివరి రోజుల్లో జనం కూడా అన్న గారికి మద్దతు ఇవ్వలేదన్న సంగతి కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.

దొరికిపోతున్నారుగా….

జగన్ ఆలోచన మంచిదిగా ఉన్నా ఆచరణలో పొరపాట్లు, తడబాట్లు వల్ల తరచూ దొరికిపోతున్నారు. ఇసుక కొరత విషయంలో అది స్పష్టమైంది. సెప్టెంబర్లో కొత్త పాలసీ తీసుకువచ్చేవరకూ ఇసుక సరఫరా లేకుండా చేయడం వల్లనే ఈ రోజు సర్కార్ మీద ఇసుకెత్తిపోస్తున్నాయి ప్రతిపక్షాలు, మరో వైపు సీనియర్ మోస్ట్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం విషయంలోనూ జగన్ వైఖరిని అంతా తప్పుపడుతున్నారు. ఆయన పదవీ కాలం కూడా గట్టిగా అయిదు నెలలు లేదు, ఇంతలో ఏదో కొంప మునిగినట్లుగా ఆయనపై బదిలీ వేటు వేయడం. అవమానకరంగా డీ ప్రమోట్ చేయడంతో జగన్ ఒక్కసారిగా చెడ్డ అయిపోయారు.

సొంత పార్టీ నేతలు కూడా….

మరో వైపు ఆంగ్లభాషను రుద్దుతూ తెలుగును చంపేస్తున్నారంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. ఇలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దూకుడుగా ఉండటం వల్ల సొంత పార్టీ వారు సైతం పెదవి విప్పలేకపోతున్నారు. అప్పట్లో అన్న గారు అవినీతిని సహించను అంటూ సొంత మంత్రినే పట్టించేశారు. అది తరువాత తిరుగుబాటుకు కారణం అయింది. ఇపుడు జగన్ కూడా అవినీతి వద్దు అంటూ కట్టడి చేయడం, మద్య నిషేధం పేరిట కొత్త పాలసీ తేవడం, రివర్స్ టెండరింగ్ ఇలా అనేక నిర్ణయాలు చూస్తూంటే అచ్చం అన్న గారినే తలపిస్తున్నాడు అంటున్నారు. భారీ మెజారిటీలు ఇలాంటి దూకుడు వైఖరినే అలవాటు చేస్తాయని సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా విశ్లేషిస్తూంటారు. సర్కార్ నడవాలంటే… బండ మెజారిటీ మాత్రమే చాలదు, లౌక్యం కూడా కావాలేమో. జగన్ జర జాగ్రత్త అంటున్నారు. గతం ఎరిగిన మేధావులు.

Tags:    

Similar News