వారి రాకతో ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా..?

ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారపర్వంలో ఇప్పటివరకు చంద్రబాబు కొంచెం ముందంజలో కనిపించారు. జగన్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో [more]

Update: 2019-03-29 06:30 GMT

ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారపర్వంలో ఇప్పటివరకు చంద్రబాబు కొంచెం ముందంజలో కనిపించారు. జగన్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా చంద్రబాబు ఐదారు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరపున నారా లోకేష్ కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి మద్దతుగా ఫరూక్ అబ్దుల్లా, అరవింద్ కేజ్రీవాల్ వంటి ఇతర రాష్ట్రాల నేతలను రంగంలోకి దింపారు. జగన్ మాత్రం ఇప్పటివరకు ఒంటరిగా ప్రచారం చేస్తూ వెనుకబడ్డారు. అయితే, నేటి నుంచి జగన్ కు మద్దతుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఈ మేరకు వారి ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. వీరి రాకతో వైసీపీ ప్రచారం సైతం జోరందుకోనుంది.

సూటిగా విమర్శలు గుప్పిస్తున్న షర్మిల

వైఎస్ షర్మిల ప్రచారం మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నుంచి ప్రారంభం కానుంది. సుమారు 30 – 40 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు. షర్మిల ప్రచారం వైఎస్సార్ కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆమె గతంలో వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేసిన పార్టీని కాపాడారు. తర్వాత తెలంగాణలో పరామర్శ యాత్ర చేశారు. గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. సూటిగా ప్రసంగించడంలో, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంలో ఆమె దిట్ట. జగన్ కంటే ఎక్కువగా ఆమె ప్రత్యర్థి పార్టీలను అటాక్ చేస్తారు. రెండు రోజుల క్రితం ఆమె అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పవన్ కళ్యాణ్, లోకేష్ పైన కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎటువంటి పేపర్ చూడకుండా లెక్కలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. ఏ విషయాన్నైనా ప్రజల్లోకి వెళ్లేలా ఆమె మాట్లాడగలరు. దీంతో షర్మిల ప్రచారం వైసీపీకి ఎంతో కొంత మేలు చేయవచ్చు.

అన్ని నియోజకవర్గాలూ కవర్ చేసేలా

వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఇవాళటి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఆమె మొదటిరోజు ప్రచారం చేయనున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయలేకపోయినా జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరవచ్చు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణిగా ఆమెను ప్రజలు ఆధరించవచ్చు. ముఖ్యంగా మహిళలు విజయమ్మ ప్రచారానికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. విజయమ్మ, షర్మిల, జగన్ కలిసి మొత్తం 175 నియోజకవర్గాలను టచ్ చేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. వీరిద్దరూ ప్రచారానికి దిగడం ద్వారా ఇన్ని రోజులుగా ఒంటరిగా ప్రచారం చేస్తున్న జగన్ కు కొంత సహకారం లభిస్తుంది. మరి, తల్లి, సోదరి ప్రచారం జగన్ కు ఏ మేరకు మేలు చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News