మనసు మారింది.. మాట మారింది…?

జమిలి ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తాము జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో [more]

Update: 2020-12-29 11:00 GMT

జమిలి ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తాము జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు జమిలి ఎన్నికలపై ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో తెలంగాణలోని టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీలు జమిలి ఎన్నికలకు సిద్ధమని ప్రకటించాయి. అయితే ఆ ప్రకటన 2018లో చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ రెండు పార్టీల స్టాండ్ జమిలి ఎన్నికలపై మారుతుందంటున్నారు.

2018లో మాత్రం…

2018లో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చినప్పుడు కేసీఆర్ సయితం సరేనన్నారు. ఆయన ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నందునే అప్పట్లో జమిలి ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమయ్యారంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వరస ఓటములు కేసీఆర్ ను వెక్కిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జమిలి ఎన్నికలకు అంగీకరించే అవకాశం లేదంటున్నారు.

ఇప్పుడు ఆలోచనను….

ఇక 2018లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జమిలి ప్రతిపాదనకు వైసీపీ సై అంది. లా కమిషన్ కు కూడా తాము జమిలి ఎన్నికలకు సిద్ధమని తెలిపింది. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఆ అభిప్రాయాన్ని వైసీపీ వెల్లడించింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉండటంతో పాటు జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన మాత్రం వైసీపీకి లేదని ఆ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. బయటకు జమిలి ఎన్నికలపై ఎటువంటి ప్రకటన వైసీపీ చేయకపోయినప్పటికీ రాష్ట్రాల అభిప్రాయాలను కోరితే వైసీపీ జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా చెప్పే అవకాశముంది.

టీడీపీ సయితం…..

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికొస్తే 2018లో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జమిలి ఎన్నికలను వ్యతిరేకించింది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశాన్ని కూడా టీడీపీ బహిష్కరించింది. ఒక్కరోజును కూడా తమ ప్రభుత్వం వదులుకోవడానికి సిద్ధంగా లేమని అప్పట్లో మంత్రిగా ఉన్న లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు మాత్రం జమిలి ఎన్నికలు జరగాల్సిందేనంటుంది. దీనికి ప్రధాన కారణం అధికారంలో లేకపోవడమే. వైసీపీ, టీఆర్ఎస్ లు మాత్రం కరోనాతో ఏడాదిన్నర సమయం గడచిపోయిందని, తాము అభివృద్ధి పనులు చేయలేకపోయినందున జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News