భారతమ్మ భజన స్టార్ట్… ?

భజన చేసే విధం తెలియండీ అంటూ సాగే సంప్రదాయ కీర్తనలు రాజకీయ జీవుల కోసమే అన్నట్లున్నాయి. ఎవరు గద్దె మీద ఉంటే వారి మెప్పు కోసం తపన [more]

Update: 2021-08-31 05:00 GMT

భజన చేసే విధం తెలియండీ అంటూ సాగే సంప్రదాయ కీర్తనలు రాజకీయ జీవుల కోసమే అన్నట్లున్నాయి. ఎవరు గద్దె మీద ఉంటే వారి మెప్పు కోసం తపన పడుతూ స్తోత్ర పాఠాలు వల్లె వేయడం నేతాశ్రీలకు అలవాటే. ఇన్నాళ్ళూ షర్మిలమ్మ, విజయమ్మ అన్న వైసీపీ గొంతులే ఇపుడు భారతమ్మ అంటూ తెగ పొగుడుతున్నాయి. నిజానికి జగన్ సతీమణిగా మాత్రం వైఎస్ భారతి జనాలకు పరిచయం. జగన్ కూడా తన కుటుంబం గురించి ఎక్కడా బయట చెప్పుకోరు. కానీ ఈ మధ్య కాలంలో భారతమ్మ టీడీపీ అనుకూల మీడియా వార్తల ద్వారా ఫోకస్ లోకి వస్తున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా జగన్ జైలుకు వెళ్తే భారతమ్మే సీఎం అని అపర జ్యోతీష్కుల మాదిరిగా టీడీపీ అనుకూల మీడియా వార్తలు వార్చి వడ్డిస్తోంది.

ఫుల్ అటెన్షన్ …

బహుశా ఈ వార్తల ప్రభావమో లేక ముందు చూపో తెలియదు కానీ వైసీపీ నేతలు మాత్రం వైఎస్ భారతిని కీర్తించడం అలవాటు చేసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి అందరి కంటే ఒకడుగు ముందుకు వేసి తన ఏరియాలో జగన్, భారతమ్మల భారీ ఎత్తున కటౌట్ పెట్టి మరీ ఈ మధ్య బాగానే సందడి చేశారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చాక ఫస్ట్ టైమ్ వైఎస్ భారతి తో కలసి అలా కటౌట్ మీద కనిపించారు. ఫ్లెక్సీల మీద మెరిశారు. ఇక ఆయన బాటలో చాలా చోట్ల జగన్ వైఎస్ భారతి కి పెళ్ళి రోజుల శుభాకాంక్షలు చెబుతూ కీలక నేతలే హడావుడి చేశారు.

ఆమె లేకపోతే…

మరోవైపు కొందరు ముఖ్య నేతలు మీడియా సమావేశాలలో వైఎస్ భారతిని పొగడడం ఆశ్చర్యం కలిగించింది. వైఎస్ భారతి లేకపోతే జగన్ రాజకీయ జీవితంలో ఇన్ని విజయాలు దక్కేవి కావు అంటూ వారు చెప్పడం జరిగింది. జగన్ కాంగ్రెస్ ని ఎదిరించి జైలు పాలు అయిన వేళ భారతి చూపిన ధైర్యం ఒక వైపు సొంత మీడియా సంస్థను, మరో వైపు వ్యాపారాలను చూసుకుంటూ ఇంకో వైపు చిన్న పిల్లలను సాకుతూ భర్త ఎంతో మనో ధైర్యాన్ని ఇచ్చిందని పలువురు వైసీపీ నేతలు విశ్లేషించడం కూడా జరిగింది. ఒక విధంగా జగన్ ఈనాటి రాజ వైభోగం వెనక వైఎస్ భారతి ఉన్నారని వారు అంటూండడం విశేషం.

ఇది ఆరంభమే ?

ఇప్పటి దాకా జగన్ తో పాటు ఫొటోలలో కనిపించేది తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలమ్మ మాత్రమే. పార్టీ క్యాడర్ కూడా వారి పేర్లే వల్లించేవారు. కానీ ఇపుడు సీన్ లోకి వైఎస్ భారతి ఎంటర్ అయ్యారు. ఆ రెండు పేర్లు కూడా మాయమయ్యాయి. జగన్ తో పాటుగా సతీమణికి కూడా పార్టీ నీరాజనాలు పడుతోంది. బహుశా ఇదంతా భవిష్యత్తు రాజకీయం కోసమే అన్న చర్చ కూడా ఉంది. జగన్ మీద సీబీఐ కేసులు ఉన్నాయి. ఆయన రాజకీయం ఏ రోజు అయినా తారు మారు అయితే అపుడు వైసీపీ తెర మీద మెరిసేది భారతమ్మే అంటున్నారు. అందుకే ముందుగా ఉత్సాహవంతులు భారతమ్మ భజన మొదలెట్టారని కూడా తెలుస్తోంది. ఇది ఇక్కడితో ఆగేది కాదని, ముందు ముందు మరింతగా జోరు అందుకుంటుందని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా వైసీపీ అంటే ఇపుడు జగన్ మాత్రమే కాదు, భారతమ్మ కూడా.

Tags:    

Similar News