ప‌చ్చ మీడియా ట్రాప్‌లో వైసీపీ … జ‌గ‌న్ వార్నింగ్ ప‌ని చేస్తుందా?

ఎన్ననుకున్నా ఏపీలో అధికార వైసీపీని స‌పోర్ట్ చేసే మీడియా క‌న్నా విప‌క్ష టీడీపీకి మ‌ద్దతుగా ఉండే మీడియానే ఎక్కువ ఉంది. తెలంగాణ‌లో ఎలా ఉన్నా ఏపీలో మూడొంతుల [more]

Update: 2021-01-05 11:00 GMT

ఎన్ననుకున్నా ఏపీలో అధికార వైసీపీని స‌పోర్ట్ చేసే మీడియా క‌న్నా విప‌క్ష టీడీపీకి మ‌ద్దతుగా ఉండే మీడియానే ఎక్కువ ఉంది. తెలంగాణ‌లో ఎలా ఉన్నా ఏపీలో మూడొంతుల మీడియా చంద్రబాబు / టీడీపీ నేత‌ల క‌నుస‌న్నల్లోనే న‌డుస్తోంది. టీడీపీ అనుకూల మీడియాకు ఇటీవ‌ల వార్తలేమి లేక‌పోతే వైసీపీకి సంబంధించిన ఏదో ఒక వివాదాన్నే హైలెట్ చేస్తూ రోజంతా చూపిస్తుండ‌డంతో పాటు టీడీపీ నేత‌ల‌తో చ‌ర్చలు పెట్టించి దుమ్మెత్తిపోసే ప్రక్రియ‌కు శ్రీకారం చుడుతోంది. గ‌త కొద్ది రోజులుగా టీడీపీ అనుకూల ఛానెల్స్‌లో వ‌స్తోన్న చ‌ర్చలే ఇందుకు నిద‌ర్శనం

గౌతు లచ్చన్న వ్యవహారంలో…..
.

టీడీపీలో ఏం జ‌రిగినా సాక్షి ఎంత పెద్దగా భూత‌ద్దంలో పెట్టి చూపిస్తుందో టీడీపీ అనుకూల మీడియా సైతం వైసీపీకి సంబంధిచి చిన్న వివాదాన్ని కూడా రోజంతా చ‌ర్చలు పెడుతూ హైలెట్ చేసేందుకు ప్రయ‌త్నిస్తోంది. ఇటీవ‌ల వైసీపీలో జ‌రిగిన కొన్ని ప‌రిణామాలు చూస్తే శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌లో స‌ర్దార్ గౌతు ల‌చ్చన్న విగ్రహంపై మంత్రి అప్పల‌రాజు చేసిన వ్యాఖ్యల‌ను టీడీపీ మీడియా భూత‌ద్దంలో పెట్టి చూపించ‌డంతో పాటు నానా రాద్దాంతం చేసేసింది. అక్కడితో ఆగ‌కుండా ప‌లాస టీడీపీ ఇన్‌చార్జ్ గౌతు శిరీష‌ను లైన్లోకి తీసుకు వ‌చ్చి అప్పల‌రాజుపై విమ‌ర్శలు చేయించ‌డం ద‌గ్గర నుంచి బీసీ నేత‌ల‌ను చ‌ర్చల‌కు పిలిచి అప్పల‌రాజుపై ఎటాక్ చేయించే వ‌ర‌కు నిద్దర‌పోలేదు.

ప్రతి వివాదంలోనూ……

అక్కడ మంత్రి అన్న ఉద్దేశాన్ని చాలా వ‌ర‌కు వ‌క్రీక‌రించేందుకు కూడా ఈ మీడియా ప్రయ‌త్నించింది. ఇక తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తిలో వైసీపీ ఎమ్మెల్యే స‌త్తి సూర్యనారాయ‌ణ రెడ్డి వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లమిల్లి రామ‌కృష్ణా రెడ్డి మ‌ధ్య వివాదంలో వారి స‌వాళ్లు, ప్రతి స‌వాళ్లు చిన్నగానే ఉన్నా వాటిని హైలెట్ చేయ‌డంలో టీడీపీ మీడియా పాత్రే ప్రముఖంగా క‌నిపించింది. చివ‌ర‌కు బిక్కవోలు గ‌ణ‌ప‌తి ఆల‌యంలో ప్రమాణాలు చేసే స‌మ‌యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే న‌ల్లమిల్లి మ‌న‌స్ఫూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ట్టు లేదు. అయినా ఆయ‌న్ను బాగా హైలెట్ చేయ‌డంలో టీడీపీ మీడియా బాగా స‌క్సెస్ అయ్యింది.

విశాఖలోనూ అదే తంతు…..

మరోవైపు విశాఖలో కూడా ఇదే తంతు నడిచింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సాయిబాబా ఆలయానికి వస్తానని సవాల్ విసిరారు. ఆయ‌న్ను టీడీపీ మీడియా ఆకాశానికి ఎత్తేస్తూ చూపిస్తే.. వైసీపీ నేత‌ల వాయిస్‌ను వైసీపీ అనుకూల మీడియా బాగా ప్రోజెక్ట్ చేసింది. చివ‌ర‌కు వైసీపీ నేత‌లు అమ‌ర్ నాథ్‌, విజ‌య‌సాయిరెడ్డి వ‌స్తేనే తాను కూడా వ‌స్తాన‌ని వెల‌గ‌పూడి ఎస్కేప్ అయ్యారు. ఇక ప‌ల్నాడు రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోన్న య‌ర‌ప‌తినేని, కాసు మ‌హేష్‌రెడ్డిని సైతం మీడియా చ‌ర్చకు పిలిచి ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకునేలా చేసి వీరి రాజ‌కీయాన్ని మ‌రింత హీటెక్కించారు.

వార్నింగ్ ఇవ్వడంతో….

పై ప‌రిణామాలు చూస్తుంటే వైసీపీకి చెందిన చిన్న వివాదాన్ని కూడా ప‌చ్చ మీడియా హైప్ చేసి వైసీపీ నేత‌ల‌ను ట్రాప్‌లోకి లాగుతోంది. వైసీపీ నేత‌ల వివ‌ర‌ణ కోర‌గా చివ‌ర‌కు వాళ్లు ఇందులోకి దిగ‌డం… ఈ ఛానెల్స్ ఈ వివాదాన్ని మ‌రింత పెద్దది చేసి ఏదోలా ప్రభుత్వంపై బుర‌ద జ‌ల్లడం జ‌రుగుతోంది. వైసీపీ అధిష్టానం ఈ విష‌యం గ‌మ‌నించి ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుంద‌నే వైసీపీ నేత‌ల‌కు ప‌చ్చ మీడియా ట్రాప్‌లో ప‌డొద్దని వార్నింగ్ ఇచ్చిన‌ట్టు కూడా తెలుస్తోంది. ప‌చ్చ మీడియా చ‌ర్చల్లో పాల్గోవ‌ద్దని జ‌గ‌న్ చెపుతున్నా వైసీపీ నేత‌లు కొంద‌రు ఫోన్ కాల్స్‌లో అయినా వాళ్లకు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి స‌రైన స‌మాధానం లేక ఇరుక్కుంటున్నారు.

Tags:    

Similar News