ధ్యాసంతా అక్కడే

కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలో టెన్షన్ ఎక్కువవుతోంది. డిసెంబరు నెలలో కర్ణాటక రాష్ట్రంలో పదిహేను శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. [more]

Update: 2019-10-14 16:30 GMT

కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలో టెన్షన్ ఎక్కువవుతోంది. డిసెంబరు నెలలో కర్ణాటక రాష్ట్రంలో పదిహేను శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలన్నీ ఇటీవల కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి రాజీనామా చేసిన వారి స్థానాలు. తమ ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తొలి నుంచి అభిప్రాయపడుతున్నారు.

నిర్ణయం జరిగిపోవడంతో…..

తొలినాళ్లలో అధిష్టానం కొంత అటు ఇటు ఊగిసలాట ఆడినా చివరకు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. సుప్రీంలో వీరికి అనుకూలంగా తీర్పు వస్తేనే టిక్కెట్లు ఇవ్వడం సాధ్యమవుతుంది. వ్యతిరేకంగా వస్తే వారు సూచించిన వారికి ఇవ్వాలని యడ్యూరప్ప, బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది.

అసమ్మతి నేతలను….

కానీ స్థానిక బీజేపీ నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాము వారికి సహకరించేది లేదని తెగేసి చెప్పారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో బీజేపీ అధినాయకత్వం కూడా వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ యడ్యూరప్పలో మాత్రం టెన్షన్ తీరలేదు. అందుకే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన బీజేపీ నేతలతో యడ్యూరప్ప ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.

పదవులిస్తామని…..

అంతేకాదు వారికి పదవులు ఇస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయిన బీజేపీ నేతలతో యడ్యూరప్ప ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఇతర నేతలకు కూడా పార్టీలో కీలక స్థానం కల్పిస్తామని, ప్రభుత్వంలోనూ వారిని భాగస్వామ్యం చేస్తానని యడ్యూరప్ప వ్యక్తిగతంగా మాట ఇస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ యడ్యూరప్ప లో టెన్షన్ మాత్రం పెరిగిపోతుంది. శాసనసభ సమావేశాలు జరుగుతున్నా యడ్యూరప్ప ఆలోచన మాత్రం ఆ పదిహేను మీదనే ఉంది.

Tags:    

Similar News