బలం తగ్గిపోయిందా..?

పార్టీని వీడితే కొందరు లాభపడతారు. మరికొందరు నష్టపోతారు. కానీ కర్ణాటకలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు మాత్రం నిత్యం టెన్షన్ పడుతున్నారు. బీజేపీలో గ్రూపుల గోల మొదలవ్వడమే [more]

Update: 2019-10-07 17:30 GMT

పార్టీని వీడితే కొందరు లాభపడతారు. మరికొందరు నష్టపోతారు. కానీ కర్ణాటకలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు మాత్రం నిత్యం టెన్షన్ పడుతున్నారు. బీజేపీలో గ్రూపుల గోల మొదలవ్వడమే ఇందుకు కారణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలందరూ ఐక్యంగా కన్పించారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సయితం బలంగా కన్పించారు. దీంతో యడ్యూరప్ప హామీ మేరకు పదిహేడు మంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.

వారే శత్రువులయ్యారే…..

కాంగ్రెస్ పార్టీలో తమకు ఎటూ న్యాయం జరగదని భావించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తే తిరిగి జరిగే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేసి విజయం సాధించవచ్చని ఊహించారు. కానీ అనర్హత వేటు పడుతుందని వారు ఊహించలేదు. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. తమ రాజీనామాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలే తమకు శత్రువులగా మారారు.

వారే తిరగబడితే….

ఉప ఎన్నికలు జరగనున్న పదిహేను స్థానాల్లో బీజేపీ నేతలు తిరగబడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వారు గళం విప్పుతున్నారు. వారికి బీజేపీలో కొందరు పెద్దలు అండగా ఉన్నారన్నది వాస్తవం. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న తమను కాదని వారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వీరి వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ తో పాటు, బీజేపీ నేత సంతోష్ కూడా ఉన్నట్లు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పసిగట్టారు.

యడ్యూరప్ప వల్ల అవుతుందా?

యడ్యూరప్ప బలం అధిష్టానం వద్ద రోజురోజుకూ తగ్గుతుండటంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలయింది. సుప్రీంకోర్టులో తమ తీర్పు టెన్షన్ ఒకవైపు ఉంటే, మరోవైపు తీర్పు తమకు అనుకూలంగా వచ్చి టిక్కెట్లు కేటాయించినా బీజేపీ నేతలు తమకు మద్దతిస్తారన్న నమ్మకం అనర్హతవేటు పడిన ఎమ్మెల్యేలకు లేదు. దీంతో యడ్యూరప్పను వదిలేసి నళిన్ కుమార్ కటిల్, సంతోష్ లను వారు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. యడ్యూరప్ప మాట మీద నమ్మకం లేకనే వారు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. రాజీనామాలు చేసి వారు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు.

Tags:    

Similar News