వన్ సైడ్ గా వెళితే సైడయిపోతారు

యడ్యూరప్పకు కుదురుగా పాలన చేసుకునే వీలు చిక్కడం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటూ వస్తున్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన [more]

Update: 2019-10-01 17:30 GMT

యడ్యూరప్పకు కుదురుగా పాలన చేసుకునే వీలు చిక్కడం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటూ వస్తున్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనూ అసంతృప్తులు బయలుదేరాయి. వారికి సర్ది చెప్పేందుకు యడ్యూరప్ప తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది. అధిష్టానం మీద పడేసి తాను అండగా ఉంటానని బీజేపీలోని అసంతృప్త నేతలకు యడ్యూరప్ప మాట ఇచ్చారు. ఇక సాఫీగా సాగుతున్న దనుకుంటున్న సమయంలో ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి.

వాయిస్ పెరుగుతోంది…..

ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ బీజేపీ నేతల వాయిస్ పెరుగుతూ వస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఇదే సమయమని భావించే కొందరు నేరుగా అధిష్టానం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. యడ్యూరప్ప ఒక వర్గానికే మద్దతు తెలుపుతున్నారన్న ఫిర్యాదులు అధిష్టానానికి భారీగానే అందినట్లు తెలుస్తోంది. కొంతమంది సన్నిహితలును దగ్గరకు చేర్చుకుని వారికి పనులు చేసిపెడుతున్నారన్నది ఆరోపణ.

వారికోసం…..

అలాగే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయంలోనూ వన్ సైడ్ గా వెళుతున్నారన్న ఫిర్యాదులు యడ్యూరప్ప పై వస్తున్నాయి. తన కోసం త్యాగం చేసిన వారికి ప్రతిఫలం దక్కించేందుకు యడ్యూరప్ప కీలక నిర్ణయాలను సయితం ఏకపక్షంగా తీసుకుంటున్నారన్నది బీజేపీ నేతల భావన. ఉప ఎన్నికల్లో వారికి పోటీ చేసే అవకాశం ఉంటుందో ఉండదోనని అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు సిద్ధమయ్యారంటున్నారు.

జిల్లాను విడగొడితే…..

ఇందులో భాగంగానే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కోరిక మేరకు బళ్లారిని రెండు జిల్లాలుగా చేయడానికి యడ్యూరప్ప సిద్ధమయ్యారంటున్నారు. విజయనగర ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని యడ్యూరప్ప వారికి హామీ ఇచ్చారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు యడ్యూరప్ప పై ఆగ్రహంగా ఉన్నారు. బళ్లారి జిల్లాను రెండుగా చేస్తే తాము పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. గాలి బ్రదర్స్ కూడా ఇదే బాటలో ఉన్నారు. ఈ అంశంపై యడ్యూరప్ప పై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News