దీంతోనే తేలిపోతుందా?

ఎవరు అవునన్నా కాదన్నా యడ్యూరప్ప మీద పార్టీలో అసంతృప్తి ఉందన్నది మాత్రం నిజం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ నేతలు అనేక మంది ఆయనకు వ్యతిరేకంగా [more]

Update: 2020-10-29 17:30 GMT

ఎవరు అవునన్నా కాదన్నా యడ్యూరప్ప మీద పార్టీలో అసంతృప్తి ఉందన్నది మాత్రం నిజం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ నేతలు అనేక మంది ఆయనకు వ్యతిరేకంగా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు కూడా. మంత్రివర్గ విస్తరణలోనూ, రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ యడ్యూరప్ప మాట చెల్లుబాటు కాకుండా చేయగలిగారు. ఆయనను దించాలన్న డిమాండ్ అప్పుడప్పుడూ విన్పిస్తూనే ఉంది.

రెండు ఉప ఎన్నికలు…..

అయితే ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న రెండు ఎన్నికలు యడ్యూరప్పకు సవాల్ గా మారనున్నాయి. కర్ణాటకలో రాజరాజేశ్వరినగర, శిర నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. ఈరెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలవగలిగితే యడ్యూరప్ప మరికొంత కాలం ఊపిరి పీల్చుకునే అవకాశముందంటున్నారు.

రెండు చోట్ల పట్టు లేక…..

నిజానికి రాజరాజేశ్వరినగరల్ కాంగ్రెస్ కు మంచి పట్టుంది. శిర నియోజకవర్గంలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లకు బలమైన క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ ఎలా నెగ్గుకొస్తుందన్నది సందేహంగా ఉంది. అయితే యడ్యూరప్ప అంచనాల ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటును వీళ్లు చీల్చుకుంటే తాము లాభపడతామని భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అసంతృప్తిని కట్టడి చేయడానికి…..

గత కొన్ని నెలలుగా యడ్యూరప్పపై అసంతృప్తి పెరుగుతూ వస్తుంది. బీజేపీ రాష్ట్ర శాఖ కూడా యడ్యూరప్పకు వ్యతిరేకంగా కేంద్ర నాయకత్వానికి నివేదికలు పంపుతుందని చెబుతోంది. పాలనలో యడ్యూరప్ప కుమారుడు జోక్యం కూడా ఇందుకు కారణమని అంటున్నారు. అందుకే కొందరు ఎమ్మెల్యేలు రహస్య సమావేశం కూడా అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుతున్న ఉప ఎన్నికల ఫలితాల యడ్యూరప్పకు బలాన్నిస్తాయా? మరింత భయాన్ని పెంచుతాయా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News