మళ్లీ వాయిదానే…? ఇప్పట్లో జరుగుతుందా?

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే సూచనలు కన్పించడం లేదు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కోవిడ్ బారిన పడటంతో మంత్రి వర్గ విస్తరణ మరికొంత కాలం వాయిదా [more]

Update: 2020-08-10 18:29 GMT

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే సూచనలు కన్పించడం లేదు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కోవిడ్ బారిన పడటంతో మంత్రి వర్గ విస్తరణ మరికొంత కాలం వాయిదా పడే అవకాశముంది. యడ్యూప్ప కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన ఫైల్స్ ను కూడా ఆయన ఆసుపత్రి నుంచే చూస్తున్నారు. మరో వారం రోజులు ఆయన క్వారంటైన్ లోనే ఉండాల్సిన పరిస్థిితి.

కరోనా బారిన పడటంతో…

యడ్యూరప్ప కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. అయితే వైద్యులు మాత్రం ఆసుపత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని కోరడంతో ఆయన ఆసుపత్రిలోనే ఉండిపోయారు. ముఖ్యమైన ఫైళ్లను అధికారులు ఆసుపత్రికి తీసుకువస్తున్నారు. ఫైళ్లను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతనే యడ్యూరప్పకు పంపుతున్నారు. ఆసుపత్రి నుంచే యడ్యూరప్ప పాలన చేస్తున్నారు.

అంతా సిద్ధం చేసినా…..

నిజానికి యడ్యూరప్ప ఆగస్టు నెలలో మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకున్నారు. మరో ఆరు స్థానాలను మంత్రివర్గంలో భర్తీ చేయాల్సి ఉంది. శ్రావణమాసం కావడం, శుభ దినాలు ఎక్కువగా ఉండటంతో ఆయన మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకున్నారు. అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు ముందే నామినేటెడ్ పోస్టులను యడ్యూరప్ప భర్తీ చేశారు. వీరిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.

ఈ నెలలో మాత్రం….

మంత్రి వర్గ విస్తరణలో వీరు పోటీపడకుండా ముందుగానే యడ్యూరప్ప నామినేటెడ్ పోస్టులను వారితోనే భర్తీ చేశారు. అయితే అందులో కొందరు ఎమ్మెల్యేలునామినేటెడ్ పోస్టులు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. సున్నితంగా తిరస్కరించారు. ఆరు మంత్రి పదవులకు దాదాపు ఇరవై మంది వరకూ ఆశావహులు పోటీ పడుతున్నారు. దీంతో మంత్రి వర్గ విస్తరణకు జాబితాను యడ్యూరప్ప హైకమాండ్ కు పంపారు. ఈలోగా కోవిడ్ సోకడంతో ఆగస్టు నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని అంటున్నారు. దీంతో ఆశావహులు డీలా పడ్డారు.

Tags:    

Similar News