అసహనం అంచులదాకా వెళ్లారా?

కర్ణాటకలో మళ్లీ అసంతృప్తి రాజుకుంది. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది ప్రధాన ఆరోపణ. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన [more]

Update: 2019-09-08 17:30 GMT

కర్ణాటకలో మళ్లీ అసంతృప్తి రాజుకుంది. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది ప్రధాన ఆరోపణ. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన 17 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. వారి విషయాలను పట్టించుకోవడం లేదన్నది ఆవేదన. ప్రభుత్వాన్ని పడగొట్టే సమయంలో ముంబయి తీసుకెళ్లి రాచమర్యాదలు చేసిన తర్వాత యడ్యూరప్ప సర్కార్ వచ్చినా తమను ఖాతరు చేయడం లేదని వారు గట్టిగా వాదిస్తున్నారు.

అనర్హత వేటు పడిన….

పదిహేడు మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ముగ్గురు జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు, 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అనర్హత వేటు పడిన వారిలో ఉన్నారు. వీరందరూ ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 11వ తేదీ సుప్రీంకోర్టులో అనర్హత వేటు విషయం విచారణకు వచ్చే అవకాశముంది. స్పీకర్ తమపై రాజ్యాంగ విరుద్ధంగాచర్యలు తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలంటూ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించి నెలన్నర దాటుతున్నా ఇంకా విచారణకు నోచుకోలేదు.

నిలదీసి అడగటంతో…

దీంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పరిస్థితి డోలాయమానంలో పడింది. తాము ముంబయికి వచ్చే ముందు ఇచ్చిన హామీలను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అనర్హతవేటు పడిన ఎమ్మెల్యేలంతా కలసి తమనేతగా జేడీఎస్ ఎమ్మెల్యే విశ్వనాధ్ ను యడ్యూరప్పవద్దకు పంపారు. తాము ఎంతకాలం సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూడాలని నేరుగా యడ్యూరప్పను నిలదీసినట్లు సమాచారం. తమకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పికూడా మాట తప్పేలా వ్యవహరిస్తున్నారని విశ్వనాథ్ సీరియస్ కామెంట్స్ చేసినట్లు చెబుతున్నారు.

యడ్డీ హామీతో….

అయితే ఈనెల 11వ తేదీ వరకూ వేచి చూడాలని, తీర్పు తమకు అనుకూలంగా వస్తే నేరుగా మంత్రివర్గంలోకి కొందరు రావచ్చని ఈ సందర్భంగా యడ్యూరప్ప వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను భారతీయ జనతాపార్టీ ఎట్టిపరిస్థితుల్లో విస్మరించదని కూడా ఆయన అన్నారు. అంతేకాదు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఉందని తెలిపారు. మొత్తం మీద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి, అసహనం రేగుతోంది. మరి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News