టిడిపికి గట్టి షాక్ ఇస్తున్న వైసిపి ?

రాజకీయ పార్టీలు ఏవైనా ఓటు బ్యాంక్ లే లక్ష్యంగా తమ అడుగులు వేస్తాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీకి అండా దండా వెనుకబడిన తరగతికి చెందిన వర్గాలే. వారి [more]

Update: 2019-06-23 06:30 GMT

రాజకీయ పార్టీలు ఏవైనా ఓటు బ్యాంక్ లే లక్ష్యంగా తమ అడుగులు వేస్తాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీకి అండా దండా వెనుకబడిన తరగతికి చెందిన వర్గాలే. వారి అండ తోనే ఆ పార్టీ దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగుతూ వచ్చింది. ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన బిసిలు గట్టి దెబ్బె కొట్టేసి వైసిపి కి జై కొట్టారన్నది ఓట్ల శాతం చెప్పక చెబుతుంది. వైసిపి బిసిలకు ఇచ్చిన భరోసా తో బిసిల్లోని ఉపకులాలు జగన్ మోహన్ రెడ్డి పై నమ్మకంతో సైకిల్ దిగి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసేశాయి. అందువల్లే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బొటా బోటి మెజారిటీ అని అనుకున్న విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి.

కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసిపి వైపే …

వాస్తవానికి దళితులు, మైనారిటీలు, ఎస్సి ఎస్టీ లు వైసిపికి పూర్తిగా మద్దత్తు పలుకుతున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా వున్న వీరంతా వైసిపి స్థాపించాకా ఆ పార్టీ కె తమ ఆశీస్సులు అని నిరూపించాయి. అయితే గత 2014 ఎన్నికల్లో అతి విశ్వాసంతో వైసిపి బీసీలపై దృష్టి పెట్టలేకపోయింది. ఫలితంగా అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఆ గ్యాప్ ను 2019 ఎన్నికల్లో పూడ్చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అన్ని కులాలకు న్యాయం చేస్తా అన్న జగన్ హామీపై ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని టిడిపిని వీడి బిసిలు వైసిపి వైపు చూశారు. దాంతో సంప్రదాయ టిడిపి ఓటు బ్యాంక్ కి భారీగా చిల్లు పడింది. దీనికి తోడు చంద్రబాబు కాపుల పట్ల చూపించిన ప్రేమ తమపై చూపడం లేదన్న ఆగ్రహం ఆ వర్గాల్లో వ్యక్తం అయింది. ఫలితం టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని ఘోర పరాజయాన్ని బాబు మూటగట్టుకున్నారు.

బిసి రిజర్వేషన్ల కోసం రాజ్యసభలో వైసిపి …

సుదీర్ఘ కాలం పార్టీ అధికారంలో వుండాలని కోరుకుంటున్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తదనుగుణమైన వ్యూహాలకు పదును పెట్టేస్తున్నారు. అందులో భాగంగా టిడిపి ఓటు బ్యాంక్ ఎప్పటికి వైసిపి వైపే ఉండేలా రాజ్యసభలో విజయ సాయి రెడ్డి చేత బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు ను తెచ్చింది. ఎస్సి ఎస్టీల కు సంబంధించి అత్యాచార నిరోధక చట్టం వున్నట్లే బిసిలకు వుండాలని ఈ బిల్లులో వైసిపి కోరుతుంది. పార్లమెంట్ లోను, శాసన సభల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లు లో పొందుపరిచింది వైసిపి. ఈ బిల్లుకు టీఆరెస్ కూడా మద్దత్తు ప్రకటించింది. కాంగ్రెస్ సైతం సై అనేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా తన సంప్రదాయ ఓటు బ్యాంక్ కోల్పోయిన కాంగ్రెస్ కూడా బిసి కార్డు తమ పార్టీకి ఎంతోకొంత ప్రయోజనం చేకూరుస్తుందని గుర్తించి వైసిపి బిల్లు పెట్టినా మేము సైతం మీ వెంటే అని చెప్పడం విశేషం.

అన్ని పార్టీలు మద్దత్తు ఇవ్వాలన్న కృష్ణయ్య …

వైసిపి ప్రైవేట్ బిల్లు పెట్టి బిసిలకోసం పోరాటం మొదలు పెట్టడం పై బిసి సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేస్తూ ఈ పరిణామాన్ని స్వాగతించారు. దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దత్తు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిజెపి సర్కార్ ఈ బిల్లు ను ఆమోదించాలని ఆయన కోరుతున్నారు.

ఆమోదం పొందితే వైసిపికి అడ్డే ఉండదు …

వైసిపి ప్రతిపాదిస్తున్న ఈ ప్రైవేట్ బిల్లుపై సమగ్ర చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందితే టిడిపి పరిస్థితి ఎపి లో దారుణంగా మారిపోనుంది. ఒక పక్క జనసేన పార్టీకి ఎపి లో అత్యధికంగా వుండే కాపు ఓటర్ల అండ ఉండనే వుంది. టిడిపికి బిసి పార్టీ అనే ముద్ర వుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఆయువు పట్టుపై వైసిపి గురి పెట్టింది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని మోడీ సర్కార్ ఈ బిల్లుపై నిర్ణయం తీసుకుంటే పసుపు కోట కుప్పకూలడానికి పునాది పడినట్లే. ప్రస్తుతం ఆ పార్టీ ఈ బిల్లుపై రాజ్యసభలో మాట్లాడటానికి వున్నది ఇద్దరే సభ్యులు కావడం మరో నలుగురు పార్టీని విలీనం చేసేయడం తో మాట్లాడే అవకాశం కూడా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. మరి ఈ పరిణామాలకు తెలుగుదేశం ప్రత్యామ్నాయ వ్యూహం ఎలా వుండబోతుందో చూడాలి.

Tags:    

Similar News