తిరుప‌తిలో బీజేపీపై ఫైట్‌.. అక్కడ మాత్రం వైసీపీ దోస్తీ

బీజేపీపై ఒక‌వైపు పోరాటం చేస్తున్నామ‌ని.. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, హోదా విష‌యంలో ఆ పార్టీ తొండి చేస్తోంద‌ని చెబుతున్న వైసీపీ నాయ‌కులు.. అదే పార్టీతో ఇప్పుడు చెట్టాప‌ట్టాలేసుకుని [more]

Update: 2021-04-04 08:00 GMT

బీజేపీపై ఒక‌వైపు పోరాటం చేస్తున్నామ‌ని.. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, హోదా విష‌యంలో ఆ పార్టీ తొండి చేస్తోంద‌ని చెబుతున్న వైసీపీ నాయ‌కులు.. అదే పార్టీతో ఇప్పుడు చెట్టాప‌ట్టాలేసుకుని ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. తిరుప‌తిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ.. ఉప ఎన్నిక‌లో గెలుపు గుర్రం ఎక్కడ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. కానీ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల్లలో మాత్రం బీజేపీ నేత‌లు గెలుపు గుర్రం ఎక్కేలా ఇక్కడ నుంచి చ‌క్రం తిప్పడ‌మే కాకుండా.. చేతనైనంత వ‌ర‌కు సాయం కూడా చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి….

విష‌యంలోకి వెళ్తే.. కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ గ‌తంలో గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే యానాంకు చెందిన మ‌ల్లాడి కృష్ణారావు.. అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయ‌న బాట‌లోనే మ‌రో ముగ్గురు రాజీనామా చేశారు. దీంతో అక్కడి ముఖ్యమంత్రి నారాయ‌ణ‌స్వామి ప్రభుత్వం డిఫెన్స్‌లో ప‌డి బ‌ల‌ప‌రీక్ష కుముందుగానే ప్రభుత్వం ప‌డిపోయింది. ఇక‌, ఇప్పుడు అక్కడ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. కృష్ణారావు రాజీనామా వెనుక‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ ఉన్నార‌నే ప్రచారం అప్పట్లో సాగింది. బీజేపీ వ్యూహం ప్రకార‌మే.. కృష్ణారావును మ‌చ్చిక చేసుకుని, త‌న‌కున్న సంబంధాల నేప‌థ్యంలో ఆయ‌న‌తో రాజీనామా చేయించార‌ని.. త‌ద్వారా .. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయిందంటారు.

పుదుచ్చేరి నుంచి…

ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్న ద‌రిమిలా.. పుదుచ్చేరిలో బీజేపీ నేత‌ల గెలుపున‌కు వైసీపీ శాయ‌శ క్తులా కృషి చేస్తోంద‌ని అంటున్నారు. వైసీపీ నేతలు బీజేపీ మిత్రపక్షాల గెలుపు కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో యానాం కూడా ఓ భాగం. కాకినాడలో కలిసిపోయినట్లుగా ఉండే యానాం నుంచి ఓ ఎమ్మెల్యే పుదుచ్చేరి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటివ‌ర‌కు ఇక్కడ నుంచి మల్లాడి కృష్ణారావు గెలుపుగుర్రం ఎక్కారు. అయితే.. ఈ ద‌ఫా ఆయ‌న కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అంతేకాదు తన సీటును.. బీజేపీ మిత్రపక్షానికి త్యాగం చేశారు.

రంగస్వామి గెలుపు కోసం….

పుదుచ్చేరిలో అన్నాడీఎంకే, బీజేపీ, రంగస్వామి పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. రంగస్వామి మాజీ ముఖ్యమంత్రి. ఆయనే కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. ఇప్పుడు ఆయన ఇతర చోట్ల పోటీ చేస్తే గెలుస్తారో లేదో అనుకున్నారో కానీ.. యానాంకు తీసుకు వచ్చి .. అక్కడ పోటీ చేయిస్తున్నారు. ఇప్పుడు రంగస్వామి గెలుపు కోసం.. వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులంతా అక్కడే మకాం వేశారు. సభలు.. సమావేశాలు పెట్టి రంగస్వామికి మద్దతివ్వాలని ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే.. వైసీపీ ఇటు బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు చెబుతూనే.. మ‌రోవైపు మాత్రం.. పుదుచ్చేరిలో స‌హ‌క‌రిస్తుండ‌డాన్ని బ‌ట్టి.. బీజేపీ-వైసీపీల లోపాయికారీ మైత్రిపై రాజ‌కీయం జోరందుకుంది. రాజ‌కీయాలంటే.. ఏదైనా జ‌ర‌గొచ్చు.. అంటారు ఇందుకేనేమో.

Tags:    

Similar News