తిరుపతి ఉప ఎన్నిక లో వైసీపీకి కష్టమేనా?

తిరుపతిలో వైసీపీ ఆశలు ఫలించేట్లు లేదు. మెజారిటీపై వైసీపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు లేవు. దీనికి ప్రధాన కారణం తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడమే. [more]

Update: 2021-04-18 05:00 GMT

తిరుపతిలో వైసీపీ ఆశలు ఫలించేట్లు లేదు. మెజారిటీపై వైసీపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు లేవు. దీనికి ప్రధాన కారణం తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడమే. తిరుపతి ఉప ఎన్నికను ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా తిరుపతి మెజారిటీపై చర్చ జరగాలని జగన్ భావించారు. ఐదు లక్షల మెజారిటీ రావాలని జగన్ మంత్రులకు, పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

ఐదు లక్షల మెజారిటీ…..

దాదాపు పదిహేను రోజుల పాటు మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే మకాం వేసి వైసీపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. గురుమూర్తి కూడా సరైన అభ్యర్థి కావడంతో తమకు ఐదు లక్షల మెజారిటీ ఖాయమని మంత్రులు భావించారు. ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ తెస్తామని భావించారు. ఈ మేరకు జగన్ కు నివేదికలు కూడా ఏడు నియోజకవర్గాల నుంచి అందాయి.

జగన్ ఉత్సాహం మీద…..

అయితే జగన్ ఉత్సాహం మీద తిరుపతి ఉప ఎన్ని నీళ్లు చల్లిందనే చెప్పాలి. జగన్ ఆశించినట్లు ఐదు లక్షలు కాదు గదా గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ వస్తే చాలునన్న పరిస్థితి నెలకొంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదయింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అప్పటి అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావుకు 2.50 లక్షల వరకూ మెజారిటీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలి కూడా అప్పుడు పనిచేసింది. అప్పడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓట్లు 13.40 లక్షలు మాత్రమే.

ఓటర్లు రాకపోవడంతో…..

తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. గతంలో కంటే నాలుగు లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. దీంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 17 లక్షల మంది వరకూ ఓటర్లున్నారు. అయితే పోలింగ్ శాతం 63 మాత్రమే. అంటే దాదాు 10.10 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం జరిగిన త్రిముఖ పోటీలో వైసీపీకి ఈ పోలింగ్ శాతంతో ఐదు లక్షల మెజారిటీ రావడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద కరోనా భయం కావచ్చు. ఉప ఎన్నికపై అనాసక్తి కావచ్చు తిరుపతి నియోజకవర్గంలో ఓటర్లు వైసీపీ టార్గెట్ ను దెబ్బతీశారనే చెప్పాలి.

Tags:    

Similar News