తెగింపా….? తగ్గడమా…?

లోక్ సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కర్ణాటక వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తుందా? తొందరపడితే లోక్ సభ ఎన్నికల్లో ఫలితం రివర్స్ అవుతుందని భయపడుతుందా? [more]

Update: 2018-12-29 17:30 GMT

లోక్ సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కర్ణాటక వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తుందా? తొందరపడితే లోక్ సభ ఎన్నికల్లో ఫలితం రివర్స్ అవుతుందని భయపడుతుందా? ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణతో కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు టచ్ లేకుండా పోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రమేష్ జార్ఖిహోళి ఇప్పటికే ముంబయిలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది.

ఏంచేయాలో తెలియక……

ఈనేపథ్యంలో కర్ణాటక విషయంలో ఏం చేయాలో బీజేపీ అగ్రనాయకత్వానికి తోచడం లేదు. రమేష్ జార్ఖిహోళి బీజేపీలో చేరేందుకు రెడీ గా ఉన్నారు. కాంగ్రెస్ పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్న ఆయన తనతో పాటు పది మంది వరకూ ఎమ్మెల్యేలను తీసుకువస్తానని చెబుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కుప్పకూలడం ఖాయం. కేవలం ఎనిమిది మంది సభ్యులు తక్కువగా ఉన్న బీజేపీకి పది మంది సభ్యులు చేరితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్దకష్టమేమీ కాదు.

లోక్ సభ ఎన్నికలకు ముందు…..

కాని లోక్ సభ ఎన్నికల ముంచుకొస్తున్న వేళ సంకీర్ణ సర్కార్ కూలిపోతే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. దక్షిణాదిన బలంగా ఉన్న ఏకైక రాష‌్ట్రం బీజేపీకి కర్ణాటక మాత్రమే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను చేజిక్కించుకుని అధికారానికి అడుగు దూరంలో బీజేపీ నిలిచింది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలన్నది కమలం పార్టీ వ్యూహం. అందుకే ఇప్పటి వరకూ ఆపరేషన కమల్ కు తెరతీయవద్దని కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి.

కాంగ్రెస్ ధీమా అదే…..

దీంతోనే బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ను ఢిల్లీకి రప్పించుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే లోక్ సభ ఎన్నికల్లో లాభముంటుందా? లేదా? అన్న దానిపై చర్చలు జరపనుంది. యడ్యూరప్ప మాత్రం ప్రభుత్వం ఏర్పాటుకు రెడీ గా ఉన్నానని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న మంత్రాంగంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారన్నది ఆరా తీస్తున్నారు. వారితో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ తెగించిందన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కన్పిస్తుంది.

Tags:    

Similar News