జగన్ స్టైలే వేరుగా …

ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు చెప్పడం వల్ల తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కానీ ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది. గతంలో చెప్పిన అబద్ధాన్ని నిజం [more]

Update: 2019-08-11 03:30 GMT

ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు చెప్పడం వల్ల తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కానీ ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది. గతంలో చెప్పిన అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి మరికొన్ని అబద్ధాలు అల్లుకుంటూ రావాలి. అలా చేసినా సత్యమే చివరికి గెలుస్తుంది. ప్రజల్లో అప్పుడు సదరు నేతపై చులకన భావం ఏర్పడుతుంది. లీడర్ పై నమ్మకాన్ని క్యాడర్ సైతం కోల్పోతారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం సంపాదిస్తే కానీ ఇలాంటివి అర్ధం కావు. కానీ తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ మొహమాటం లేకుండా ఉన్నది చెప్పడం అలవాటుగా మార్చుకున్నారు. విపక్షంలో వున్నా ఇప్పుడు అధికారం చేపట్టినా జగన్ తన మనసులో ఒకటి పైకొకటి మాత్రం చెప్పారని పేరు మాత్రం సంపాదించేశారు. దీనివల్లకూడా తాత్కాలికంగా సమస్యలు ఎదురైనా అబద్ధాలు మరికొన్ని చెప్పాలిసిన పని ఆయనకు లేకుండా పోతుంది. అంతేకాదు దీర్ఘకాలంలో వైఎస్ జగన్ అప్పుడే చెప్పారు కదా అని ప్రజల్లో చర్చ నడుస్తుంది.

కాపు రిజర్వేషన్లు సాధ్యం కావని అప్పుడు…

కాపు రిజర్వేషన్ల అంశం కాక మీద ఉన్నప్పుడు మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా కాపు సామాజికవర్గం కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రాంతంలో ధైర్యంగా వైఎస్ జగన్ తన మనసులో ఉన్నది చెప్పేశారు. కాపు లను బిసిల్లో చేర్చే అంశం కేంద్రం పరిధిలోనిది అని దీనిపై తాను ఏదో చేసేస్తా అని చెప్పలేనని కార్పొరేషన్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే దానికి డబుల్ నిధులు సమకూరుస్తా అంటూ ప్రకటించి సొంత పార్టీలో ప్రకంపనలు సృష్ట్టించారు. ఆ వెంటనే టిడిపి, జనసేన దీన్ని ఆయుధంగా మలుచుకుని వైఎస్ జగన్ పార్టీ పై విమర్శలు గుప్పించినా వెనక్కి తగ్గలేదు ఆయన. ఆ తరువాత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గమనిస్తే వైఎస్ జగన్ మాటలనే జనం నమ్మినట్లు భారీ మెజారిటీ కట్టబెట్టినట్లు తేలిపోయింది. ఆ సమయంలో పార్టీ లోని కాపు సామాజికవర్గం నేతలనుంచి వైఎస్ జగన్ ఎదుర్కొన్న వత్తిడి అంతా ఇంతా కాదు. కానీ వున్న నిజం చెప్పాలనిపిస్తే చెప్పేయడమే అలవాటుగా మార్చుకున్న వైఎస్ తనయుడి పై నాటినుంచి చర్చ సాగుతూనే వుంది.

బిజెపి మెజారిటీ తగ్గివుంటే ….

ఎన్నికల్లో ఫలితాలు వచ్చాకా ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధాని నరేంద్ర మోడీ ని వైఎస్ జగన్ కలుసుకుని ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధుల సాయంపై చర్చలు జరిపారు. ఆ తరువాత బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మనసులో ఏది దాచుకోకుండా లోపల తాను అనుకున్నవి అన్ని చెప్పేశారు. బిజెపి మెజారిటీ కి దగ్గరగా వచ్చి ఆగిపోతే రాష్ట్రంలోని ఎంపి సీట్లపై ఆధారపడి పరిస్థితి ఉండేదని అప్పుడు మన ప్రయోజనాలు కాపాడుకునే వారమని ఇప్పుడు వారు లెక్క చేసే స్థితి లేదని సామాన్యుల నుంచి తలలు పండిన రాజకీయ పండితులు వరకు అనుకునే అంశాన్ని నేరుగా చెప్పేశారు. అలా చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర స్థాయిలో వివాదాస్పదం చేశాయి విపక్షాలు. వైఎస్ జగన్ తెస్తానని చెప్పినవి ఏమి జరిగే అవకాశం లేదంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం తీరు గమనించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు వైఎస్ జగన్ ముందే చెప్పిన విషయం మరోసారి రుజువు అయ్యింది. దాంతో ఆయనపై నిధులు కేంద్రం నుంచి తేలేకపోతున్నారన్న వత్తిడి తగ్గింది. బిజెపి కి పూర్తి మెజారిటీ ఏపీ కొంప ముంచిందని ఇప్పుడు అంతా భావించే మోడ్ లోకి వెళ్లిపోయారు.

తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు …

ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలను రప్పించే భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ రాయబారులు, కన్సల్ టెంట్ ల సదస్సులో ఓపెన్ గా ఉన్న విషయం కుండబద్దలు కొట్టేలా చెప్పి అందరిని ఆశ్చర్యం లో పడేశారు. వాస్తవానికి ఇలాంటి సదస్సులో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఎక్కువ అబద్ధాలనే ప్రచారం చేస్తారు. దీనికి తోడు ఇటీవల వైసిపి సర్కార్ స్థానికులకే ఉద్యోగాలు 75 శాతం ఇవ్వాలంటూ అసెంబ్లీలో చట్టం చేసి దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. కేసీఆర్ తో స్నేహం పై విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రధాని తో వైఎస్ జగన్ సమావేశాలను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మాదిరి మెగా రాజధానులు లేని ఆంధ్రప్రదేశ్ గా చిన్న చూపు చూస్తుంది. అలాంటి విషయాలు తెలియని విదేశీ ప్రముఖులముందు మరొకరు అయినా బయట పెట్టారు. కానీ జగన్ ఆ విషయంలో నెగిటివ్ లను పాజిటివ్ చేసుకునేలా తన ప్రసంగాన్ని సాగించడం అందరిని ఆకట్టుకుంది.

జగన్ నిర్మొహమాటంగా…

పక్క రాష్ట్రాల మాదిరి రాజధాని లేకపోయినా వారితో స్నేహ సంబంధాలు ఉన్నాయని, కేంద్రంతో సఖ్యత వుందని , ఆరు ఎయిర్ పోర్ట్ లు నాలుగు పోర్ట్ లతో సువిశాల 975 కిలోమీటర్ల తీరప్రాంతం, కృష్ణా, గోదావరి నదులతో అపారవనరులు ఏపీకే సొంతమని వైఎస్ జగన్ ప్రకటించారు. ఏ రాష్ట్రానికి లేనన్ని సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయని, విశాఖ, విజయవాడ గుంటూరు లకు త్వరలో మెట్రో రైలు ప్రాజెక్ట్ లు రానున్నట్లు వెల్లడించారు. ఇక స్థానికులకే ఉద్యోగాలు అన్న కీలక అంశంపై అమెరికా నుంచి అన్ని దేశాల్లో ఇప్పుడు ఈ డిమాండ్ పెరిగిందని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని అంటే, భూములు ఇస్తున్నారంటే ఉపాధి లేక అని స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది న్యాయమైన అంశంగా చెప్పి విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దాంతో బాటు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న విపక్షాలకు ఇదే వేదికపైనుంచి ధీటుగా సమాధానం చెప్పేశారు. పెట్టుబడుల కోసం అబద్ధాలు ప్రచారం చేసుకోవడం వల్ల నష్టమే ఎక్కువ వస్తుందన్న సత్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారు. గతంలోభాగస్వామ్య సదస్సు ద్వారా ఎపి లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం సాగించారు. ఎపి లో వున్న అవకాశాలు ఏమిటి ప్లస్ లు ఏమిటి మైనస్ లు ఏమిటి అన్నది ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో ప్రపంచం ముందు తెలిసిపోయే అవకాశం వుంది. అలాంటి స్థితిలో తప్పుడు సమాచారంతో పెట్టుబడులకోసం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే వచ్చే వారు కూడా రాకుండా పోతారన్న ఆలోచన సరైనదే అన్న అభిప్రాయం పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తం కావడం తో వైఎస్ జగన్ ఈ విషయంలో వేస్తున్న అడుగులు సరైనవే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News