బిజెపి పై జగన్ ద్విముఖ వ్యూహం ?

వైసిపికి ప్రత్యామ్నాయంగా ఎపి లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి దూకుడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్విముఖ వ్యూహం రూపొందించారని తెలుస్తుంది. టిడిపి నుంచి ఎంపి [more]

Update: 2019-06-24 00:30 GMT

వైసిపికి ప్రత్యామ్నాయంగా ఎపి లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి దూకుడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్విముఖ వ్యూహం రూపొందించారని తెలుస్తుంది. టిడిపి నుంచి ఎంపి ఎమ్యెల్యేలను ఆకర్షించి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఐదేళ్ళలో బలపడాలన్నది కమలనాధుల ఆలోచన. ఇప్పటికే బలహీన పడిన టిడిపి నాయకత్వాన్ని మరింతగా దెబ్బకొట్టి జీరో చేసాక తమ టార్గెట్ జగన్ లక్ష్యంగా చేసుకోవడం అన్నది బిజెపి వ్యూహంగా తెలుస్తుంది. దాంతో జగన్ ముందస్తుగానే మేల్కొని పటిష్ట వ్యూహాన్ని ఇప్పటికే అమల్లో పెట్టేశారు.

ఈ రెండు కమలాన్ని ఇరుకున పెట్టేవే …

అందులో మొదటిది ఎపి కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్న దానిపై రాజీ లేకుండా పోరాడటం. కౌంటింగ్ ఇలా పూర్తి అయ్యిందో లేదో అధికారం చేపట్టకుండానే జగన్ మోహన్ రెడ్డి ఈ స్లోగన్ గట్టిగానే అందుకున్నారు. అంతే కాదు హస్తిన కేంద్రంగా లాబీయింగ్ తీవ్రం చేశారు. ఏమి చేస్తున్నది అందరితో పంచుకుంటున్నారు. లోపల ఒకటి బయటకు ఒకటి వ్యవహారం సాగించకుండా ఓపెన్ గానే అన్ని చేస్తున్నారు. నీతి ఆయోగ్ కావొచ్చు, అఖిలపక్షం కావొచ్చు అన్నిటా మొహమాట పడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కేంద్రంలోని కమలం సర్కార్ కాలర్ పట్టుకోకున్నా కడిగేస్తున్నారు. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ సందర్శన చేసిన సమయంలోను తన వైఖరి స్పష్టం చేయలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక కేంద్రానికి తిరిగి అప్పగిస్తుందో తేల్చలేదు.

బాబు ప్రచారాన్ని సమర్ధంగా వాడితే సరి ….

పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా అస్సలు ఇచ్చేది లేదని అన్యాయం చేస్తుందని నాడు రాష్ట్రం కోసం ధర్మ పోరాటం అంటూ కమలం రెక్కలు విరిచేశారు చంద్రబాబు. ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లిన మరో ఐదేళ్ళు కాంగ్రెస్ లాగే బిజెపి పట్ల వ్యతిరేకతను రాష్ట్ర వాసుల్లో పెంచేలా చేశాయి. ఇప్పుడు ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యూహానికి మరింతగా పదును పెట్టనున్నారు. ప్రత్యేక హోదా అంశంలో బిజెపి వెనక్కి ముందుకు రాలేని పరిస్థితి. అలాగే కేంద్రానికి పోలవరానికి అప్పగిస్తే ఎపి సర్కార్ పై ఎలాంటి ఆర్థికభారం ఉండదు. కేంద్రం ఐదేళ్లల్లో కడితే కమలానికి కీర్తి కొంత దక్కినా ఈ ప్రాజెక్ట్ తన తండ్రి కల అని చెబుతూనే బిజెపి పాత్రను అభినందించినా వైసిపి అధినేతకు వచ్చే నష్టం లేదు. ఇక మోడీ సర్కార్ ప్రాజెక్ట్ నత్త నడకన సాగిస్తే అది కమలనాథులకు శాపమే అవుతుంది. పైగా ప్రధానమైన ఈ ప్రాజెక్ట్ కేంద్రం చేపడితే రాష్ట్రానికి అవినీతి మకిలి అంటే అవకాశం ఉండదు. ఇప్పటికే ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు తరలించే వీలు ఉండటంతో పోలవరం ఆలస్యం అయినా కృష్ణా, విశాఖ జిల్లాలకు నీటికి కొరత ఉండదు అన్నది ఎపి సిఎం వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు కీలక అంశాల్లో బిజెపిని ఫిక్స్ చేస్తే ఆ పార్టీ ఎందరిని తమపార్టీలోకి ఫిరాయించుకున్నా విస్తరించినా వైసిపికి పోయేదేమీ లేదంటున్నారు వారు.

Tags:    

Similar News