కసరత్తు ఏదీ? కలహాలు పెరిగిపోవూ…?

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్నా అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఎటువంటి స్పష్టత లేదు. కేవలం ముఖ్యమంత్రి ఎవరు? పార్టీ అధ్యక్షుడు ఎవరు? అన్న విషయాలపైనే ఇప్పటి వరకూ ఆ [more]

Update: 2021-02-19 18:29 GMT

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్నా అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఎటువంటి స్పష్టత లేదు. కేవలం ముఖ్యమంత్రి ఎవరు? పార్టీ అధ్యక్షుడు ఎవరు? అన్న విషయాలపైనే ఇప్పటి వరకూ ఆ పార్టీ నేతలు చర్చించారు. అంతే తప్ప కూటమిలోని ఏపార్టీని పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. ఒకవైపు డీఎంకే కూటమి రోజురోజుకూ బలోపేతం అవుతుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పార్టీలు మాత్రం వైదొలగడానికి సిద్దమవుతున్నాయి.

కూటమిలోని పార్టీలను….

అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే, డీఎండీకే, బీజేపీ వంటి పార్టీలున్నాయి. అయితే వీటిని పట్టించుకోకుండా శశికళను నిలువరించడంపైనే ఫోకస్ పెట్టింది. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. న్యాయపరంగానే కాకుండానే పార్టీలోని నేతలను తమ వైపునకు లాక్కునేందుకు శశికళ ప్రయత్నిస్తుంది. అమ్మ స్మరణను వదలకుండా, కనీసం జెండాను ఉపయోగించకుండా శశికళ ఉండలేరన్నది అన్నాడీఎంకే అభిప్రాయం.

శశికళపైనే ఫోకస్….

అందుకే శశికళ మీదనే అన్నాడీఎంకే నేతలు ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే ఇప్పటికీ అన్నాడీఎంకే కూటమి పార్టీలకు సీట్ల పంపంకాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. డీఎండీకే. పీఎంకే వంటి పార్టీలు ఈసారి ఎక్కువ స్థానాలు కోరుతున్నాయి. పీఎంకే ఇప్పటికే హెచ్చరికలను పంపింది. పీఎంకే అధినేత ను బుజ్జగించేందుకు మంత్రులను పంపింది. అయితే వారు తృప్తి చెందలేదని సమాచారం. అవసరమైతే తాము విడిగానైనా పోటీ చేస్తామని, డీఎంకేతోనైనా కలుస్తామని పీఎంకే చెబుతోంది.

బయటకు వెళతామంటూ….

అన్నాడీఎంకే కూటమిలో ఉన్న విజయకాంత్ పార్టీ డీఎండీకే లో అసహనం వ్యక్తమవుతుంది. వారికి సీట్ల పంపకంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆ పార్టీ అన్నాడీఎంకేను హెచ్చరించింది. చివరి నిమిషంలో తక్కువ సీట్లను కేటాయించవచ్చన్న అనుమానం ఆ పార్టీనేతల్లో వ్యక్తమవుతోంది. తొందరగా సీట్ల పంపకం తేలిస్తే తాము కూటమిలో ఉండాలో? లేదో? తేల్చుకుంటామని చెబుతున్నారు. అయితే అన్నాడీఎంకే మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో నానుస్తూనే ఉంది. శశికళ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది.

Tags:    

Similar News