తేడా వస్తే తిరుపతి ప్రభావం?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు జగన్ సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో గెలవడం జగన్ కు తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా రాజధాని అమరావతి తరలింపుపై దీని ప్రభావం [more]

Update: 2020-12-12 03:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు జగన్ సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో గెలవడం జగన్ కు తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా రాజధాని అమరావతి తరలింపుపై దీని ప్రభావం పడుతుంది. అందుకే జగన్ తిరుపతి ఉప ఎన్నికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే వైసీపీ తిరుపతి అభ్యర్థిగా గురుమూర్తిని ఏకపక్షంగా జగన్ నిర్ణయించారని పార్టీలు గుసగుసలు వినపడుతున్నాయి. నేరుగా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టకున్నా కొందరు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

అభ్యర్థి నిర్ణయంపై….

అభ్యర్థి నిర్ణయంపై జరిపిన సమావేశంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు. పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. మిగిలిన నేతలను ఈ సమావేశాలకు దూరంగా ఉంచి జగన్ నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నాయి.

ఎమ్మెల్యేలను….

వీరిలో ఒక్క కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రమే సమావేశానికి హజరయ్యారు. ప్రధానంగా బల్లి దుర్గాప్రసాద్ గూడూరు ప్రాంతానికి చెందిన వారు కావడంతో గూడూరు ఎమ్మెల్యే అభిప్రాయాన్ని కూడా జగన్ తీసుకోలేదంటున్నారు. అలాగే బలమైన నేత రెండు నియోజకవర్గాల్లో పట్టున్న ఆనం రామనారాయణరెడ్డి సూచనలను కూడా జగన్ తీసుకోకపోవడం పార్టీలో చర్చ నీయాంశమైంది. రేపు వీరంతా కలసి తిరుపతి అభ్యర్థిని గెలిపించాల్సి ఉంటుంది.

మంత్రులకే బాధ్యతలు…..

అయితే వీరిందరితో త్వరలో సమావేశం ఉంటుందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా జగన్ త్వరలోనే నియమిస్తారని చెబుతున్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే బాధ్యత కేంద్ర పార్టీ కార్యాలయంలో ఒక సీనియర్ నేతకు అప్పగిస్తారంటున్నారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జగన్ ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించినా అది అసలుకే ముప్పు తెస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి జగన్ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కగలుగుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News