విష్ణు అదిరిపోయే స‌ల‌హా.. జ‌గ‌న్ ఫాలో అవుతారా..?

బీజేపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు ఇటీవ‌ల కాలంలో మీడియాకు చాలా దూరంగా ఉంటున్నారు. గ‌తంలో మాదిరిగా ఆయ‌న స్పందించ‌డం లేదు. బీజేపీకి సంబంధించిన [more]

Update: 2020-06-02 11:00 GMT

బీజేపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు ఇటీవ‌ల కాలంలో మీడియాకు చాలా దూరంగా ఉంటున్నారు. గ‌తంలో మాదిరిగా ఆయ‌న స్పందించ‌డం లేదు. బీజేపీకి సంబంధించిన విష‌యాలు స‌హా రాష్ట్ర ప్రభుత్వ స‌ర‌ళిపై గ‌తంలో ఆయ‌న వెరైటీగా స్పందించేవారు. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో.. అస‌లు విష్ణుకుమార్ రాజు అస‌లు ఏపార్టీలో ఉన్నారు? అనే సందేహం వ‌చ్చేలా ఆయ‌న కామెంట్లు ఉండేవి. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న పార్టీ మార‌తారేమో ? అని బీజేపీలోనే చ‌ర్చ‌లు న‌డిచాయి. అలాంటి నేత‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపొయిన త‌ర్వాత‌.. ఇప్పటి వ‌ర‌కు పెద్దగా మీడియా ముందుకు వ‌చ్చింది లేదు. గ‌తంలో ఒకసారి వ‌చ్చినా.. తెలుగు మాధ్యమం ఎత్తివేత స‌హా అమ్మ ఒడి కి సంబంధించి జ‌గ‌న్‌ను కొనియాడారు.

జగన్ పై ధ్వజమెత్తి….

అదే స‌మ‌యంలో కేసీఆర్‌తో జ‌గ‌న్ క‌లిసి ముందుకు సాగ‌డాన్ని తాను ఆహ్వానిస్తాన‌ని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఇక‌, ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ మీడియా ముందుకు రాలేదు. అయితే, తాజాగా ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే, ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న భిన్నమైన గ‌ళం వినిపించారు. మొత్తంగా జ‌గ‌న్‌ను తిట్టిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం జ‌గ‌న్ షాకుల మీద షాకులిస్తున్నారన్నారు. మందు బాబులకు రేట్లు పెంచుతూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని, ప్రభుత్వం భూములను పరిరక్షించాల్సింది పోయి.. ఆ భూములను సర్కారే అమ్ముకోవడం దారుణాతి దారుణమని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. సామాన్యు డికి కరెంట్ షాక్.. ఇచ్చారంటూ విరుచుకుప‌డ్డారు.

షాకులిస్తున్నారంటూ….

ప్రతి ఒక్కరూ కరెంట్‌ను వినియోగిస్తారని.. అలాంటిది 500 యూనిట్లు దాటిన తర్వాత 90 పైసలు రేటు పెంచిన ఘనత కూడా సీఎం జగన్‌దేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. అలాగే ఆటో కార్మికులకు రూ. 10 వేలు ఇచ్చి తర్వాత పోలీసులచేత వారిపై కేసులు బుక్ చేసి ఫెనాల్టీ వసూలు చేస్తు షాకులిస్తున్నారని, చివరికి రూ.5 భోజనం దొరికే అన్నా క్యాంటిన్లు మూసివేసి షాకిచ్చారన్నారు. కరోనా సమయంలో ఆ క్యాంటిన్లు ఉంటే బాగా ఉపయోగపడేవన్నారు. కనీసం జగనన్న క్యాంటిన్లు అని పేరుమార్చి రన్ చేసినా ప్రజలు సంతోషించేవారని స‌ల‌హా ప‌డేశారు. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఇలా.. రాష్ట్రంలో షాకులు తగలకూడని వ్యక్తులు ఎవరూ ఉండరని రాజుగారు వ్యాఖ్యానించారు.

గతంలో కూడా ఇంతే…..

మ‌రి ఈ అంశాల‌ను వైసీపీ అధినేత కానీ, పార్టీ నేత‌లు కానీ ప‌ట్టించుకుంటారో లేదో చూడాలి. అయితే అదే విష్ణుకుమార్ రాజు మొన్న విశాఖ న‌గ‌రంలోని ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయిన‌ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగ‌వంత‌మైన చ‌ర్యలు తీసుకుందంటూ జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. మ‌ళ్లీ నాలుగు రోజుల‌కే ఆయ‌న త‌న స్వరం పూర్తిగా మార్చేశారు. ఇక గ‌తంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయ‌న ఒక్కోసారి బాబును పొగ‌డ‌డం.. మ‌రోసారి తిట్టడం…. అదే స‌మ‌యంలో మ‌రోసారి ప్రతిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్‌ను మెచ్చుకోవ‌డం చేస్తూ రాజ‌కీయంగా త‌న చంచ‌ల మ‌న‌స్తత్వాన్ని బ‌య‌ట పెట్టుకునే వారు. అదే పంథాను ఆయ‌న ఇప్పుడు కూడా కొన‌సాగిస్తున్నట్టే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News