విష్ణు మాలోకం: పార్టీకి ద‌గ్గర.. నేత‌ల‌కు దూరం

రాష్ట్ర రాజ‌కీయాల్లో పెన్మత్స విష్ణుకుమార్ రాజు స్టయిలే వేరు. ఆయ‌న ఉన్నది బీజేపీలో. అయితే.. ఆయ‌న రాజ‌కీయాలు మాత్రం ఏ పార్టీతో ఎలా ఉంటాయో చెప్పడం క‌ష్టం. [more]

Update: 2021-01-07 06:30 GMT

రాష్ట్ర రాజ‌కీయాల్లో పెన్మత్స విష్ణుకుమార్ రాజు స్టయిలే వేరు. ఆయ‌న ఉన్నది బీజేపీలో. అయితే.. ఆయ‌న రాజ‌కీయాలు మాత్రం ఏ పార్టీతో ఎలా ఉంటాయో చెప్పడం క‌ష్టం. ఇదేదో గిట్టని వారు.. ఆయ‌న‌పై ఉన్న ప్రత్యర్థి వ‌ర్గాలు చెబుతున్న మాట కాదు. ఏకంగా బీజేపీ సీనియ‌ర్లే అంటున్న కామెంట్లు. సీనియ‌ర్ నాయ‌కుడు.. అంతో ఇంతో ఆర్ఎస్ఎస్ భావ‌జాలానికి కూడా ఆయ‌న సంపూర్ణ మద్దతు దారు. అయితే.. నిన్నగాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన వారితో పోలిస్తే.. విష్ణుకుమార్ రాజు పార్టీ నేత‌లతో క‌లిసిపోయే తీరు మాత్రం ప్రశ్నార్థక‌మే. ఆయ‌న ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రక‌ట‌న చేస్తారో బీజేపీ నేత‌లు సైతం చెప్పలేరు.

పనులు చేయించుకోవడంలో….

గ‌తానికి, ఇప్పటికి విష్ణుకుమార్ రాజులో మార్పు లేదు. పార్టీలో ఉన్నా.. ఏనాడూ.. బీజేపీ జెండా ప‌ట్టుకుని ఓ వంద స‌భ్యత్వాలు రాయించిన రికార్డు ఆయ‌న‌కు లేదు. పోనీ.. బ‌లంగా బీజేపీ వాయిస్ వినిపించిందీ లేదు. గ‌తంలో చంద్రబాబు హ‌యాంలో ఆయ‌న ఆ పార్టీకి మ‌ద్దతు దారుగా వ్యవ‌హ‌రించార‌నే వాయిస్ వినిపించింది. నేరుగా అసెంబ్లీలోనే చంద్రబాబును పొగ‌డ్తల‌తో ముంచెత్తారు. ఆయ‌న బీజేపీ విప్‌గా ఉన్నా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేల‌కు చంద్రబాబు ద‌గ్గర లేని గుర్తింపు సొంతం చేసుకోవ‌డంతో పాటు తాను కోరిన ప‌నులు కోరిన‌ట్టు బాబు చేసేలా విష్ణుకుమార్ రాజు చ‌క్రం తిప్పారు.

వైసీపీలోకి వస్తారంటూ….

అదే స‌మ‌యంలో విష్ణుకుమార్ రాజు జ‌గ‌న్‌పైనా అభిమానం చూపించారు. ఒకానొక ద‌శ‌లో ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చేస్తున్నార‌న్న ప్రచారం జ‌రిగేంత‌గా జ‌గ‌న్‌పై అభిమానం పెంచుకున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీ నేత‌ల‌తో ఏమైనా ద‌గ్గర బంధాలు కొన‌సాగిస్తున్నారా? అంటే.. ఎక్కడా క‌నిపించ‌డం లేదు. పైగా ఆయ‌న ఎప్పుడు మైకు పుచ్చుకున్నా.. బీజేపీ గురించి మాట్లాడింది త‌క్కువ‌. ప్రస్తుతం ఏపీ వ‌ర‌కు చూస్తే బీజేపీ ఓ సంక్లిష్ట ప‌రిస్థితిలో ఉంది. ఒక‌వైపు ప‌వ‌న్‌తో పొత్తును పెట్టుకుని ముందుకు సాగుతూనే ఒంట‌రిగా స‌త్తా చాటేందుకు ఎదిగేందుకు కూడా క‌మ‌లం పార్టీ ప్రయ‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో నాయ‌కుల మ‌ద్దతు పార్టీకి, పార్టీ మ‌ద్దతు నాయ‌కుల‌కు కూడా అవ‌స‌రం.

ఎదిగే అవకాశం ఉన్నా….

ఈ క్రమంలో ఎవ‌రు మైకు పుచ్చుకుని మాట్లాడినా.. అక్కున చేర్చుకునేందుకు బీజేపీ నాయ‌కులు సిద్ధంగానే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడున్న వారిని గ‌మ‌నిస్తే.. ప్రజాక్షేత్రంలో గెలిచిన వారు ఎవ‌రూ బీజేపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డం లేదు. గ‌తంలో గెలిచిన వారు.. అంతో ఇంతో ప్రజ‌ల్లో బ‌లం ఉన్న వారు మౌనంగా ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో త‌ట‌స్థంగా ఉండే విష్ణుకుమార్ రాజుకు ఎదిగేందుకు మంచి గ్యాప్ ఉన్నప్పటికీ.. ఆయ‌న త‌న వైఖ‌రి కార‌ణంగా.. పార్టీలో నేత‌ల‌కు దూర‌మ‌వుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News