గ్యాంగ్ లన్నీ వచ్చేశాయట

విశాఖ పేరు చెప్పుకుంటే దానికంటే ముందు వచ్చేది ప్రశాంతత. ఇక్కడ ప్రజలు శాంత స్వభావులు. తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉంటారు. అటువంటి విశాఖలో అశాంతి అన్న [more]

Update: 2020-01-18 13:30 GMT

విశాఖ పేరు చెప్పుకుంటే దానికంటే ముందు వచ్చేది ప్రశాంతత. ఇక్కడ ప్రజలు శాంత స్వభావులు. తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉంటారు. అటువంటి విశాఖలో అశాంతి అన్న మాటే లేదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిపోయింది. కిరాయి హత్యలకు కేంద్రంగా నగరం ఉండడం ఆందోళన కలిగించే పరిణామమే. విశాఖ వేగంగా విస్తరిస్తున్న సిటీ. ఇక్కడకు ఇపుడు రాకపోకలు ఇతర ప్రాంతాల నుంచి బాగా పెరిగాయి. ఇక అభివృధ్ధిలో పరుగులు పెడుతున్న నగరానికి మర్డర్ల కల్చర్ కూడా వచ్చి చేరుతుండడం బాధాకరం.

హంతక ముఠాలు….

ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగుతున్న వేళ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వైసీపీ నాయకుడిని దారుణంగా హత్య చేసేందుకు విశాఖ సిటీలోనే ప్లాన్ రెడీ చేయడం నగర‌వాసులకు షాకింగ్ న్యూస్ గా ఉంది. ఇందుకోసం నగరంలో మకాం వేసిన గ్యాంగ్ స్టర్స్ కి సుపారీ ఇచ్చి మరీ ఈ కేసును సెటిల్ చేయమని కోరింది టీడీపీకి చెందిన నేతలు కావడం విశేషం. రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకు శ్రీకాకుళం ఎచ్చెర్లకు చెందిన వైసీపీ నేత చిరంజీవిని అంతమొందించాలని టీడీపీ నేత తమ్మినాయుడు విశాఖలోనై రౌడీషీటర్ కన్నబాబుతో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనం రేకెత్తించింది. వైసీపీ నేత చిరంజీవి తనను ఎవరో వెంటాడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిఘా పెట్టి మరీ అసలు గుట్టుని లాగారు. దాంతో దీనివెనక ఉన్న రౌడీ షీటర్లు, గ్యాంగ్ స్టర్లు బయటకు వస్తున్నారు.

ముంబై కల్చర్…

మొత్తం మీద చూసుకుంటే హైదరాబాద్, ముంబై లాంటి చోట్ల జరిగే ఈ తరహా మర్డర్లు, వాటి వెనక రౌండీ గ్యాంగులు ఇపుడు విశాఖలో కూడా హల్ చల్ చేస్తున్నాయా అని నగరవాసులు బెదిరిపోతున్నారు. ఓ వైపు విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దాంతో విశాఖ ముంబై స్థాయికి చేరుకుంటుందని కూడా అంతా అంటున్నారు. అయితే ఆ అభివృధ్ధి సంగతేమో కానీ విశాఖలో ఈ తరహా రౌడీ గ్యాంగుల ప్రవేశంతో ఇప్పటికే ముంబైని తలపిస్తోందని జనం బెంబేలెత్తుతున్నారు.

పాము పడగ నీడలో….

విశాఖలో కరడు కట్టిన ముఠాల ఉనికి కూడా ఎపుడూ లేదు. ఏదో చిల్లర దొంగతనాలు చేసుకునే వారు, చిన్న పాటి ఘర్షణలు ఇవే విశాఖలో నేరాలు అంటే. అయితే విభజన తరువాత భూముల రేట్లు ఒక్కసారిగా పెరగడంతో భూ కభ్జాకోరుల వెనక రౌడీ గ్యాంగులు కూడా దిగిపోయాయని అంటున్నారు. అలాగే, విశాఖ రాజధాని నగరం అంటున్న నేపధ్యంలో మరింతగా నేర సంస్కృతి ఈ ప్రాంతానికి పాకుతుందని కూడా అనుమానిస్తున్నారు. దాంతో ఎక్కడలేని హంతక ముఠాలు కూడా విశాఖకు మకాం మార్చుతున్నాయా అని పోలీసులు సైతం సందేహిస్తున్నారు. మరి విశాఖ వంటి ప్రశాంత నగరంలో పాముల్లా పడగ విప్పుతున్న గ్యాంగ్ స్టర్స్ ని మొదట్లోనే తుంచేయకపోతే పెను ముప్పు తప్పదని మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News