విజయసాయిరెడ్డికి కత్తెర ? నిజమేనటగా?

విజయసాయిరెడ్డి. జగన్ తరువాత అంతటివారు, యువ ముఖ్యమంత్రికి నీడలాంటివారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. వైసీపీ నేత. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి. పలుపార్లమెంటరీ కమిటీల్లో చైర్మన్ [more]

Update: 2020-07-22 14:30 GMT

విజయసాయిరెడ్డి. జగన్ తరువాత అంతటివారు, యువ ముఖ్యమంత్రికి నీడలాంటివారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. వైసీపీ నేత. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి. పలుపార్లమెంటరీ కమిటీల్లో చైర్మన్ గా, మెంబర్ గా కూడా ఉంటూ వస్తున్నారు. ఢిల్లీలో రెండవ జగన్ గా రాణిస్తున్న కీలక నేత. అటువంటి సాయిరెడ్డి అధికారాలకు ఇపుడు కత్తెర పడబోతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డికి పార్టీ అధికారాల్లో కోత పెట్టారు, ఆయన్ని కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జిగానే ఉంచారు. మిగిలిన పది జిల్లాలకూ సంబంధం లేదని తేల్చారు, ఇపుడు ఏకంగా ఢిల్లీలో కూడా ఆయనకి మరో అతి పెద్ద కత్తెర పడబోతోంది.

ఆయనేనా…?

ఎవరు ఏపీలో అధికారంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో వ్యవహారాలు చూసేందుకు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అతి సన్నిహితులు అయిన వారిని నియమించుకుంటారు. ఈ కీలకమైన పదవిలో ఉన్న వారు అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటారు, క్యాబినెట్ ర్యాంక్ పదవిగా ఇది ఉంటుంది. ఈ పదవిలో ఏడాది క్రితం విజయసాయిరెడ్డిని జగన్ నియమించారు. ఆయనకు ఈ పదవిని కట్టబెట్టే విషయంలో అప్పట్లో విమర్శలు వచ్చాయి కూడా. లాభాపేక్ష కలిగిన పోస్టుల్లో ఎంపీలు నియమితులు కాకూడదు అని కూడా నిబంధనలు ఉటంకించారు. అయితే జగన్ వాటిని భేఖాతర్ చేస్తూ విజయసాయిరెడ్డికి కట్టబెట్టారు. ఇపుడు ఈ పదవిల్లో అజేయ కల్లాంని కూర్చోబెట్టాలని జగన్ అనుకుంటున్నారుట.

హవా తగ్గినట్లే……

ఇక ఈ పదవి కనుక అజేయ కల్లాంకి ఇస్తే విజయసాయిరెడ్డి ఢిల్లీ పలుకుబడికి, హవాకు చెక్ పడినట్లేనని ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఢిల్లీలో విజయసాయిరెడ్డి మాత్రమే వైసీపీ తరఫున కనిపించేవారు. ఆయన గొంతు మాత్రమే వైసెపీ వాణిగా అనిపించేది. జగన్ సైతం ఆయన్నే నమ్ముకునేవారు. కానీ ఇపుడు అజేయ కల్లాంకి బాధ్యతలు అప్పగిస్తే సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఆయన చక్రం తిప్పడం ఖాయం. రెండవ పవర్ సెంటర్ గా విజయసాయిరెడ్డికి పోటీగా ఎదగడం ఖాయం. పైగా ఎంపీలకు, పార్టీకి ఆయన దిక్సూచిగా మారే సీన్ కూడా ఉంటుంది.

గ్యాప్ పెరిగిందా?

విజయసాయిరెడ్డి, జగన్ ల మధ్యన గ్యాప్ పెరిగిందా అన్న చర్చ వస్తోంది. హఠాత్తుగా అత్యంత కీలకమైన పదవి నుంచి ఆయన్ని తప్పిస్తే ఇక విజయసాయిరెడ్డి తగ్గుతారని అంటున్నారు. అన్నీ తానే అయి, అంతా తానే అయి ఉన్న విజయసాయిరెడ్డి విషయంలో జగన్ ఎందుకిలా నిర్ణయాలు వరసగా తీసుకుంటున్నారు అన్న చర్చ కూడా పార్టీలో ఉంది. విజయసాయిరెడ్డి సరిగ్గా బ్రీఫింగ్ ఇవ్వకపోవడం వల్లనే వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు పార్టీకి దూరం అయ్యారని అంటున్నారు. ఈ విషయంలో మరింతమంది ఎంపీలు కూడా ఆయాన మీద గుర్రుగా ఉన్నారని టాక్ ఉంది. అదే విధంగా ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వ సంబంధాల విషయంలో కూడా కొంత ఇబ్బంది వచ్చిందని కూడా జగన్ భావిస్తున్నారుట. గతంలోలా విజయసాయిరెడ్డి వ్యవహరించడం లేదన్న అనుమానం కూడా జగన్ కి ఉండడంతోనే అజేయ కల్లాం ద్వారా ఆయన అధికారాలకు కత్తెర పడుతోందని చెబుతున్నారు.

Tags:    

Similar News