సాయిరెడ్డిని ఇక ఆపలేమటగా?

జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సన్నిహితుడు, ఓ విధంగా ఆత్మగా భావించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని ఇస్తూ క్యాబినెట్ ర్యాంక్ [more]

Update: 2020-02-15 03:30 GMT

జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సన్నిహితుడు, ఓ విధంగా ఆత్మగా భావించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని ఇస్తూ క్యాబినెట్ ర్యాంక్ కల్పించారు. ఇపుడు ఏకంగా విజయసాయిరెడ్డి జాక్ పాట్ ని కొట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకూలిస్తే విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రిగా త్వరలోనే ప్రమాణం చేస్తారని కూడా అంటున్నారు. విజయసాయిరెడ్డికి జగన్ కి నమ్మిన బంటు. అందువల్ల కేంద్రమంత్రివర్గంలో వైసీపీ చేరితే కచ్చితంగా తొలిపేరు ఆయన‌దేనని అంతా అంటున్నారు.

విశాఖ కోటాలో…?

ఇప్పటికే విశాఖను పరిపాలనారాజధానిగా జగన్ ప్రకటించారు. ఇక అక్కడే జగన్ కూడా ఉంటారు. దానికి తోడు అన్నట్లుగా విశాఖను నాలుగేళ్ళ క్రితమే నోడల్ జిల్లాగా దత్తత తీసుకున్న విజయసాయిరెడ్డి ఇక్కడ ప్రజా ప్రతినిధిగానే గుర్తింపు పొందారు. దాంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తే విశాఖ కోటాలోనే దక్కినట్లుగా భావించాలి. అదే విధంగా పాలనా రాజధానిగా విశాఖ కాబోతున్న దరిమిలా విజయసాయిరెడ్డి కేంద్రం నుంచి అవసరమైన నిధులను తెచ్చి అభివృధ్ధి చేసేందుకు కూడా వీలుంటుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ వ్యూహాత్మకమైన అడుగు వేస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డికి లక్కీ చాన్స్ తగిలినట్లేనని అంటున్నారు.

చిన్నమ్మ తరువాత…..

ఆరేళ్ళ క్రితం కేంద్ర మంత్రిగా దగ్గుబాటి పురంధేశ్వరి ఉండేవారు. ఆమె విశాఖ ఎంపీగా ఇక్కడ కోటా నుంచే ఆ పదవిని చేపట్టారు. అంతకు ముందు కేంద్ర మంత్రిగా టీ సుబ్బరామిరెడ్డి కూడా విశాఖ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇపుడు విజయసాయిరెడ్డికి కూడా ఈ పదవీయోగం దక్కితే మరో మారు విశాఖ వెలిగిపోవడం ఖాయమని అంటున్నారు. చిత్రమేంటంటే ఈ ముగ్గురూ కూడా ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చి రాజకీయం చేస్తున్న వారే. ఇక టీఎస్సార్ రాజ్యసభ పదవీకాలం మరో నెల రోజుల్లో పూర్తి కావస్తోంది. ఈ కీలక సమయంలో విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి పదవి అందుకుంటే మరో నెల్లూరు పెద్దాయన విశాఖలో పాగా వేసినట్లే అవుతుందని అంటున్నారు.

జాబితా రెడీనా…?

కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరడం లాంచనమేనని ఢిల్లీ వర్గాల భోగట్టా. మోడీతో జగన్ జరిపిన చర్చల్లో ఇదే టాప్ సబ్జెక్ట్ అని కూడా అంటున్నారు. మరో వైపు వైసీపీకి ఎన్ని బెర్తులు కేటాయిస్తారన్నది ఒక చర్చగా ఉంది. వైసీపీకి లోక్ సభలో 22 మంది, రాజ్యసభలో ఇద్దరు ఉన్నారు మరో నెలలో వీరు ఆరుగురు అవుతారు. అంటే మొత్తం 28 మంది ఎంపీలతో బలమైన పార్టీగా పార్లమెంట్ లో వైసీపీ ఉంది.

సామాజిక న్యాయమేనా…?

దాంతో ఆ పార్టీ కనీసంగా నాలుగు మంత్రి పదవులు అడుగుతున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఇందులో ఇద్దరికి క్యాబినెట్, ఇద్దరికి సహాయ మంత్రులుగా కూడా కోరుతోంది. ఇక విజయసాయిరెడ్డి కాకుండా ఎస్సీ, ఎస్టీ, కాపు కోటాలను, ఇందులోనే మహిళా కోటాను కూడా భర్తీ చేయాలని జగన్ భావిస్తున్నారుట. మరి బీజేపీ ఎన్ని మంత్రిపదవులు ఇస్తుందన్న దానిపైనే జగన్ సామాజిక న్యాయం ఆధారపడిఉంటుంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డికి మాత్రం క్యాబినెట్ హోదాలో కీలకమైన మంత్రిత్వ శాఖ తధ్యమని అంటున్నారు.

Tags:    

Similar News