గ్యాప్ పెరిగినట్లుందే.. ఏం జ‌రిగింది..?

వైసీపీ.. అంటేనే విజ‌య‌సాయిరెడ్డి.. విజ‌య‌సాయిరెడ్డి అంటే వైసీపీ..! అన్నట్టుగా 2017 నుంచి నిన్న మొన్నటి వ‌ర‌కు రాజ‌కీయాలు సాగాయి. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోను, రాష్ట్రంలోనూ విజయసాయిరెడ్డి [more]

Update: 2020-06-08 12:30 GMT

వైసీపీ.. అంటేనే విజ‌య‌సాయిరెడ్డి.. విజ‌య‌సాయిరెడ్డి అంటే వైసీపీ..! అన్నట్టుగా 2017 నుంచి నిన్న మొన్నటి వ‌ర‌కు రాజ‌కీయాలు సాగాయి. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోను, రాష్ట్రంలోనూ విజయసాయిరెడ్డి ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట‌ర్ ఇవ్వడంలోను.. పార్టీలో యువ‌త‌ను ముందుకు న‌డిపించ‌డంలోను, మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియాలోనూ దూకుడుగా ముందుకు సాగ‌డంలోను విజయసాయిరెడ్డి త‌న‌దైన శైలిలో దూకుడు ప్రద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో పార్టీలోనే నాయ‌కుడిగా ఉన్నప్పటికీ.. స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ఎక్కడా ప్రచారంలోకి రాలేక పోయారు.

ఎన్నికల సమయంలోనూ…..

అప్పుడప్పుడు మీడియా మీటింగులు పెట్టుకున్నా.. స‌జ్జల అంటే పెద్దగా గుర్తింపులేదు. ఎన్నిక‌ల స‌మయంలోనూ విజయసాయిరెడ్డి కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డిచాయి. ఉత్తరాంధ్ర జిల్లాల‌ను త‌న క‌నుస‌న్నల్లో పెట్టుకుని ఎన్నిక‌లు న‌డిపించారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వం ఏర్పడ‌క ముందు నుంచే విజయసాయిరెడ్డి జ‌గ‌న్‌, బీజేపీకి ద‌గ్గర కావ‌డంలోనూ అదే స‌మ‌యంలో చంద్రబాబు అధికారంలో ఉండి కూడా బీజేపీకి దూరం కావ‌డంలోనూ కీల‌క పాత్ర పోషించార‌న్న చ‌ర్చలు కూడా బ‌లంగా న‌డిచాయి. ప్రభుత్వం ఏర్పడిన‌ప్పటి నుంచి కొద్ది రోజుల క్రింద‌టి వ‌ర‌కు కూడా విజయసాయిరెడ్డి చాలా కీల‌కం అయ్యారు.

జగన్ వెంటే ఉంటానంటూ…..

అలాంటి విజయసాయిరెడ్డి అనూహ్యంగా త‌న అస్తిత్వాన్ని తానే ప్రచారం చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “నేను ప్రాణంతో ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్ వెంటే ఉంటాను!“- అని ఆయ‌న చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల విశాఖ‌లో ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు జ‌గ‌న్ వెంట వెళ్లేందుకు విజయసాయిరెడ్డి సిద్ధమ‌య్యారు. జ‌గ‌న్ ప్రయాణిస్తున్న కారులోనే ఆయ‌న ఎక్కేందుకు ప్రయ‌త్నించారు. అయితే, ఆయ‌న‌ను వ‌ద్దని ఆళ్లనానిని ఎక్కించుకున్నార‌నే ప్రచారం వ‌చ్చింది.

ఎల్జీ పాలిమర్స్ విషయంలో……

ఇక‌, ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న విష‌యంపై విజయసాయిరెడ్డిని మాట్లాడ వ‌ద్దని కూడా జ‌గ‌న్ ఆదేశించార‌ని, అందుకే ఆయ‌న దాని విష‌యం మాట్లాడ‌లేద‌నే ప్రచారం ఉంది. మొత్తంగా విజయసాయిరెడ్డిపై జ‌గ‌న్ అసంతృప్తితో ఉన్నార‌నే విష‌యం వైసీపీలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే, నిన్న మొన్నటి వ‌ర‌కు ఎవ‌రో కూడా తెలియ‌ని స‌జ్జల తెర‌మీదికి వ‌చ్చారు. సీఎంగా జ‌గ‌న్ చేస్తున్న స‌మీక్షల్లోనూ.. కార్యక్రమాల్లోనూ ఆయ‌నే ఉంటున్నారు. మీడియాతోనూ స‌జ్జలే మాట్లాడుతున్నారు. అదేస‌మ‌యంలోగ‌తంలో సోష‌ల్ మీడియాను ఘ‌నంగా నిర్వ హించామ‌ని చెప్పుకొన్న విజయసాయిరెడ్డికి కౌంట‌ర్‌గానా అన్నట్టుగా.. అదో చెత్త.. అని క‌రివేపాకు మాదిరిగా తీసే శారు స‌జ్జల‌. ఈ ప‌రిణామాల‌తోనే విజయసాయిరెడ్డి త‌న‌ను తానుగా నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడింద‌ని ఒక టాక్‌.

ప్రచారమేనా?

అయితే విజయసాయిరెడ్డి ప్లేస్‌ను స‌జ్జల రీప్లేస్ చేయ‌లేర‌నేది అంద‌రూ చెప్పే కీల‌క విష‌యం. ఢిల్లీలో బ‌ల‌మైన లాబీయింగ్ చేయ‌గ‌ల దిట్ట విజయసాయిరెడ్డి. ప్రశాంత్ కిశోర్‌ను స‌మ‌న్వయం ప‌రిచింది కూడా సాయిరెడ్డే. అయితే.. ఎందుకో.. ఇటీవ‌ల కాలంలో ఢిల్లీలో ఆయ‌న స‌రైన విధంగా లాబీయింగ్ చేయ‌లేక‌పోతున్నార‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే చిన్నపాటి గ్యాప్ ఏమైనా ఏర్పడిందా? అనే ప్రచారం కూడా జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రిగిందో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News