విజయసాయి అక్కడ అంటుకు పోతారట… ?

విజయసాయిరెడ్డి అంటే వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశంలో పేరెన్నిక కన్న చార్టెర్డ్ అకౌంటంట్. ఆయనలో రాజకీయ సత్తా ఇంత ఉంటుందా అన్నది వైసీపీలో ఎంపీ [more]

Update: 2021-09-15 08:00 GMT

విజయసాయిరెడ్డి అంటే వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశంలో పేరెన్నిక కన్న చార్టెర్డ్ అకౌంటంట్. ఆయనలో రాజకీయ సత్తా ఇంత ఉంటుందా అన్నది వైసీపీలో ఎంపీ అయ్యాక కానీ తెలియలేదు. ఇక మాస్ పల్స్ తెలిసిన నాయకులు తక్కువ మంది ఉంటారు. రాజ్యసభ సభ్యులు అంటే మీడియా ముందుకే అసలు రారు. పూర్తిగా తెర వెనకనే ఉంటారు. కానీ విజయసాయిరెడ్డి అలా కాదు పెద్దల సభలో తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూనే గల్లీలోనూ పోరాడేందుకు సై అంటారు. జగన్ కి వెన్నుదన్నుగా ఉండే విజయసాయిరెడ్డి అంటే వైసీపీ క్యాడర్ ప్రాణం పెడతారు.

వి ఫర్ విశాఖ…

విజయసాయిరెడ్డి ఇంటిపేరు వి. అంటే వేణుంబాకం విజయసాయిరెడ్డి అన్న మాట. అయితే ఆయన 2016లో విశాఖ రావడం జరిగింది. నాటి నుంచి విశాఖ సాయిరెడ్డిగానే మారిపోయారు. ఆయన నెల్లూరు జిల్లావాసి అన్నది చెబితే తప్ప ఎవరికీ తెలియదు. ఇదే తెలుగుదేశం తమ్ముళ్ళకూ మంటగానే ఉంది అంటారు. విజయసాయిరెడ్డిని సామంతరాజుగా వారు విమర్శిస్తున్నా, ఆయన వలసవాది అని ఆరోపణలు చేస్తున్నా దాని వెనక రాజకీయమే ఉంది. విజయసాయిరెడ్డిని నేరుగా ఢీ కొంటున్న టీడీపీకి గత మూడేళ్ళుగా వరస పరాభవాలే ఎదురవుతున్నాయి. దాంతో విజయసాయిరెడ్డి లేని విశాఖను వారు కోరుకుంటున్నారు. అలాంటి వారికి మరింత కలవరం కలిగేలా విజయసాయిరెడ్డి చేదు వార్త ఒకటి వినిపించారు. తాను విశాఖలోనే ఉంటాను.ఇక్కడే తన జీవితం అంటూ చెప్పేసరికి తమ్ముళ్ళకు జడుపు జ్వరమే పట్టుకుంటోంది.

అక్కడే ఆవాసం…

విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రెడీగానే ఉన్నాయి. విశాఖలో ఒక డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ మాత్రమే ఆయనకు ఉంది. అయితే రానున్న రోజుల్లో తాను భీమిలీలో స్థిరపడతాను అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. భీమిలీలో నాలుగెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటాన‌ని అని అంటున్నారు. అంటే విజయసాయిరెడ్డి కన్ను భీమిలీ మీద పడింది అనుకోవాలి. విశాఖ ఎంత సాఫ్ట్ గా ఉండే ప్రాంతమో అందరికీ తెలుసు. విశాఖ వచ్చిన అధికారులు కూడా ఇక్కడ తమకు ఒక ఫ్లాట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. రాజకీయ నేతలు కూడా అంతే. ఇపుడు విజయసాయిరెడ్డి విశాఖ కంటే అందమైన భీమిలీని ఎంచుకున్నారు. అక్కడ నుంచే తన రాజకీయ రధాన్ని నడుపుతాను అంటున్నారు.

ఆ ఆలోచన ఉందా…?

భీమిలీ తన చిరునామా అంటున్న విజయసాయిరెడ్డి రేపటి రోజున అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయరు కదా అన్న చర్చ అయితే వైసీపీలో ఉంది. ఆయన ఎంపీగా ఆరేళ్ల పాటు ఉన్నారు. మళ్ళీ రెన్యూవల్ చేయడానికి జగన్ రెడీగా ఉన్నారు. ఇక 2024 ఎన్నికల వేళ విజయసాయిరెడ్డి అసెంబ్లీకి వస్తాను అంటే జగన్ కాదనలేరు అన్న మాట కూడా ఉంది. భీమిలీ నుంచి మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా విజయసాయిరెడ్డి కావాలంటే ఆయనదే భీమిలీ అవుతుంది. పైగా ఇది వైసీపీకి వ్యూహాత్మకమైన ప్రాంతం. అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు రాజకీయపరంగా కానీ భీమిలీ బాగా కావాల్సిన ప్రాంతం. రాజధాని కనుక వస్తే భీమిలీయే పొలిటికల్ హాట్ స్పాట్ అని భావిస్తున్న వేళ విజయసాయిరెడ్డి నోట భీమిలీ మాట వచ్చిందా అన్న చర్చ అయితే ఉంది మరి.

Tags:    

Similar News