విజయసాయికి రాసిచ్చేశారటగా?

తెలుగుదేశం నేతల్లో అంత నిరాశ కనిపిస్తోందా. ఏకంగా అధినాయకత్వమే అలా ఆలోచిస్తోందా. లేకపోతే ఎక్కడో నెల్లూరు నుంచి విశాఖకు వచ్చి నివాసం ఏర్పరచుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి [more]

Update: 2021-06-13 15:30 GMT

తెలుగుదేశం నేతల్లో అంత నిరాశ కనిపిస్తోందా. ఏకంగా అధినాయకత్వమే అలా ఆలోచిస్తోందా. లేకపోతే ఎక్కడో నెల్లూరు నుంచి విశాఖకు వచ్చి నివాసం ఏర్పరచుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మొత్తం వైజాగ్ ని దారాదత్తం చేయడమేంటి. అది విశాఖపట్నం కాదు విజయసాయిపట్నమంటూ సెటైరికల్గా టీడీపీ అన్నా కూడా అందులో ఆందోళనా స్వరం వినిపించడమేంటి. ఈ మాట అన్నది కూడా సామాన్యుడు ఎవరో కాదు టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి వాడు అయిన లోకేష్ బాబు. ఆయన కోపంలో అన్నా కూడా మనసులో ఉన్న మాట అలా వచ్చేసిందా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.

ఓడి వాడిన వేళ…?

విశాఖ టీడీపీకి కంచు కోట. ఈ సంగతి అందరికీ తెలుసు. అలాంటి విశాఖలో టీడీపీకి ఇపుడు పొలిటికల్ గా చెప్పుకోవడానికి ఏం మిగిలింది అంటే లేదు అనే అనాలి. విశాఖ ఎంపీగా టీడీపీ గెలిచి రెండు దశాబ్దాలు అయింది. మేయర్ సీటు దక్కించుకుని మూడున్నర దశాబ్దాలు అయింది. ఇక ఎమ్మెల్యేలు సిటీకి నాలుగు దిక్కులా గెలిచినా కూడా గట్టిగా నిలిచేందుకు ఒక్కరన్నా లేరు అన్న చింత ఎటూ ఉంది. బలమైన నాయకులు నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. ఇక క్యాడర్ చూస్తే నిరాశలో ఉంది. దాంతోనే అధినాయకుడు లోకేష్ విజయసాయిరెడ్డిపై ఈ రకంగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.

నాటి కళలేవీ …?

లోకేష్ ఈ మధ్యన మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడానికి విశాఖ వస్తే ఆయన వెంట పట్టుమని పది మంది నాయకులు కూడా లేరు. మాజీ మంత్రులు, దిగ్గజ నేతలు ఆయన రాకను అసలు పట్టించుకోలేదు. ఇక లోకేష్ వైజాగ్ వచ్చినట్లు కూడా తెలియనట్లుగా టీడీపీలో సీనియర్లు గప్ చిప్ అయిపోయారు. దాంతో చాలా పేలవంగా చినబాబు టూర్ సాగిందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపించాయ్. ఆ తరువాత లోకేష్ లోనూ నిర్వేదం ఆవహించిందా అన్నది కూడా తమ్ముళ్ల మాటగా ఉంది. మొత్తానికి విశాఖను విజయసాయి పట్టణంగా లోకేషే చెప్పడంతో పొలిటికల్ గా వైసీపీ దే పైచేయి అని లోకేష్ బాబు తానే స్వయంగా ఒప్పేసుకున్నారు అంటున్నారు.

సౌండ్ చేయలేరా …?

విశాఖలో ఏ చిన్న ఘటన జరిగినా ట్విట్టర్ లో లోకేష్ కూత పెట్టాల్సిందే. ఇక ఆయన విమానమేసుకుని పరామర్శకు దిగి రావాల్సిందే. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది అధినాయకత్వం అర్ధం చేసుకోకుండా ఇంకా బేలతనంతో మీకే విశాఖ రాసిచ్చేశామని, ఏమైనా చేసుకోండి అంటూ ఆక్రోశంతో చేసిన మాటలకు విలువ ఉంటుందా అంటున్నారు తమ్ముళ్ళు. విశాఖలో కకావికలైన సైకిల్ కి రిపేర్లు చేయాల్సిన పెద్దలు ఇలా ఎంతసేపూ వైసీపీని తిడుతూ ఆ ఉక్రోషంలో పొలిటికల్ క్రెడిట్ మొత్తం వారికే ఇచ్చేస్తే ఇక పార్టీ బతికి బట్టకట్టేదెట్టా అని పసుపు శిబిరం కలవరపడుతోంది. దీన్ని బట్టి చూస్తూంటే విశాఖ మొత్తం విజయసాయిరెడ్డి మయం అయిందన్న సత్యాన్ని టీడీపీ గ్రహించింది. మాకు అదే సంతోషమని వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News