విజయసాయి అలా బెదిరిస్తున్నారా ?

విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే వైసీపీకి సర్వం సహా అన్న మాట ఉంది. ఆయన అనుమతి లేనిదే అక్కడ చీమ చిటుక్కుమనదు అని అంటారు. ఇక టీడీపీ [more]

Update: 2021-04-26 12:30 GMT

విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే వైసీపీకి సర్వం సహా అన్న మాట ఉంది. ఆయన అనుమతి లేనిదే అక్కడ చీమ చిటుక్కుమనదు అని అంటారు. ఇక టీడీపీ తమ్ముళ్ల భరతం పట్టాలన్నా వారి అక్రమాల గుట్టు తేల్చాలన్నా కూడా విజయసాయిరెడ్డి కను సైగ చేస్తే చాలు అన్న మాట ఉంది. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ కి చెందిన నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ ని గాజువాకలో తాజాగా కూల్చివేడం వెనక విజయసాయిరెడ్డి రాజకీయ మంత్రాంగం ఉంది అంటున్నారు.

రమ్మని పిలిచారా…?

విశాఖలో టీడీపీని జీరో చేసే పనిలో వైసీపీ ఉంది. ఈ నేపధ్యంలో బలమైన నేతలను ఆ పార్టీ నుంచి ఈ వైపునకు లాగేస్తున్నారు. అలా చాలా మంది నేతలు సైకిల్ దిగిపోయారు. అయితే మాజీ ఎమ్మెల్యే, బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ కి కూడా ఇలాంటి రాయబేరాలు వెళ్ళాయని అప్పట్లో ప్రచారం అయితే సాగింది. ఒక దశలో ఫుల్ సైలెంట్ అయిన పల్లా ఇక టీడీపీని వీడిపోతారు అని కూడా అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన్నే తెచ్చి విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గా చంద్రబాబు చేయడంతో మళ్లీ దూకుడు పెంచారు. మరి ఆయన్ని రమ్మని పిలిస్తే నాడు ఎందుకు రాలేదు, నిజంగా అలాంటి పిలుపులు వెళ్ళాయా పల్లాకువి జయసాయిరెడ్డి తరఫున వెళ్ళాయా అన్నది ఇపుడు చర్చ సాగుతోంది.

రివెంజి తీర్చుకున్నారా …?

తనను ఎన్ని బాధలు పెట్టినా టీడీపీని వీడే ప్రసక్తి లేదని పల్లా అంటున్నారు. తనను టీడీపీ నుంచి ఏ శక్తీ దూరం చేయలేదు అని కూడా ఆయన గర్జిస్తున్నారు. మరి ఆయన అలా ఎందుకు అనవలసివచ్చిందో అన్నదే ఇక్కడ పాయింట్. పైగా ఇపుడు ఆయన అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన వేళ ఇదంతా రివెంజి అని కూడా అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి వైసీపీలో చేరలేదనే శ్రీనివాస్ మీద ఇలా కక్ష కట్టారా అన్న దాని మీద కూడా హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. అయితే దీనికి వైసీపీ నేతల నుంచి కూడా కౌంటర్ పడుతోంది. మాకు బోలెడు మంది సమర్ధులైన నేతలు ఉన్నారు. పల్లా లాంటి వారి అవసరం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక అక్రమం అని తేలితే అధికారులు చర్యలు తీసుకుంటారు దానికి విజయసాయిరెడ్డికీ సంబంధం ఏంటి అని కూడా అంటున్నారు.

ఈయన మాటేంటి…?

సరే వైసీపీ నేతలు చెప్పిన మాటే నిజం అనుకుంటే ఈ మధ్యనే టీడీపీకి చెందిన సీనియర్ నేత కాశీ విశ్వనాధ్ వైసీపీ జెండా కప్పుకున్నారు. ఆయన ఇపుడు విజయసాయిరెడ్డి కోటరీలో కూడా ముఖ్యుడు అయిపోయారు. మరి ఇదే కాశీవిశ్వనాధ్ కి చెందిన లీజు భవనాలను కూడా భీమిలీలో కూలగొట్టడానికి కొన్నాళ్ల క్రితం ప్రయత్నం జరిగింది. అప్పట్లో అది రచ్చ కూడా అయింది. ఇపుడు ఆయన అధికార పార్టీలో ఉన్నారు. దాంతో ఆ ఊసే లేదు అంటున్నారు. అంటే ఆ వైపు నుంచి ఈ వైపునకు వచ్చేస్తే అక్రమం సక్రమం అయిపోతుందా అన్న మాట కూడా ఉంది. మరి పల్లా సంధించిన ప్రశ్నలను చూస్తే అధికార పార్టీలో ఉంటే సేఫ్ టీడీపీలో ఉంటే డేంజర్ అన్న సిగ్నలే పంపుతున్నారు అంటున్నారు. ఈ విషయంలో బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తోంది వైసీపీ అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి అది నిజమా కాదా అన్నది వైసీపీ నేతలే జవాబు చెప్పాలి. ఏది ఏమైనా కర్ర ఉన్నవాడితే బర్రె అన్నదే రాజకీయం కాబట్టి దీన్ని ఇలాగే చూడాలేమో.

Tags:    

Similar News