విజయసాయిని దూరం చేయడానికి… అందుకే కార్నర్?

విజయసాయిరెడ్డి ఇంటి పేరు వి. వి అంటే దాని అర్ధం విశాఖ అని వైసీపీ నేతలు గట్టిగా గర్వంగా చెబుతారు. విజయసాయిరెడ్డి కూడా తన పుట్టిన జిల్లా [more]

Update: 2021-02-27 13:30 GMT

విజయసాయిరెడ్డి ఇంటి పేరు వి. వి అంటే దాని అర్ధం విశాఖ అని వైసీపీ నేతలు గట్టిగా గర్వంగా చెబుతారు. విజయసాయిరెడ్డి కూడా తన పుట్టిన జిల్లా నెల్లూరు కంటే విశాఖనే ఎక్కువగా ఇష్టపడతాను అని చెబుతారు. ఆయన ఆరేళ్ళుగా విశాఖనే కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. వైసీపీకి కూడా ఘనమైన విజయాలు దక్కడంతో ఆయనకే అన్ని బాధ్యతలు జగన్ అప్పగించారు. విశాఖలో చీమ చిటుక్కుమన్నా కూడా విజయసాయిరెడ్డికి తెలిసేలా మెకానిజం రెడీ చేసుకుని పెట్టుకున్నారు.

ఫస్ట్ టైం అలా ….

ఇక చంద్రబాబు అంటే విజయసాయిరెడ్డికి ఎంత మంటో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ని ట్విట్టర్ లో ఆడుకోకపోతే ఆ రోజు గడిచినట్లుగా ఆయనకు ఉండదు. బాబుని ఇలా నిత్యం విడవకుండా సెటైర్లు వేసే మరో ప్రత్యర్ధి నేత బాబు పొలిటికల్ లైఫ్ లో ఎవరూ లేరు. అయినా గానీ బాబు విజయసాయిరెడ్డికి తాను డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా బుధ్ధ వెంకన్న లాంటి వారిని ఫీల్డ్ లోకి వదులుతారు. ఇలా సాగుతున్నా రాజకీయంలో ఒక్కసారిగా బాబు ఎంటర్ అయిపోయారు. విజయసాయిరెడ్డిని పేరు పెట్టి మరీ టార్గెట్ చేశారు. దీని అర్ధమేంటి మహానుభావా అని అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ చర్చ సాగుతోందిపుడు.

చిలక ప్రాణం అక్కడే….

విజయసాయిరెడ్డి సామాన్యుడు కాడు, వైసీపీ కుటుంబానికి మూడు తరాలుగా సన్నిహితుడు. పైగా జగన్ ఆత్మగా చెప్పుకుంటారు. జగన్ గుట్టుమట్లు మొత్తం ఆయనకే తెలుసు అని కూడా అంటారు. అందుకే బాబు తన రాజకీయం ఇలా మార్చారని అంటున్నారు. పైగా టీడీపీకి ప్రాణప్రదమైన విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలు గత రెండేళ్ళుగా రూటు మార్చేశాయి. సైకిల్ దిగిపోయి ఫ్యాన్ నీడకు చేరాయి. దాంతో స్థానిక ఎన్నికల్లోనూ దెబ్బ పడిపోతోంది. దీనికంతంటికీ విజయసాయిరెడ్డి కారణం అని కూడా బాబుకు తెలుసు. ఆయన్ని విశాఖకు దూరం చేస్తే తప్ప పట్టు సాధించలేమన్న ఉద్దేశ్యంతోనే బాబు డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు అంటున్నారు.

ఆయనదేనా పాపం…?

విశాఖ స్టీల్ ప్లాంట్ దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకు అమ్మకానికి పెడుతోంది కేంద్రం. అయితే పోస్కో ప్రతినిధులతో విజయసాయిరెడ్డి దుబాయ్ వెళ్ళి మరీ చర్చలు జరిపారు అంటూ ఈ మధ్యనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక కుట్ర ఉందని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన గట్టిగానే మాట్లాడారు, ఇపుడు చంద్రబాబు కూడా విజయసాయిరెడ్డి మీదనే విమర్శలు చేస్తున్నారు. విశాఖలో భూ కబ్జాలకు ఆయనే కారణమని నిందిస్తున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు విజయసాయిరెడ్డే జవాబు చెప్పాలని, ఆయన ఢిల్లీలో పోరాడి ప్లాంట్ ని నిలబెట్టాలని లేకపోతే తన పదవిని రాజీనామా చేసి తప్పుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డిని కార్నర్ చేస్తే అటు ఢిల్లీ, ఇటు గల్లీ పాలిటిక్స్ మొత్తం సెటిల్ అవుతుంది అన్న వ్యూహంతోనే బాబు ఇలా చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News