విజయసాయిరెడ్డికి బొత్స షాక్ ఇస్తారా… ?

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అని అంటారు. అలాంటిది ఒకరి ఇలాకాలోకి మరొకరు వచ్చి పెత్తనం చేయడమే పెద్ద విషయం. ఇక అలా వచ్చినాయన లోకల్ [more]

Update: 2021-09-03 02:00 GMT

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అని అంటారు. అలాంటిది ఒకరి ఇలాకాలోకి మరొకరు వచ్చి పెత్తనం చేయడమే పెద్ద విషయం. ఇక అలా వచ్చినాయన లోకల్ గా ఉన్న వారిని అసలు ఖాతరు చేయకపోతే అది ఇంకా విడ్డూరం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అలా ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా మారిపోయారు. ఆ మూడు జిల్లాలూ, ముప్పయి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీలో చీమ చిటుక్కుమంటే అది విజయసాయిరెడ్డికి తెలియాల్సిందే. ఆయనే వాటన్నిటికీ చక్కబెడతారు. లెక్కలు చూసి సెటిల్ చేస్తారు. మరి మిగిలిన వారు ఏంటి అంటే ఉత్తరాంధ్రాలో ఉత్సవ విగ్రహాలే అని చెప్పాలి.

బొత్స మార్క్ ప్లాన్ …

నిజానికి అందరి కంటే ఎక్కువగా మధనపడుతున్నది సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణే అంటున్నారు. ఆయన మూడు దశాబ్దాల సీనియారిటీ ఉంది. చేతిలో మంత్రి పదవి ఉంది. అయినా కూడా జగన్ కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. దాంతో పాటుగా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో బొత్స మననులోనే ఇన్నాళ్ళూ రగులుతూ వచ్చారు. ఇపుడు ఆయన తన బాధను అంతా జగన్ ముందు వెళ్ళబోసుకున్నారుట. సార్వత్రిక ఎన్నికలకు సగం టైమ్ మిగిలి ఉన్న వేళ లోకల్ లీడర్ గా తనకు బాధ్యతలు అప్పగిస్తే మొత్తం వ్యవహారాలను చక్కబెడతాను అంటున్నారుట. అలా విజయసాయిరెడ్డిని తప్పించాలని, తనను నియమించాల్ని బొత్స కోరుకుంటున్నారుట.

ఓకే అంటే ఆయనే…

మరో వైపు జగన్ కూడా బొత్స సీనియారిటీ మీద పూర్తి నమ్మకం ఉంచారు. ఆయన వయసుకు, సామాజిక వర్గానికి కూడా మర్యాద ఇస్తున్నారు. దీంతో పాటుగా విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను ఈ మధ్య సక్రమంగా చూడడంలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయన కూడా అస్మదీయులు, తస్మదీయులు అంటూ విభజించుకుని పార్టీని పాలిస్తున్నారు అన్న మాట కూడా ఉందిట. దాంతో పాటు ఢిల్లీని వదిలేసి విజయసాయిరెడ్డి ఎంతసేపూ గల్లీ సమస్యల మీదనే దృష్టి పెట్టడం వల్ల హస్తినలో లాబీయింగ్ కి కూడా అవకాశాలు ఉండడంలేదు అంటున్నారు. ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డిని ఢిల్లీ బాట పట్టించి బొత్సకు కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

ప్లస్ అవుతుందనే ….

ఉత్తరాంధ్రాలో బీసీలు ఎక్కువ. అంతే కాకుండా తూర్పు కాపులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బొత్సను ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా నియమించడం వల్ల పార్టీకి ప్లస్ అవుతునని జగన్ తలపోస్తున్నారుట. అదే టైమ్ లో బొత్స సీనియారిటీని కూడా వాడుకుంటే వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో మళ్ళీ మంచి ఫలితాలు వస్తాయని జగన్ ఆలోచిస్తున్నారుట. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే బొత్స కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మద్దతు కూడా ఉండడం. దాంతో పాటు విజయసాయిరెడ్డిని తప్పించాలని సజ్జల కూడా భావించడం. ఇలా అన్ని సమీకరణలు కలసి బొత్సకు పెద్ద బాధ్యతలు అందించబోతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News