పెద్దరికం పూర్తిగా పోయిందిగా ?

అదేంటో పెద్ద సభలో సభ్యులు కూడా పెద్ద మనుషులుగా వ్యవహరించడం లేదా అన్న సందేహాలు మేధావుల్లో వస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాతలు పెద్దల సభను నిర్వచించిన తీరే వేరు. [more]

Update: 2021-02-10 13:30 GMT

అదేంటో పెద్ద సభలో సభ్యులు కూడా పెద్ద మనుషులుగా వ్యవహరించడం లేదా అన్న సందేహాలు మేధావుల్లో వస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాతలు పెద్దల సభను నిర్వచించిన తీరే వేరు. ప్రజలలో ఉంటూ గెలవలేని వారు, ప్రతిభావంతులు, బుద్ధిజీవులకు సమున్నతమైన వేదికగా పెద్దల సభను రాజ్యాంగ నిర్మాతలు తీర్చిదిద్దారు. అటువంటి పెద్దల సభలో ఇపుడు పలువురు సభ్యులు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న నిందారోపణలు కూడా బాధాకరంగానే ఉన్నాయి.

అది తప్పేగా…?

ఎవరు అవునన్నా కాదన్నా వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉండడం తెలుగువారికి గర్వకారణం. భాషాభిమానం తెలుగు వారికి లేకపోవడం వల్లనే ఆయన విషయంలో ఎవరూ పెద్దగా ఓన్ చేసుకోవడంలేదు కానీ ఒక తెలుగువాడు ఉన్నత పీఠం మీద కూర్చోవడం అంటే రాజకీయాలకు అతీతంగా అంతా ఆనందించాలి. ఇక ఆయన రాజ్య సభకు చైర్మన్ గా ఉన్నారు. పైగా నెల్లూరు జిల్లా వాడు, ఇక వైసీపీ పార్లమెంటరీ నాయకుడు వి విజయసాయిరెడ్డి కూడా నెల్లూరు వాసే. మరి ఈ ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం ఏ స్థాయిలో ఉండాలి. కనీసం పెద్ద మనిషిగా సీనియర్ పొలిటీషియన్ గా అయినా వెంకయ్యనాయుడుని గౌరవించే స్థాయిలో అయినా ఉండాలిగా. అలాంటిది వెంకయ్యనాయుడుని పట్టుకుని తేలికగా మాట్లాడం విజయసాయిరెడ్డికే ఇబ్బందిగా మారింది.

ఆ కళ్ళద్దాలు తీయాల్సిందే ….?

ఒకే కులం అయినంతమాత్రాన అంతా ఒక్కటి అన్న భావన తప్పు. కానీ వైసీపీ నేతల మైండ్ సెట్ మాత్రం ఫలానా కులం వారంతా ఒక్కటి. అంతా కలసి చంద్రబాబుకు మేలు చేస్తారు అన్న భావనతో తమ మెదళ్లను నింపుకున్నారు. దానికి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు, ఎన్నికల సంఘం పెద్దలు, ఇంకా టాప్ పొజిషన్ లో ఉన్న వారు కూడా అతీతులు కానట్లుగా ఉంది. కొందరు చీకట్లో అలా చేసి ఉండవచ్చు. వ్యవస్థలను కూడా పక్కన పెట్టి సహకరించవచ్చు. కానీ అందరూ అలా అనుకోవడానికి లేదు. పైగా ఎవరు ఏం చేసినా జనాలకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకుని బయటకు లాగి వైసీపీ నేతలు పలుచన కావాల్సిన అవసరం అంతకంటే లేదు.

డ్యామేజేగా…?

వెంకయ్యనాయుడు రాజకీయంగా శిఖరం మీద ఉన్నారు. ఆయన రాజ్యాంగ పదవిని చేపట్టి ఇంకా ఎత్తున నిలిచారు. రేపటి రోజున అదృష్టం వరిస్తే ఈ దేశానికి రాష్ట్రపతి కూడా అవుతారు. ఆయన విషయంలో ప్రధాని మోడీకి కూడా ఏ రకమైనా విభేదాలు కూడా లేవు. మరి అటువంటి వెంకయ్య మీద సంకుచిత విమర్శలు చేసి సారీ చెప్పిన విజయసాయిరెడ్డి పార్టీకే ఏకంగా పెద్ద డ్యామేజ్ చేశారని అంటున్నారు. పెద్దల సభలో దాదాపుగా అయిదారేళ్ళుగా ఉంటూ అనుభవం గడించిన విజయసాయిరెడ్డి మరింత హుందాగా నడచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆయన లాంటి సీనియర్ నేతల వైఖరి మొత్తం పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది. తటస్థులను, మేధావులను పార్టీకి దూరం చేస్తుంది. దీన్ని గుర్తించాలి అని ఆ పార్టీలోనే ఒక చర్చ ఉందిపుడు.

Tags:    

Similar News