రాజ‌ధాని ఎఫెక్ట్: ఆ టీడీపీ ఎమ్మెల్యేకి బాగానే త‌గిలిందా…?

రాజ‌ధాని మార్పు, మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యం .. అధికార పార్టీలో పండ‌గ వాతావ‌ర‌ణం సృష్టిస్తుంటే.. ప్రతిప‌క్షంలో మాత్రం సెగ‌లు పుట్టిస్తోంది. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఆది [more]

Update: 2020-07-27 06:30 GMT

రాజ‌ధాని మార్పు, మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యం .. అధికార పార్టీలో పండ‌గ వాతావ‌ర‌ణం సృష్టిస్తుంటే.. ప్రతిప‌క్షంలో మాత్రం సెగ‌లు పుట్టిస్తోంది. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఆది నుంచి టీడీపీ ప‌ట్టుబ‌డుతోంది. ఇక్కడ ఉద్యమాలు చేస్తోంది. చేయిస్తోంది. అమ‌రావ‌తి కోసం అన్ని రూపాల్లోనూ పోరాడుతోంది. చంద్రబాబు ఏకంగా జోలెప‌ట్టారు. త‌న స‌తీమ‌ణిని కూడా రంగంలోకి దింపి.. రాజ‌ధాని విష‌యంలో విరాళాలు ఇప్పించారు. అయితే, ఈ సెగ‌.. మిగిలిన జిల్లాల‌కు కూడా పాకుతోంది. కానీ, అది టీడీపీకి అనుకూలంగా కాకుండా వ్యతిరేక కోణంలో కావడం గ‌మ‌నార్హం.

ఆయన ఒక్కరే….

విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేస్తాన‌ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక్కడ మాత్రం శాస‌న‌స‌భ ఉంటుంద‌ని అంటున్నారు. అయితే, అన్నీ ఇక్కడే ఉండాల‌ని చంద్రబాబు, ఆయ‌న ప‌రివారం అంద‌రూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప‌రిణామం.. విశాఖ‌లో వ్యతిరేక‌త పెంచుతోంది. ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను గెలుచుకుంది. విశాఖ న‌గ‌రంలో టీడీపీ నేత‌ల‌దే హ‌వా. అయితే, వీరు విశాఖ‌లో ప‌రిపాల‌న రాజ‌ధాని విష‌యంలో త‌ట‌స్థంగా ఉన్నారు. ఒక‌వైపు చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకిస్తుంటే.. ఇక్కడ నుంచి గెలిచిన వారిలో వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు ఒక్కరే బ‌హిరంగంగా వ్యతిరేకించారు.

మిగిలిన ముగ్గురూ….

మిగిలిన వారి ముగ్గురూ మౌనం పాటిస్తున్నారు. కానీ అడ‌పాద‌డ‌పా రామ‌కృష్ణబాబు మాత్రం రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని విశాఖ‌లో వైఎస్సార్ సీపీ దోపిడీ చేసేందుకు వ‌స్తోంద‌ని తీవ్ర వ్యాఖ్యలుచేశారు. రామ‌కృష్ణ బాబు విజ‌య‌వాడ వాసే. ఆయ‌న విశాఖ‌లో సెటిల్ అయ్యి అక్కడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా చంద్రబాబు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. అందుకే ఆయ‌న విజ‌య‌వాడ సొంత గ‌డ్డ కావ‌డంతో ఆ ప్రేమ క‌మ్మ గా చాటుకున్నార‌ని ప్రతిప‌క్షాలు విమ‌ర్శలు కూడా చేశాయి.

ప్రజల నుంచి……

ఇది ఎంత దూరం వెళ్లిందంటే.. తాజాగా విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని రామకృష్ణపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వ‌చ్చిన వెల‌గ‌పూడి రామకృష్ణ బాబును ప్రజ‌లు అడ్డుకునే వ‌ర‌కు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అధికారం మీకు లేదంటూ ప్రజ‌లు నినాదాలు చేశారు. వారికి రామకృష్ణబాబు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా జనం గొడవకు దిగ‌డం కొస‌మెరుపు. ఎమ్మెల్యే అనుచరులపై కూడా ఎప్పుడూ లేని విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంపై ఆరా తీస్తే విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని వెలగపూడి వ్యతిరేకించడమే కారణమని తెలిసింది. మ‌రి మున్ముందు ఇంకెంత వ్యతిరేక‌త చూడాలోన‌ని త‌మ్ముళ్లు మ‌ద‌‌న ప‌డుతున్నారు.

Tags:    

Similar News