వెలగపూడికి బీసీ దెబ్బ ?

విశాఖలోని తూర్పు నియోజకవర్గం అందరికీ ఆకట్టుకుంటోంది. ఈ నియోజకవర్గం పుట్టిన తరువాత ఇంతవరకూ పసుపు జెండా తప్ప మరొకటి ఎగరలేదు. ఇక విశాఖకు వ్యాపారం నిమిత్తం వలస [more]

Update: 2021-09-12 11:00 GMT

విశాఖలోని తూర్పు నియోజకవర్గం అందరికీ ఆకట్టుకుంటోంది. ఈ నియోజకవర్గం పుట్టిన తరువాత ఇంతవరకూ పసుపు జెండా తప్ప మరొకటి ఎగరలేదు. ఇక విశాఖకు వ్యాపారం నిమిత్తం వలస వచ్చిన వెలగపూడి రామకృష్ణబాబుని ఇక్కడ జనాలు నిజంగా నెత్తికెక్కించుకున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు గెలిపించారు. అది కూడా వైఎస్సార్, చిరంజీవి, జగన్ వంటి వారి చరిష్మాలను తట్టుకుని వెలగపూడి రామకృష్ణ గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే వెలగపూడిని ఓడించేందుకు ఈసారి పకడ్బంధీ స్కెచ్ తో వైసీపీ దిగిపోతోంది అంటున్నారు.

వారిని ఉసి గొలిపి….

విశాఖ జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉంటారు. ఇక తూర్పు నియోజకవర్గంలో వారి సంఖ్య నూటికి తొంబై శాతంగా ఉంది. వీరిలో యాదవులది పై చేయి. దాంతో ఆ సామాజికవర్గాన్ని వైసీపీ మచ్చిక చేసుకుంది. కీలకమైన విశాఖ‌ మేయర్, వీఎమ్మార్డీయే పదవులు వారికే కట్టబెట్టింది. అంతే కాదు, ఇదే నియోజకవర్గానికి చెందిన వంశీక్రిష్ణకు కూడా తొందరలోనే ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వనుంది. ఇలా ఒక నియోజకవర్గానికి ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవులు వైసీపీ పంచిపెడుతోంది అంటే వెలగపూడి రామకృష్ణని ఎంతలా టార్గెట్ చేసిందో అర్ధం చేసుకోవాల్సిందే.

అదే లెక్కట….

వెలగపూడి రామకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అన్న మాటే కానీ ఆయన నియోజకవర్గానికి ఏం చేశారు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఆయన రెండు సార్లు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఆయన తూర్పులో ప్రగతి మార్పు కోసం ఏం చేసింది లేదన్న విమర్శలు ఉన్నాయి. తన సొంత ప్రయోజనాలు చూసుకున్నారని, తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. ఇక వెలగపూడి మీద సొంత పార్టీలోనూ అసంతృప్తి ఉంది. దానితో ఆయనకు టికెట్ ఇచ్చినా ఈసారి క్యాడర్ మనస్పూర్తిగా పనిచేస్తారా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే వెలగపూడి రామకృష్ణ మైనస్ లే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్లస్ అవుతాయని అంటున్నారు. దాంతో పాటు బీసీ నినాదం కూడా ఈ అగ్ర కుల ఎమ్మెల్యే కొంప ముంచబోతోంది అంటున్నారు.

టార్గెట్ అయ్యారు….

వెలగపూడి రామకృష్ణ మీద వైసీపీ హై కమాండ్ చూపు ఉంది. మిగిలిన వారు ఏదో విధంగా తగ్గినా వెలగపూడి రామకృష్ణ మాత్రం గట్టిగానే నిలబడుతున్నారు. విశాఖలో టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారు. అంతే కాదు, అమరావతి రాజధాని అంటూ వైసీపీ కలల రాజధాని విశాఖను తగ్గించేలా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కలిసి ఆయనకు తొలి ఓటమి రుచి చూపించాలన్న కసి అయితే వైసీపీ పెద్దలలో బాగా పెరిగిపోతోంది. వెలగపూడి ఓడితే విశాఖ రాజకీయాల్లో తమ పట్టు పూర్తిగా నిలబెట్టుకున్నట్లు అవుతుంది అని కూడా వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అవుతారు అని అపుడే ఫ్యాన్ పార్టీ నేతలు ప్రచారం మొదలెట్టేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News