ఈ ఇద్దరూ నాడు అలా.. నేడు ఇలా

కాంగ్రెస్ తో నాడు ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతా తామేగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు [more]

Update: 2021-04-04 11:00 GMT

కాంగ్రెస్ తో నాడు ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతా తామేగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు వారు రాజకీయాలకు పూర్తిగా దూరం. అసలు రాజకీయాలంటేనే ఆసక్తి పోయింది. కేవలం తమ వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యారు. వారే మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంత్ కుమార్. ఈ ఇద్దరూ ఇప్పుడు రాజకీయాలు అంటేనే పెదవి విరుస్తున్నారు.

పదేళ్ల పాటు మంత్రిగా….

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రఘువీరారెడ్డి మంత్రిగా పనిచేశారు. అనంతపురం జిల్లాలోని మడకశిర కు చెందిన రఘువీరారెడ్డి ఏపీ రాజకీయల్లో ఒక వెలుగు వెలిగారు. మంత్రిగా పనిచేశారు. వైఎస్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకూ మంత్రిగా పనిచేశారు. అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.

పూర్తిగా వ్యవసాయానికే…..

అయితే కాంగ్రెస్ కు ఇక భవిష్యత్ లేదని భావించిన రఘువీరారెడ్డి ఇప్పుడు పూర్తిగా వ్యవసాయానికే పరిమితమయ్యారు. సొంత గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటూ మిగిలిన జీవితం గడపాలనుకుంటున్నారు. ఎవరైనా తనను కలవాలని వచ్చిన వారిని మాత్రమే కలుస్తున్నారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన ఓటు వరకూ వేసేసి తన పాత్ర ఇంతేనని రఘువీరారెడ్డి చెప్పకనే చెప్పారు.

వట్టి కూడా విశాఖలో…..

ఇక మరో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ సయితం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. విశాఖలోని సాగర్ నగర్ లో నివాసముంటున్నారు. ఎప్పుడైనా తన పాతమిత్రులు వస్తే కలవడం తప్ప ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉంగుటూరు వైపు కూడా చూడటం లేదు. ఎవరైనా పలకరించడానికి వస్తే రాజకీయాలు మానేసి చాలా రోజులయిందని నవ్వేస్తున్నారు. వట్టివసంతకుమార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. ఒకనాడు హంగూ ఆర్భాటాలతో వెలిగిపోయిన నేతలిద్దరూ ఇప్పుడు పూర్తిగా వాటికి దూరంగా ఉంటున్నారు.

Tags:    

Similar News