వైసీపీలో కోలాటమేనా… ?

విశాఖ సౌత్ లో వైసీపీ పట్టు సాధించలేక టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని తెచ్చి తాము అక్కడ ఉన్నామనిపించుకుంది. వాసుపల్లి మొత్తం పొలిటికల్ కెరీర్ [more]

Update: 2021-06-14 12:30 GMT

విశాఖ సౌత్ లో వైసీపీ పట్టు సాధించలేక టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని తెచ్చి తాము అక్కడ ఉన్నామనిపించుకుంది. వాసుపల్లి మొత్తం పొలిటికల్ కెరీర్ పద్నాలుగేళ్ళు. అందులో ఏడాది తప్ప మిగిలినది అంతా టీడీపీలోనే గడిచింది. ఆయనకు సొంత ఇమేజ్ తో పాటు సామాజిక వర్గం బలం కూడా కలసి రావడంతో వరసగా రెండు సార్లు సౌత్ నుంచి గెలిచారు. అయితే తాజాగా జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో సౌత్ లో సగానికి సగం సీట్లు వైసీపీ కోల్పోయింది. దానికి కారణం వాసుపల్లి వర్గం, పాత వైసీపీ నాయకుల మధ్యన వైషమ్యాలే అన్నది తెలిసిందే.

మళ్ళీ చిచ్చు మొదలైందిగా …?

సౌత్ లో అప్పటిదాకా ఉన్న వారిని కాదని వాసుపల్లి తన వర్గం వారికే కార్పోరేటర్ టికెట్లు ఇవ్వడంతో కొన్ని చోట్ల వైసీపీ ఓడింది. అలా రెబెల్స్ గా గెలిచిన వారు ముగ్గురు ఇపుడు తిరిగి వైసీపీలో చేరిపోయారు. దాంతో వారికి కండువాలు కప్పేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సౌత్ లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఇదిలా ఉంటే వాసుపల్లి వర్గానికి ఈ పరిణామాలు మింగుడు పడడంలేదు. తన అనుచరులను ఓడించిన వారిని తిరిగి పార్టీలోకి ఎలా తీసుకుంటారు అన్నది ఎమ్మెల్యే మనుషుల ప్రశ్నగా ఉంది.

పోటీగా రెడీ …

మరో వైపు చూసుకుంటే విశాఖ సౌత్ నుంచి 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కోలా గురువులు పార్టీలో తిరిగి చేరిన రెబెల్స్ కి ఘన స్వాగతం పలకడం చర్చనీయాంశం అవుతోంది. వారంతా పార్టీలో ముందు నుంచి ఉన్న వారే అని, చిన్న విభేధాలతో పక్కకు వెళ్లారు తప్ప రెబెల్స్ కానే కాదు అని కోలా గురువులు అంటున్నారు. వారు ఇపుడు ఆయన వర్గంలో ఉన్నారు. అలాగే, సౌత్ లో తన మద్దతుని మరింతగా పెంచుకుని 2024 నాటికి ఎమ్మెల్యే టికెట్ వైసీపీ నుంచి పొందాలని కోలా గురువులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

రివర్స్ గేరేనా …?

అయితే వాసుపల్లి అధికార పార్టీ వైసీపీలో ఉంటూ తన పనులు తాను చక్కబెట్టుకుంటున్నారు. పైగా టీడీపీని ఒక్క మాట కూడా ఆయన అనడంలేదు. వైసీపీకి 2024 లో విజయావకాశాలను బట్టి ఆయన నిర్ణయం ఉంటుంది. ఒకవేళ టీడీపీకి గాలి అనుకూలంగా ఉంటే మళ్ళీ వాసుపల్లి సైకిలెక్కేయడం ఖాయమే అంటున్నారు. వాసుపల్లి ఇలా ఆప్షన్లు ఉంచుకోవడంతో వైసీపీ కూడా ఆయనకు పోటీగా మరో వర్గాన్ని సౌత్ లో బలోపేతం చేస్తోంది అంటున్నారు. మొత్తం మీద చూస్తే వాసుపల్లి వైసీపీని పూర్తిగా నమ్మడంలేదు, అలాగే వైసీపీ కూడా ఆయన మీద పూర్తి భరోసాతో ముందుకు సాగడంలేదు అంటున్నారు.ఈ పరిణామాలతో సౌత్ లో రాజకీయ కోలాటమే సాగుతోంది. ఎన్నికలకు మూడేళ్ళ వ్యవధి ఉందని, ఇప్పటికైనా సరైన నాయకత్వాన్ని ఎంచుకోకపోతే మళ్ళీ పార్టీకి ఇబ్బందులు తప్పవని అసలైన కార్యకర్తలు చెబుతున్నారు.

Tags:    

Similar News