ఈ ఎమ్మెల్యేపై ఎందుకంత వ్యతిరేకత?

ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేసి ప్రజాప్రతినిధులుగా వ‌స్తే.. ఏం జ‌రుగుతుంది. మ‌రింత‌గా అభివృద్ధి జ‌ర‌గ‌డంతోపాటు.. ప్రజ‌ల‌కు కూడా స‌మ‌స్యలు త్వర‌గా ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని [more]

Update: 2019-11-14 03:30 GMT

ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేసి ప్రజాప్రతినిధులుగా వ‌స్తే.. ఏం జ‌రుగుతుంది. మ‌రింత‌గా అభివృద్ధి జ‌ర‌గ‌డంతోపాటు.. ప్రజ‌ల‌కు కూడా స‌మ‌స్యలు త్వర‌గా ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. ఆయా అధికారుల‌కు అనుభ‌వం రీత్యా సంక్రమించిన అవ‌గాహ‌నే. ప్రజ‌ల స‌మ‌స్యల‌పై ఉన్న ప‌ట్టు. అయితే, ఇప్పుడు ఇదే ఐఏఎస్ మాజీ అధికారి ఒక‌రు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా.. ప్రజ‌ల్లో మంచి పేరు మాట అటుంచి అసలు తీవ్ర వ్యతిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటున్నార‌నే పేరు వ‌స్తోంది. ఆయ‌నే నెల్లూరు జిల్లా గూడూరు నుంచి గెలిచిన మాజీ ఐఏఎస్ వెల‌గ‌ల వ‌ర‌ప్రసాద్‌. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఈయ‌న త‌మిళ‌నాడులో క‌లెక్టర్‌గా ప‌నిచేసి రిటైర్ అయ్యారు. నిజాయితీ ప‌రుడిగా, వివాద ర‌హితుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు.

పదవీ విరమణ చేసిన తర్వాత…..

ఆయ‌న స్వస్థలం కృష్ణా జిల్లాలోని ముదినేప‌ల్లి. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వ‌ర‌ప్రసాద్‌ రాజ‌కీయ ప్రవేశం చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి ఎంపీగా పోటీ చేసి బ‌ల‌మైన పోటీ ఇచ్చిమ‌రీ గెలుపు గుర్రం ఎక్కారు. పార్టీలో కీల‌క నాయ‌కుడిగా వ‌ర‌ప్రసాద్‌ కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఆయ‌న ఎంపీ కాదు.. నాకు ఎమ్మెల్యే టికెట్ కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ గూడూరు ఎమ్మెల్యే టికెట్ సంపాయించుకుని మ‌రీ విజ‌యం సాధించారు.

ఆరు నెలలు కాకముందే….

వాస్తవానికి ఇక్కడ టీడీపీ గూడూరు మాజీ ఎమ్మెల్యే బ‌ల్లి దుర్గా ప్రసాద్ కూడా వైసీపీలో చేరి ఇదే టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్టారు. అయితే, జ‌గ‌న్ మాత్రం వ‌ర‌ప్రసాద్‌కు మొగ్గు చూపారు. దీంతో దుర్గా ప్రసాద్ తిరుప‌తి ఎంపీగాను, వ‌ర‌ప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేగాను పోటీ చేశారు. పాశం సునీల్ సునీల్‌పై గెలిచి రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే, వ‌ర‌ప్రసాద్ ఎన్నికై ఆరు మాసాలు కూడా కాక‌ముందే.. ఇక్కడ రాజ‌కీయంగా ఆయ‌న దూకుడు పెంచార‌ని అంటున్నారు.

నాయకులు ఎక్కువ కావడంతో…

పాల‌న‌లో దూకుడు క‌న్నా వివాస్పద నిర్ణయాల‌తోనే వ‌ర‌ప్రసాద్‌ వార్తల్లో నిలుస్తున్నారు. త‌న సొంత నిర్ణయాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని, పార్టీలోని ఏ ఒక్కరి అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వడం లేద‌ని, గ‌తంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా వ్యతిరేకించిన కార్యక్రమాల‌కు ఇప్పుడు జై కొడుతున్నాడు. ఈ ప‌రిణామం జిల్లా వైసీపీ నాయ‌క‌త్వానికి త‌ల‌నొప్పిగా మారింది. నిజానికి గూడూరులో వైసీపీ నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ బ‌హునాయ‌కత్వంతో ఇబ్బంది ప‌డుతోంది.

వద్దు వద్దంటున్నా….

పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, మాజీ మునిసిప‌ల్ చైర్మన్ దేవ‌సేన‌, ఎల్లసిరి వేణుగోపాల్‌రెడ్డి వంటి కీల‌క నాయ‌కులు ఇక్కడ పార్టీని ముందుకు న‌డిపిస్తున్నారు. గ‌తంలో ఏయే పార్టీల్లో ఉన్నప్పటికీ..ఇప్పుడు మాత్రం వైసీపీ కోసం ఎవ‌రి పంథాలో వారు ప‌నిచేస్తున్నారు. అయితే, వీరంతా కూడా వ్యతిరేకిస్తున్నా.. గ‌తంలో వైసీపీ నాయ‌కులు కూడా తీవ్రంగా వ్యతిరేకించిన ఓ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వ‌ర‌ప్రసాద్ భుజాల‌పై మోస్తున్నారు. అదే లెద‌ర్ ఫ్యాక్ట‌రీ. దీనిని టీడీపీ గ‌వ‌ర్నమెంట్‌లో వైసీపీ నాయ‌కులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా యూనిట్ పెట్టి ఉపాధి క‌ల్పిస్తే.. ఎలాంటి స‌మ‌స్య లేద‌ని చెబుతున్న వారు.. ప్రాసెసింగ్ యూనిట్ వ‌ద్దని ఆందోళ‌న చేస్తున్నారు.

అభిప్రాయ సేకరణ జరిపి….

దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యంతోపాటు.. నీటి కాలుష్యం పెరుగుతుంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిని వ‌ర‌ప్రసాద్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. అభిప్రాయ సేక‌ర‌ణ అంటూ.. యూనిట్‌ను, ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ప్రారంభించేందుకు త‌న అంగీకారం ప‌రోక్షంగా తెలిపేశారు. చివ‌ర‌కు ఫ్యాక్టరీ యాజ‌మాన్యాన్ని తీసుకువ‌చ్చి మ‌రీ ద‌గ్గరుండి అభిప్రాయ సేక‌ర‌ణ చేయించ‌డంతో ఆయ‌న‌పై మ‌రింత వ్యతిరేక‌త పెరిగింది. దీంతో గూడూరులో వైసీపీ నాయ‌కులు త‌లలు ప‌ట్టుకుంటున్నారు.

అందరితో వివాదాలే….

వాస్తవానికి ఎన్నిక‌ల ప్రచార స‌మ‌యంలోనే వ‌ర‌ప్రసాద్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు ఇటు పార్టీని, అటు ప్రజ‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు. అధికారుల‌తోనూ క‌లుపుకొని పోవ‌డం లేదు. ఐఏఎస్ అధికారి ఎంపీ అయ్యాడు. అయితే ఎంపీలు వేరు… ఎమ్మెల్యేలు వేరు. ఎమ్మెల్యేల‌కు నిత్యం ప్రజ‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉండాలి. సీనియ‌ర్ అధికారిగా ప‌నిచేసిన వ‌ర‌ప్రసాద్‌ అటు ప్రజ‌ల‌కు, ఇటు పార్టీ నేత‌ల‌కే కాకుండా అధికారుల‌కు సైతం దూర‌మ‌వుతోన్న ప‌రిస్థితి. అస‌లు ప్రజ‌ల‌ను, కేడ‌ర్‌ను ఎలా ? క‌లుపుకుని పోవాల‌న్నదే వ‌ర‌ప్రసాద్‌ కు తెలియ‌డం లేదంటున్నారు. దీంతో ఈ య‌న వ్యవ‌హార శైలిపై అధినేత జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేయాల‌నే యోచ‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News